Telangana: బీసీ మహిళల ఆర్థిక సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన బీసీ మహిళలకు ఉచితంగా ఆటోమేటిక్ కుట్టుమిషన్లు అందించే పథకాన్ని ప్రారంభించింది.
ఈ పథకం కింద తెలంగాణలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టుమిషన్లు పంపిణీ చేయనున్నారు. ఒక్కో కుట్టుమిషన్ విలువ సుమారు రూ.12,000. లబ్ధిదారులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా 100 శాతం ప్రభుత్వ సబ్సిడీతో ఈ మిషన్లను అందజేయనున్నారు. దీంతో వేలాది మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
25
ఆగస్టు 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ
ఈ పథకానికి దరఖాస్తుల ప్రక్రియను ఆగస్టు 15 నుంచి ప్రారంభించి సెప్టెంబర్ 15 వరకు కొనసాగించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. అర్హులైన బీసీ మహిళలు నిర్ణీత గడువులో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఎంపికైన వారికి దశలవారీగా కుట్టుమిషన్లను పంపిణీ చేయనున్నారు.
35
అర్హతలు, ఎంపిక విధానంపై త్వరలో స్పష్టత
పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. వయోపరిమితి, కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, ఎంపిక విధానం వంటి అంశాలను అధికారికంగా వెల్లడించనున్నారు. అలాగే దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరిస్తారా లేదా మీ సేవ కేంద్రాల ద్వారా తీసుకుంటారా అనే విషయంపైనా ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇవ్వనుంది.
మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
ఈ పథకం కేవలం ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ చేసే కార్యక్రమం మాత్రమే కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళలు తమ నైపుణ్యాన్ని ఉపయోగించుకుని టైలరింగ్, దుస్తుల తయారీ, ఇతర కుట్టు సంబంధిత పనుల ద్వారా స్వయం ఉపాధి పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆధునిక ఆటోమేటిక్ కుట్టుమిషన్లతో తక్కువ సమయంలో ఎక్కువ పని చేయగలిగే అవకాశం ఉండటంతో ఆదాయం కూడా పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
55
బీసీ మహిళల ఆర్థిక సాధికారతకు మరో ముందడుగు
ప్రజాపాలనలో బీసీ మహిళల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా ఆర్థికంగా స్వతంత్రులుగా, స్వయం ఉపాధి పొందే పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. ఇంటి బాధ్యతలను నిర్వహిస్తూనే ఆదాయం సంపాదించే అవకాశం ఈ పథకం ద్వారా లభిస్తుందని పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వేలాది బీసీ మహిళలకు ఈ కార్యక్రమం ఆర్థిక భద్రతతో పాటు ఉపాధి అవకాశాలను కూడా విస్తరించనుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.