Hyderabad: ఐటీ, ఫార్మా కంపెనీలకు అడ్డాగా మారిన హైదరాబాద్ ఇప్పుడు మరో రంగానికి కేరాఫ్గా మారుతోంది. దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వర్చువల్గా ప్రారంభించారు.
ఐటీ, బయోటెక్ హబ్గా ఎదిగిన భాగ్యనగరం, ఇప్పుడు అంతరిక్ష పరిశోధనలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది. శంషాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ రాకెట్ తయారీ కేంద్రంగా నిలుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఫ్యాక్టరీని వర్చువల్గా ప్రారంభించారు. స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దాదాపు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. రాకెట్ డిజైన్, అసెంబ్లీ, టెస్టింగ్, ఇంటిగ్రేషన్ – ఒకే క్యాంపస్లో ఈ అన్ని వ్యవస్థలు ఉండటం దేశంలో ఇదే మొదటిసారి. ప్రతి నెల ఒక ఆర్బిటల్ రాకెట్ తయారు చేసే సామర్థ్యంతో ఈ ఫ్యాక్టరీ స్పేస్ రంగంలో పెద్ద మార్పునకు నాంది పలుకుతోంది.
25
విక్రమ్–1: దేశపు తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్
స్కైరూట్ రూపొందించిన విక్రమ్–1 రాకెట్ పూర్తిస్థాయి స్వదేశీ ప్రైవేట్ రాకెట్గా చరిత్ర సృష్టించింది.
తేలికైన కార్బన్ ఫైబర్ నిర్మాణం
అత్యాధునిక 3D ప్రింటెడ్ ఇంజిన్లు
తక్కువ ఖర్చుతో అధిక పనితీరు
480 కిలోల సాటిలైట్ను లో ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టే సామర్థ్యం ఈ రాకెట్ సొంతం.
ప్రపంచ స్మాల్ శాటిలైట్ మార్కెట్పై దృష్టి పెట్టిన ఈ రాకెట్ భారత్కు కొత్త అవకాశాలను తెస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
35
“యువ శక్తికి కొత్త దిశ”: ప్రధాని మోదీ
ప్రారంభోత్సవంలో మాట్లాడిన ప్రధాని మోదీ, స్కైరూట్ విజయం భారత యువత సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత శాటిలైట్లు తక్కువ ఖర్చుతో, అత్యంత నమ్మకమైనవి.
స్టార్టప్లకు కేంద్రం అవకాశాలు అందిస్తోంది. ప్రైవేట్ రంగ ప్రవేశంతో స్పేస్ రంగంలో పోటీ పెరుగుతోంది. ప్రపంచంలో పెరుగుతున్న స్మాల్ శాటిలైట్ డిమాండ్ను భారత్ అందిపుచ్చుకుంటుంది అని చెప్పుకొచ్చారు. ఇక
“సైకిల్పై రాకెట్ మోసుకెళ్లిన రోజుల నుంచి, భారీ ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ నిర్మించే స్థాయికి వచ్చిన ప్రయాణం ప్రేరణాత్మకమని” మోదీ గుర్తుచేశారు.
ఈ కొత్త క్యాంపస్ ఏర్పాటుతో హైదరాబాద్కు వేలాది కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ప్రధానంగా..
* రాకెట్ ఇంజినీరింగ్
* డిజైన్
* కోడింగ్
* మెటీరియల్ సైన్స్
* టెస్టింగ్, క్వాలిటీ కంట్రోల్ వంటి రంగాల్లో ఉద్యోగాలు రానున్నాయి. దీంతో నగరం స్పేస్ టెక్నాలజీలో కూడా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకోనుంది.
55
భారత స్పేస్ ఎకానమీకి కొత్త వేగం
స్కైరూట్ ప్రాజెక్టులతో భారత్ ప్రపంచ ఉపగ్రహ ప్రయోగాల్లో ఒక ప్రధాన గమ్యస్థానంగా మారబోతోంది. విక్రమ్–1 తర్వాత విక్రమ్–2, విక్రమ్–3 రాకెట్లు కూడా వరుసగా సిద్ధమవుతున్నాయి. అంతర్జాతీయంగా స్మాల్ శాటిలైట్ సేవలకు భారీ డిమాండ్ ఉండటం వల్ల, భారత్కు విస్తృతమైన ఆదాయం, కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. భారత అంతరిక్ష రంగంలో వచ్చిన ఈ సంస్కరణలు దేశాన్ని గ్లోబల్ స్పేస్ లీడర్గా ముందుకు నడిపిస్తాయని ప్రధాని స్పష్టం చేశారు.