Telangana: తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఆ ప‌న్నీర్‌పై ఏడాది నిషేధం

Published : Sep 11, 2026, 08:44 PM IST

Telangana: తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పాలతో తయారు చేయని నాన్‌-డెయిరీ, అనలాగ్‌ లేదా కృత్రిమ పనీర్‌ తయారీ, విక్రయాలపై నిసేధం విధిస్తూ.. తెలంగాణ ఫుడ్‌ అండ్‌ ఎసెన్షియల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది.

PREV
15
కృత్రిమ ప‌న్నీర్‌పై ఎందుకు నిషేధం?

సాధారణంగా పనీర్‌ అంటే పాలు ఆధారంగా తయారయ్యే పాల ఉత్పత్తి. అయితే మార్కెట్లో తక్కువ ఖర్చుతో తయారు చేసి అధిక లాభాలకు విక్రయించేందుకు కొన్ని చోట్ల పాలకు బదులుగా ఇతర పదార్థాలతో పనీర్‌ను పోలిన ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు గుర్తించారు. వీటిని అనలాగ్‌ పనీర్‌, నాన్‌-డెయిరీ పనీర్‌ లేదా కృత్రిమ పనీర్‌గా పిలుస్తారు. అసలైన పాల ఉత్పత్తిగా భావించి వినియోగదారులు కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో ఆహార నాణ్యతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజారోగ్య పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిషేధం విధించింది.

25
తయారీ నుంచి అమ్మకం వరకు అన్ని దశల్లోనూ నిషేధం

తెలంగాణ ఫుడ్‌ అండ్‌ ఎసెన్షియల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ (TG SAFE) ఆదేశాల ప్రకారం కృత్రిమ ప‌న్నీర్‌కు సంబంధించిన కార్యకలాపాలపై విస్తృతంగా నిషేధం వర్తిస్తుంది. ప‌న్నీర్‌ పేరుతో నాన్‌-డెయిరీ ఉత్పత్తులను తయారు చేయడం, ప్రాసెసింగ్‌ చేయడం, ప్యాకింగ్‌ చేయడం, నిల్వ ఉంచడం, పంపిణీ చేయడం, రవాణా చేయడం, విక్రయించడం వాటికి ఇక‌పై రాష్ట్రంలో అనుమ‌తి ఉండ‌దు. అంటే కృత్రిమ ప‌న్నీర్‌ తయారీ కేంద్రం నుంచి హోటల్‌ లేదా రెస్టారెంట్‌ వరకు చేరే ప్రతి దశను ఈ ఆదేశాలు కవర్‌ చేస్తాయి. ఈ నిబంధన రాష్ట్రవ్యాప్తంగా వర్తించనుంది.

35
ఏడాది పాటు అమల్లో ఉండనున్న ఆదేశాలు

ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ యాక్ట్‌-2006లోని సెక్షన్‌ 30(2)(a) కింద TG SAFE కమిషనర్‌ ఈ ఆదేశాలను జారీ చేశారు. సెప్టెంబర్‌ 10, 2026 నుంచి నిషేధం అమల్లోకి వచ్చినట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి సెప్టెంబర్‌ 10న గెజిట్‌ నోటిఫికేషన్‌ నంబర్‌ 807ను విడుదల చేశారు. ఈ నిషేధం ఒక సంవత్సరం పాటు కొనసాగనుంది. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

45
హోటళ్లు, రెస్టారెంట్లకు కీలక బాధ్యత

ప‌న్నీర్ ఆధారిత వంటకాలకు హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, ఫుడ్‌ సెంటర్లలో మంచి డిమాండ్‌ ఉంటుంది. దీంతో తక్కువ ధరకు లభించే కృత్రిమ పనీర్‌ను కొనుగోలు చేసి ఉపయోగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫుడ్‌ బిజినెస్‌ నిర్వాహకులు మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. తాము కొనుగోలు చేసే ప‌న్నీర్‌ నిజమైన డెయిరీ ఉత్పత్తేనా, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. అదే సమయంలో నిబంధనలకు అనుగుణంగా పాలతో తయారయ్యే సాధారణ డెయిరీ పనీర్‌పై ఈ నిషేధం వర్తించదని అధికారులు స్పష్టం చేశారు.

55
తనిఖీలు ముమ్మరం.. ఉల్లంఘిస్తే చర్యలు

నిషేధం అమల్లోకి రావడంతో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కృత్రిమ ప‌న్నీర్‌ తయారీ, నిల్వ, సరఫరా జరుగుతున్న ప్రాంతాలపై తనిఖీలు నిర్వహించే అవకాశం ఉంది. అనుమానాస్పద ఉత్పత్తుల నమూనాలను సేకరించి వాటి నాణ్యతను పరీక్షించనున్నారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ కృత్రిమ ప‌న్నీర్‌ను తయారు చేయడం, సరఫరా చేయడం లేదా విక్రయించడం వంటివి చేస్తే సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. వినియోగదారులు కూడా ప‌న్నీర్‌ కొనుగోలు చేసే సమయంలో ఉత్పత్తి వివరాలు, లేబుల్‌, తయారీదారు సమాచారాన్ని పరిశీలించడం ద్వారా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇదిలా ఉంటే, ప్యాకేజ్డ్‌ ఫుడ్‌లో ఉండే చక్కెర, ఉప్పు, కొవ్వు వంటి అంశాలను వినియోగదారులకు సులభంగా అర్థమయ్యేలా ప్యాక్‌ ముందు భాగంలోనే స్పష్టంగా చూపించే విషయంలో FSSAIకి జాతీయ పోషకాహార సంస్థ (NIN) గతంలో పలు సూచనలు చేసింది. ఆహార నాణ్యత, పోషక విలువలపై వినియోగదారులకు అవగాహన పెంచే చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో కృత్రిమ ప‌న్నీర్‌పై తాజా నిషేధం ప్రాధాన్యం సంతరించుకుంది.

Read more Photos on
click me!

Recommended Stories