దేశంలో ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను చాప కింద నీరులా నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నిజామాబాద్ జిల్లా బోధన్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో బుధవారం దిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఈ చర్యల్లో భాగంగా స్థానిక యువకుడిని అదుపులోకి తీసుకుని సమీపంలోని ఎడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ నాలుగు గంటల పాటు విచారణ చేసిన తర్వాత కోర్టులో హాజరు పరిచి, అనంతరం కస్టడీకి తీసుకున్నారు.
25
ఉగ్రవాద అనుబంధం అనుమానం
సదరు యువకుడు బీ-ఫార్మసీ చదువుతున్నాడని సమాచారం. అయితే అతను ఉగ్రవాదులతో సంబంధమున్న యాప్ల ద్వారా ఆయుధాలు, మందుగుండు సామగ్రి తయారీ విధానాలు నేర్చుకుంటూ చురుకుగా వ్యవహరిస్తున్నాడనే రహస్య సమాచారం ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టారు. తనిఖీల్లో ఎయిర్ పిస్టల్, కొన్ని బుల్లెట్లు స్వాధీనం అయ్యాయి.
35
డానిష్ విచారణలో వెలుగులోకి
ఇటీవల ఝార్ఖండ్లోని రాంచీ పట్టణంలో డానిష్ అనే ఉగ్రవాది బాంబు దాడుల కుట్రలో అరెస్ట్ అయ్యాడు. అతని విచారణలోనే బోధన్ యువకుడి పేరు బయటపడింది. డానిష్ సోషల్ మీడియా యాప్ల ద్వారా ఆయుధాల తయారీ, వినియోగం, సరఫరా వంటి పనులు చేస్తుండగా, బోధన్ యువకుడు కూడా ఆ గ్రూపులో ఉన్నాడని ప్రత్యేక బృందాలు గుర్తించాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా పలు అరెస్టులు జరిగాయి.
ఈ ఘటన బోధన్లో కలకలం రేపింది. స్థానిక ప్రజలు ఆశ్చర్యానికి గురవుతుండగా, యువకుడి కుటుంబం మాత్రం “మా బంధువుకు ఉగ్రవాదంతో సంబంధం లేదు” అని స్పష్టం చేసింది. నిందితుడు సోదరుడి ప్రకారం – దిల్లీ పోలీసులు విచారణ చేసిన మాట వాస్తవమే కానీ, తమ్ముడు ఒక వెబ్సైట్లో వీడియో కాల్లు మాత్రమే చేసేవాడని, అంతకుమించి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు.
55
ఇదే తొలిసారి కాదు
ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఎన్ఐఏ, ఐబీ అధికారులు బోధన్ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. 2021లో బంగ్లాదేశీయులు 72 మంది బోధన్ నుంచి నకిలీ చిరునామాలతో పాస్పోర్టులు పొందారు. వీరిలో 32 మంది ఒకే ఇంటి నంబరుపై పాస్పోర్టు పొందడం బయటపడింది. ఆ పాస్పోర్టులను రద్దు చేసి, నిందితులు, వారికి సహకరించిన వారిని అరెస్టు చేశారు. 2022లో ఓ ఇంటిపై ఎన్ఐఏ సోదాలు జరిపింది. అదే ఏడాది సెప్టెంబరులో నిజామాబాద్లో ఒకరిని అదుపులోకి తీసుకోగా, ఆర్మూర్కు చెందిన ఇద్దరికి కూడా విచారణ నోటీసులు జారీ చేశారు.