తెలంగాణలో కొత్త ఎయిర్ పోర్ట్‌.. మిష‌న్ మోడ్‌లో ప‌నులు. ఆ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం

Published : Sep 13, 2026, 08:07 AM IST

Telangana: ఉత్తర తెలంగాణలో విమాన ప్రయాణ సదుపాయాల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజలకు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆదిలాబాద్‌లో నిర్మించ‌త‌ల‌పెట్టిన కొత్త ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్లాలని కేంద్రం నిర్ణయించింది.

PREV
15
మూడు శాఖల మధ్య సమన్వయానికి ప్రత్యేక వ్యవస్థ

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియను ఇకపై మిషన్ మోడ్‌లో కొనసాగించనున్నారు. రక్షణ శాఖ, పౌర విమానయాన శాఖ, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక్కో నోడల్ అధికారిని నియమించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వారం చివరి నాటికి ఈ నియామకాలను పూర్తి చేసి, మూడు విభాగాల మధ్య సమన్వయాన్ని మరింత పటిష్ఠం చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ తయారీతో పాటు సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపకల్పనను కూడా వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. భూమి, నిర్మాణ అనుమతులు, రక్షణ అవసరాలు, పౌర విమానయాన మౌలిక వసతులు వంటి అంశాలపై సమన్వయంతో నిర్ణయాలు తీసుకునేలా కార్యాచరణ రూపొందించనున్నారు.

25
2.75 కిలోమీటర్ల రన్‌వే..

ప్రతిపాదిత ఎయిర్‌పోర్ట్‌లో దాదాపు 2.75 కిలోమీటర్ల పొడవైన రన్‌వే ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం భారత వైమానిక దళం ఆధీనంలో 369.45 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. శిక్షణ విమానాల కార్యకలాపాలు, విమానాల పార్కింగ్, హ్యాంగర్లు, ఆపరేషనల్ కాంప్లెక్స్, నిర్వహణ కేంద్రాలు వంటి అవసరాల కోసం అదనంగా సుమారు 1,500 ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించారు. దీంతో ప్రాజెక్టు భూసేకరణ అంశం కూడా కీలకంగా మారనుంది. రక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక మౌలిక వసతులతో ఎయిర్‌ఫీల్డ్‌ను అభివృద్ధి చేయనున్నారు.

35
ప్రయాణికుల టెర్మినల్‌తో పాటు ఎంఆర్‌ఓ కేంద్రం

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ కేవలం రక్షణ కార్యకలాపాలకే పరిమితం కాకుండా పౌర విమాన సర్వీసులకు కూడా ఉపయోగపడేలా రూపొందించనున్నారు. ఇందుకోసం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రత్యేక ప్యాసింజర్ టెర్మినల్ ఏర్పాటు చేయనున్నారు. విమానాల నిర్వహణ, మరమ్మతులు, సాంకేతిక సేవలకు ఉపయోగపడే మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఆపరేషన్స్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. వైమానిక దళ సిబ్బంది కోసం నివాస సముదాయాలు, రిక్రియేషన్ సదుపాయాలు, తాగునీరు, పారిశుధ్య వ్యవస్థలను కూడా అభివృద్ధి చేయనున్నారు. దీంతో భవిష్యత్తులో ఆదిలాబాద్ ఒక ముఖ్యమైన ఏవియేషన్ హబ్‌గా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

45
2025లో మొద‌లైన ప్ర‌క్రియ‌

ఆదిలాబాద్‌లో పూర్తి స్థాయి ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ 2025 జనవరిలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. దీనిపై రక్షణ మంత్రి సానుకూలంగా స్పందించడంతో జాయింట్ ఎయిర్‌ఫీల్డ్ అభివృద్ధికి మార్గం సుగమమైందని చెప్పారు. అనంతరం పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో వరుసగా చర్చలు జరిపినట్లు వివరించారు. 2026 ఏప్రిల్‌లో సంబంధిత విభాగాల ఆధ్వర్యంలో ఉమ్మడి స్థల పరిశీలన కూడా పూర్తయిందని తెలిపారు. ఇప్పుడు ప్రాజెక్టును మిషన్ మోడ్‌లో తీసుకెళ్లేందుకు నిర్ణయం తీసుకోవడంతో పనులకు మరింత వేగం వచ్చే అవకాశం ఉంది.

55
ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కొత్త రెక్కలు

ఆదిలాబాద్‌లో విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణలో రవాణా వ్యవస్థకు ఊత‌మివ్వ‌నుంది. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రధాన నగరాలకు వేగవంతమైన విమాన అనుసంధానం ఏర్పడటంతో ప్రయాణ సమయం తగ్గనుంది. వ్యాపార, పారిశ్రామిక రంగాలకు కొత్త అవకాశాలు ఏర్పడటంతో పాటు పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా ఇది దోహదపడే అవకాశం ఉంది. పర్యాటకం, వాణిజ్యం, ఉద్యోగాలు, స్థానిక ఆర్థిక కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉంది. రక్షణ రంగంలో వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన ఆదిలాబాద్‌కు పౌర విమానయాన సదుపాయం కూడా జతకానుండటంతో ఈ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కీలక మలుపుగా మారనుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories