RTC: ఎర్ర బ‌స్సులు ప‌చ్చ‌గా ఎందుకు మారాయి.? దీని వెన‌కాల ఉన్న అస‌లు కార‌ణం ఏంటో తెలుసా.?

Published : May 19, 2026, 06:36 PM IST

RTC: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ అధికారిగా, ఆర్టీసీ ఎండీగా పనిచేసిన దినేష్ రెడ్డి తన ప‌దవి కాలంలో తీసుకున్న నిర్ణయాల గురించి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బస్సు రంగు ఎందుకు మారిందో కూడా తెలిపారు. 

PREV
15
హైదరాబాద్‌లో నేర నియంత్రణకు కొత్త పద్ధతులు

పోలీస్ శాఖలో పనిచేసిన కాలాన్ని గుర్తు చేసుకుంటూ దినేష్ రెడ్డి మాట్లాడుతూ.. అప్పట్లో హైదరాబాద్‌లో రౌడీయిజం, చిన్నచిన్న నేరాలు ఎక్కువగా ఉండేవని చెప్పారు. వాటిని నియంత్రించడానికి సంప్రదాయ విధానాలకంటే భిన్నంగా పనిచేశామని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక మోటార్ బైక్ పెట్రోలింగ్ టీంలను ఏర్పాటు చేశామని గుర్తు చేసుకున్నారు. చిన్న వీధులు, సందులు, కాలనీల్లో కూడా నిరంతరం గస్తీ తిరిగేలా ప్లాన్ చేశామని పేర్కొన్నారు. దీంతో పోలీసులు ప్రజలకు దగ్గరయ్యారని, నేరాలు చేసే వారికి భయం పెరిగిందని వివరించారు. అవినీతిని తగ్గించడంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. శాఖలో పారదర్శకత పెరగడంతో క్రైమ్ డిటెక్షన్ రేట్ మెరుగుపడిందని, నగరంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపారు.

25
తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి బాధ్యతలు

2006లో APSRTC మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు సంస్థ ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని దినేష్ రెడ్డి చెప్పారు. ఆర్టీసీని కేవలం రవాణా సంస్థగా కాకుండా, గ్రామీణ ప్రజల జీవనాడిగా మార్చాలనే ఆలోచనతో పని ప్రారంభించామని తెలిపారు. గ్రామాలకు సరైన రవాణా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి “పల్లె వెలుగు” సేవలను తీసుకొచ్చామని చెప్పారు.

35
ఎర్ర బస్సులు పచ్చగా మారడానికి ఇదే అసలు కారణం

ఆర్టీసీ బస్సుల రంగు మార్పు వెనుక పెద్ద ఆలోచనే ఉందని దినేష్ రెడ్డి వివరించారు. అప్పటివరకు ఎర్రరంగులో నడిచే బస్సులను పచ్చ-తెలుపు కలర్ కాంబినేషన్‌లోకి మార్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాలను సూచించే రంగు పచ్చ అని, రైతు జీవితం, పచ్చదనం, పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా బస్సులు కనిపించాలని అనుకున్నామన్నారు. తెలుపు రంగు పాడి పరిశ్రమ, గ్రామీణ స్వచ్ఛతకు ప్రతీకగా ఎంపిక చేశామని తెలిపారు. “బస్సు కనిపిస్తే గ్రామం గుర్తుకు రావాలి.. ప్రజలకు అది తమ సొంత సేవలా అనిపించాలి” అనే ఉద్దేశంతోనే ఆ డిజైన్ తీసుకువచ్చామని చెప్పారు. అదే విధంగా ల‌క్ష్మీపార్వ‌తి ఎయిర్ ఇండియా విమానంలో ఎన్టీఆర్‌తో క‌లిసి వెళ్లిన సంద‌ర్భంలో.. ఆమెను కొంద‌రు ఎర్ర బ‌స్సులో ఎక్కిన మ‌హిళ ఎయిర్ బ‌స్సులో ఎక్కారంటూ విమ‌ర్శించిన విష‌యాన్ని దినేష్ రెడ్డి గుర్తు చేశారు.

45
చార్జీలు పెంచకుండా లాభాల్లోకి తీసుకెళ్లాం

ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావడం కోసం సాధారణ ప్రజలపై భారం వేయలేదని దినేష్ రెడ్డి చెప్పారు. టికెట్ ధరలు పెంచకుండా, సంస్థలో నిర్వహణ పద్ధతులను మెరుగుపరిచామని తెలిపారు. అనధికారిక రవాణా పోటీని నియంత్రించడానికి పోలీస్ శాఖ సహకారం తీసుకున్నామని చెప్పారు. దీంతో ప్రయాణికులు మళ్లీ ఆర్టీసీ వైపు మళ్లారని వివరించారు. ఈ మార్పుల ఫలితంగా మొదటి ఏడాదిలోనే సంస్థకు భారీగా ఆదాయం వచ్చిందని, ఆ తర్వాత కూడా వరుసగా లాభాలు కొనసాగాయని చెప్పారు. తన పదవీకాలంలో ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయల లాభం నమోదైందని వెల్లడించారు.

55
ప్రపంచ రికార్డు సాధించిన ఆర్టీసీ

తమ పాలనా కాలంలో ఆర్టీసీ బస్సుల సంఖ్య భారీగా పెరిగిందని దినేష్ రెడ్డి గుర్తు చేశారు. సుమారు 20 వేల బస్సులతో ప్రపంచంలోనే అతిపెద్ద రోడ్డు రవాణా సంస్థల్లో ఒకటిగా ఆర్టీసీ నిలిచిందని తెలిపారు. ఈ ప్రగతితో సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని, చివరకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కిందని చెప్పారు. తాను తీసుకున్న నిర్ణయాల్లో “పల్లె వెలుగు” సేవలు, బస్సుల రంగు మార్పు ఇప్పటికీ ప్రజలు గుర్తు పెట్టుకోవడం ఆనందంగా ఉందని దినేష్ రెడ్డి ఈ సంద‌ర్భంగా చెప్పుకొచ్చారు.

Read more Photos on
click me!

Recommended Stories