Hyderabad: రోజురోజుకీ హైదరాబాద్ నగరం విస్తరిస్తోంది. ట్రాఫిక్ సమస్య సైతం పెరుగుతోంది. ఇందుకు పరిష్కారంగానే ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఫ్లై ఓవర్లను నిర్మిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మరో రెండు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం పడింది.
హైదరాబాద్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచే దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులకు అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పటికే భూసేకరణ, అనుమతులు, టెండర్ల ప్రక్రియలు దాదాపు పూర్తవడంతో నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి డెయిరీ ఫామ్ రోడ్ వరకు కారిడార్–1 పనులు వేగంగా ముందుకు వెళ్తుండగా, కారిడార్–2 ప్రాజెక్టుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు.
25
కారిడార్ 1లో డబుల్ డెక్కర్ సౌకర్యం
సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి డెయిరీ ఫామ్ రోడ్ వరకు 5.32 కి.మీ. మేరకు కారిడార్–1 నిర్మించనున్నారు. ఇది డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్గా రూపుదిద్దుకోనుంది. రూ.1,580 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు కావాల్సిన 74 ఎకరాల భూమి ఇప్పటికే సేకరించారు. ఇందులో 56 ఎకరాలు డిఫెన్స్ ల్యాండ్ కాగా, మిగతా భాగం ప్రైవేట్ భూములు. టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా, ప్రస్తుతం సాయిల్ టెస్టులు కొనసాగుతున్నాయి.
35
కారిడార్–2: జేబీఎస్ నుంచి శామీర్పేట వరకు
ఎలివేటెడ్ కారిడార్–2ను ప్యారడైజ్ (జేబీఎస్) నుంచి హకీంపేట మీదుగా శామీర్పేట ఓఆర్ఆర్ వరకు నిర్మించనున్నారు. మొత్తం 18.10 కి.మీ. పొడవుతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. అయితే ఇందులో ఓ ప్రత్యేకత ఉంది. అదే అండర్ గ్రౌండ్ టన్నెట్. హకీంపేట ప్రాంతంలో సుమారు 500 మీటర్ల పొడవున అండర్ గ్రౌండ్ టన్నెల్ను నిర్మించనున్నారు. హకీంపేట ప్రాంతంలో మిలిటరీ స్థావరాలు ఉన్న నేపథ్యంలో భద్రత కారణాల రీత్యా టన్నెల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.
కారిడార్–2 నిర్మాణానికి సుమారు రూ.2,232 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో భూసేకరణ, పరిహారాల చెల్లింపులు కూడా ఉన్నాయి. మొత్తం 197 ఎకరాల భూమి అవసరం కాగా, అందులో 113 ఎకరాలు డిఫెన్స్ భూములు. మిగిలిన 84 ఎకరాలు ప్రైవేట్ భూములు. ఇప్పటికే సుమారు 90 శాతం భూసేకరణ పూర్తి అయ్యిందని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మిలిటరీ ఎస్టేట్ భూములు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు భూముల వినియోగానికి అనుమతి ఇచ్చింది.
55
నవంబరులో నిర్మాణం ప్రారంభం
ఈ నెల 22 వరకు కారిడార్–2కు టెండర్లు ఆహ్వానిస్తారు. ఎంపికైన కంపెనీకి పనులు అప్పగించి నవంబర్ చివర్లో నిర్మాణం ప్రారంభించేలా హెచ్ఎండీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇరుప్రాజెక్టులు పూర్తయితే హైదరాబాద్ ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గిపోతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలు కలగనున్నాయి. అంతే కాకుండా జేబీఎస్ నుంచి కరీంనగర్ వైపు వెళ్లే సుమారు 20 నిమిషాల్లోనే పట్టణాన్ని దాటేసే వీలు లభిస్తుంది.