ఏపీలో వర్షాలు... ఈ జిల్లాలకు పిడుగుల ప్రమాదం
ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించి ఉన్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజులు మేఘావృతమైన వాతావరణంతో పాటుగా పిడుగులతో కూడిన వర్షాలు పడేందుకు అవకాశం ఉందన్నారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు.
అయితే అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాలకు పిడుగుల ప్రమాదం పొంచివుందని విపత్తు సంస్థ హెచ్చరించింది. ఉత్తరాంధ్రలో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. వర్షాల తీవ్రత తగ్గిన తర్వాత క్రమంగా ఎండల తీవ్రత పెరుగుతుందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.