Telangana Govt: టీచర్లకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. అనుమతి లేకుండా ఏడాదంతా బడికి రాకపోతే టీచర్లను ఉద్యోగం నుంచి తీసేస్తామని తెలంగాణ విద్యాశాఖ హెచ్చరించింది. నిర్లక్ష్యం వహిస్తే అధికారులపైనా వేటు తప్పదని పేర్కొంది.
స్కూల్కి రాకపోతే పర్మనెంట్గా ఇంటికే.. తెలంగాణ ప్రభుత్వ సంచలన నిర్ణయం
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ, ఇష్టారాజ్యంగా విధులకు డుమ్మా కొడుతున్న ఉపాధ్యాయులకు తెలంగాణ విద్యాశాఖ గట్టి షాక్ ఇచ్చింది. ముందస్తు అనుమతి లేకుండా బడులకు రాకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే వారిపై ఇకపై ఎలాంటి దయాదాక్షిణ్యాలు చూపకూడదని తేల్చిచెప్పేసింది.
ముందస్తు పర్మిషన్ లేకుండా వరుసగా ఏడాది పాటు విధులకు దూరంగా ఉంటే, నిబంధనల ప్రకారం వారిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాలు పెంచడం, పిల్లలకు క్రమం తప్పకుండా పాఠాలు అందేలా చూడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
25
ఐదేళ్లు బడికి రాకపోతే రీసైన్ చేసినట్లే
కొత్త మార్గదర్శకాల ప్రకారం.. అనుమతి లేని గైర్హాజరుపై విద్యాశాఖ అధికారులు సీసీఏ రూల్స్ ప్రకారం వెంటనే చర్యలు ప్రారంభించనున్నారు. వరుసగా ఐదేళ్ల పాటు విధులకు హాజరుకాకపోతే సదరు టీచర్ లేదా సిబ్బంది తమ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లుగానే భావిస్తారు.
విదేశీ సర్వీసుల్లో ఉంటూ గడువు ముగిసినా తిరిగి రాని వారికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. ఇక నుంచి గైర్హాజరైన వారిని గుర్తించిన వెంటనే కాలయాపన చేయకుండా షోకాజ్ నోటీసులు జారీ చేసి, తక్షణమే విచారణ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి.
35
హెచ్ఎంలు, ఎంఈఓలు దాచిపెడితే మీకే ముప్పు
ఉపాధ్యాయులు బడికి రాకపోయినా పట్టించుకోకుండా ఉదాసీనంగా ఉండే ఉన్నతాధికారులపై కూడా ప్రభుత్వం కంటిన్యూగా కన్నేసింది. డుమ్మా కొట్టే టీచర్ల వివరాలను దాచిపెట్టినా లేదా వారిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేసినా హెడ్మాస్టర్లు, మండల విద్యాధికారులు, జిల్లా విద్యాధికారులపై కూడా కఠిన చర్యలు ఉంటాయని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ హెచ్చరించారు. గైర్హాజరయ్యే వారిపై చర్యలు తీసుకోకుండా అలసత్వం వహిస్తే సదరు అధికారులనే బాధ్యులను చేస్తూ వేటు వేస్తామని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో ప్రతి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో గైర్హాజరయ్యే టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఒక రిజిస్టర్ నిర్వహించనున్నారు. అందులో ఆబ్సెంట్ అయిన వారి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఎవరు బడికి సరిగ్గా వస్తున్నారు, ఎవరు ఎగనామం పెడుతున్నారనేది రీజినల్ జాయింట్ డైరెక్టర్లు, డీఈఓల నిఘాలో ఉండనుంది.
55
జీతాలు కట్.. పెన్షన్, ఇంక్రిమెంట్లలోనూ కోత
అనుమతి లేకుండా స్కూళ్లకు రాని కాలాన్ని డైస్ నన్ అంటే పనిచేయని కాలంగా పరిగణిస్తారు. ఇలాంటి సమయంలో ఉపాధ్యాయులకు ఎలాంటి జీతభత్యాలు చెల్లించరు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో వచ్చే సీనియారిటీ ఇంక్రిమెంట్లు, పదవీ విరమణ తర్వాత వచ్చే పింఛన్ వంటి ఆర్థిక ప్రయోజనాల్లో కూడా భారీగా కోత విధించనున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి, బడుల్లో క్రమశిక్షణను పునరుద్ధరించడానికే విద్యాశాఖ ఈ కఠిన నిర్ణయాలు అమలు చేస్తోంది.