Kalyana Lakshmi Scheme: తెలంగాణలో పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాల కోసం ప్రభుత్వం అందజేస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెల్లింపులపై తెలంగాణ హైకోర్టు తాత్కాలిక స్టే విధించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో కల్యాణలక్ష్మి చెక్కులు బంద్.. అసలు ఏం జరిగింది?
తెలంగాణలో పేద కుటుంబాల ఇంట్లో పెళ్లిళ్లకు ఆర్థిక భరోసానిచ్చే 'కల్యాణలక్ష్మి', 'షాదీ ముబారక్' పథకాల అమలుపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అయిన తెలంగాణ హైకోర్టు అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ రెండు పథకాల కింద లబ్ధిదారులకు ఎలాంటి నగదు చెల్లింపులు చేయవద్దని స్పష్టం చేస్తూ తాత్కాలిక ఇంజక్షన్ జారీ చేసింది. దీంతో ఇప్పటికే దరఖాస్తు చేసుకుని నిధుల కోసం ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. అసలు హైకోర్టు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఈ పథకం పూర్తిగా నిలిపివేయనున్నారా?
25
అసలు కోర్టు వరకు ఎందుకు వెళ్లింది?
న్యాయవాది విజయ్ గోపాల్ వ్యక్తిగత హోదాలో తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. 2014 నుంచి అమలు చేస్తున్న ఈ పథకాలకు అసెంబ్లీలో ఎలాంటి ప్రత్యేక చట్టం లేదా తీర్మానం లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల (జీవోల) ఆధారంగానే రూ.13,000 కోట్లకు పైగా ప్రజాధనాన్ని ఖర్చు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ వాదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 202(3), 204(3), 266(3), 283(2) నియమాలను ఉల్లంఘిస్తూ, చట్టసభల అధికారాన్ని కార్యనిర్వాహక వర్గం తన చేతుల్లోకి తీసుకుందని పేర్కొన్నారు.
35
కోర్టు సీరియస్.. స్టే విధించడానికి ప్రధాన కారణం ఇవే
ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని గతంలోనే జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఆదేశించింది. జూలై 8న సమయం ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం స్పందించలేదు. తాజాగా బుధవారం జరిగిన విచారణలో కూడా ప్రభుత్వం తరఫు న్యాయవాది మరికొంత సమయం కోరడంతో ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దాంతో 2014 నుండి 2019 వరకు ఈ పథకాల కోసం జారీ చేసిన 8 జీవోల అమలుపై స్టే విధించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ కేసు విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు ఈ పథకం ప్రయోజనాలు నిలిచిపోనున్నాయి.
ఈ తాత్కాలిక ఇంజక్షన్ ప్రకారం, తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వడం లేదా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయడం పూర్తిగా నిలిచిపోతుంది. సాధారణంగా ఈ పథకాల కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుపేద యువతుల పెళ్లిళ్లకు రూ.1,00,116 (దివ్యాంగులకు రూ.1,25,016) చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఇప్పుడు కోర్టు స్టే ఇవ్వడంతో కొత్తగా సహాయం పొందాల్సిన వారి పరిస్థితి ఉత్కంఠగా మారింది. సెప్టెంబర్ 9న ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ అఫిడవిట్ ఆధారంగానే ఈ పథకాల భవిష్యత్తు తేలనుంది.
55
సీఎం రేవంత్ రెడ్డి సర్కారు పై తీవ్ర విమర్శలు
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై హైకోర్టు స్టే విధించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఆదేశాలను పక్కనబెట్టి, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకుండా నిర్లక్ష్యం వహించిందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.
కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన ఈ ఆర్థిక సాయంతో దాదాపు 13 లక్షల మంది పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు తోడ్పాటు లభించింది. ఎన్నికల సమయంలో తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక దాన్ని పక్కనబెట్టిందని బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు.