రూ. 1641 కోట్ల‌తో నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం.. ఈ రెండు ప‌ట్ట‌ణాల మ‌ధ్య త‌గ్గ‌నున్న ప్ర‌యాణ స‌మ‌యం

Published : Aug 04, 2026, 06:07 PM IST

Telangana: తెలంగాణ‌లో రెండు ప్ర‌ధాన ప‌ట్ట‌ణాలైన వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్‌ల మ‌ధ్య కీలక రహదారి ప్రాజెక్టు చివరి దశకు చేరుకుంది. రూ.1,641 కోట్లతో నిర్మిస్తున్న ఈ నాలుగు లైన్ల జాతీయ రహదారి పనులు ఇప్పటికే 85 శాతం పూర్తయ్యాయి.

PREV
15
68 కిలోమీటర్ల పొడవున ఆధునిక హైవే

ఈ కొత్త జాతీయ రహదారి మొత్తం 68 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్నారు. పలివెల్పుల సమీపంలో ప్రారంభమై ఎల్లాపూర్, ఎల్కతుర్తి, తిమ్మాపూర్, కేశవపట్నం, నుగునూర్ మీదుగా మానకొండూర్ బైపాస్ వరకు విస్తరించనుంది. ఈ మార్గం జాతీయ రహదారి-163తో అనుసంధానమవుతుంది. భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని నాలుగు లైన్లుగా తీర్చిదిద్దుతున్నారు.

25
ఆధునిక సదుపాయాలతో నిర్మాణం

హైవే నిర్మాణంలో ప్రయాణికుల భద్రత, ట్రాఫిక్ సౌలభ్యానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో 23 వెహికల్ అండర్‌పాస్‌లు, 121 బాక్స్ కల్వర్టులు, తిమ్మాపూర్ వద్ద చిన్న వంతెన, మానకొండూర్ వద్ద బైపాస్, శంకరపట్నం సమీపంలో అదనపు కల్వర్టులు ఏర్పాటు చేస్తున్నారు. హనుమకొండ వైపు నుంచి ఎర్రగట్టుగుట్ట, పరకాల రోడ్డు, గంటూర్‌పల్లి రోడ్డు, హసన్‌పర్తి, ఎల్లాపూర్ ప్రాంతాల ద్వారా ఈ హైవేలోకి వాహనాలు ప్రవేశించేలా కనెక్టివిటీ కల్పిస్తున్నారు.

35
త‌గ్గ‌నున్న ప్ర‌యాణ స‌మ‌యం

ప్రస్తుతం వరంగల్ నుంచి కరీంనగర్ చేరుకోవడానికి సుమారు రెండున్నర గంటల సమయం పడుతోంది. కొత్త ఫోర్‌లేన్ రహదారి పూర్తయిన తర్వాత ఈ ప్రయాణ సమయం దాదాపు గంటన్నరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయాలు తగ్గడంతో ఇంధన వినియోగం తగ్గడమే కాకుండా వాణిజ్య వాహనాల రాకపోకలు మరింత వేగంగా సాగనున్నాయి. పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు బైపాస్ మార్గాలు కూడా ఉపయోగపడనున్నాయి.

45
పరిశ్రమలు, వ్యవసాయానికి కొత్త అవకాశాలు

ఈ హైవే పూర్తయిన తర్వాత వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. గ్రానైట్ పరిశ్రమలు, నిర్మాణ రంగానికి అవసరమైన ముడి సరుకుల రవాణా సులభమవుతుంది. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల రవాణా వేగవంతం కావడంతో రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుంది. హైవే వెంబడి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, గిడ్డంగులు, లాజిస్టిక్స్ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశాలు పెరగనున్నాయి. విద్య, వైద్య రంగాల్లో కొత్త సంస్థలు ఏర్పాటుకు కూడా ఈ రహదారి దోహదపడనుంది.

55
పర్యాటక రంగానికి మరింత ఊతం

ఈ నాలుగు లైన్ల రహదారి అందుబాటులోకి రావడంతో వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు చేరుకోవడం మరింత సులభమవుతుంది. వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి, యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, కరీంనగర్‌లోని ఎలగందల కోటతో పాటు పలు జలాశయాలను సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. హైవే వెంట పచ్చదనం పెంచేందుకు చెట్లను నాటడంతో పాటు వర్షపు నీటి సంరక్షణ కోసం ప్రత్యేక నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. దీంతో పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రయాణికులకు మరింత ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవం లభించనుంది.

Read more Photos on
click me!

Recommended Stories