ఈ మార్గాల్లో అండ‌ర్ గ్రౌండ్ మెట్రో రైలు.. మార‌నున్న హైద‌రాబాద్‌ ముఖ‌చిత్రం

Published : Aug 22, 2026, 03:54 PM IST

Hyderabad: హైదరాబాద్‌ మెట్రో రైలు రెండోదశ విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ పూర్తికాగా మెట్రో పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని మార్గాల్లో అధికారులు భూగర్భ మెట్రో ట్రాక్ నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

PREV
15
122.9 కిలోమీటర్ల మేర

మెట్రో రైలు రెండో దశలో భాగంగా మొత్తం 122.9 కిలోమీటర్ల మేర కొత్త మార్గాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ దశలో సాధారణ ఎలివేటెడ్‌ మార్గాలతో పాటు రైల్వే ట్రాక్‌లు, జాతీయ రహదారులు, విమానాశ్రయ ప్రాంతాలు, హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్లు వంటి క్లిష్టమైన ప్రాంతాలను దాటాల్సి ఉంటుంది. మొత్తం ఏడు కారిడార్లలో 86 స్టేషన్లను నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.38,595 కోట్ల వ్యయం అంచనా వేశారు. భవిష్యత్తులో రోజుకు 12.42 లక్షల మంది ప్రయాణికులు మెట్రోను వినియోగించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

25
విమానాశ్రయ ప్రాంతాల్లో భూగర్భ మార్గాలు

రెండోదశలో విమానాశ్రయాల సమీపంలో మెట్రో నిర్మాణం ప్రత్యేక సవాలుగా మారనుంది. జేబీఎస్‌–శామీర్‌పేట కారిడార్‌లో హకీంపేట విమానాశ్రయ రన్‌వే కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా 1.65 కిలోమీటర్ల మేర భూగర్భ మెట్రో మార్గాన్ని ప్రతిపాదించారు. హెచ్‌ఎండీఏ ప్రతిపాదించిన హైవే టన్నెల్‌ వెంట ఈ మార్గాన్ని నిర్మించే ఆలోచన ఉంది.

నాగోల్‌–శంషాబాద్‌ కారిడార్‌లోనూ విమానాశ్రయానికి చేరువలో సుమారు 1.6 కిలోమీటర్ల మేర మెట్రోను భూగర్భంలో నిర్మించాలని ప్రతిపాదించారు. శంషాబాద్‌ విమానాశ్రయ పరిధిలో కార్గో, ఎయిర్‌పోర్ట్‌ స్టేషన్లతో పాటు ప్రత్యేకంగా మెట్రో డిపో ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతులు అవసరం.

బేగంపేట విమానాశ్రయం పరిసరాల్లో రన్‌వే కారణంగా ఫన్నెల్‌ జోన్‌ నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో నిర్మాణాల ఎత్తుపై పరిమితులు ఉండటంతో శామీర్‌పేట, మేడ్చల్‌ వైపు వెళ్లే కారిడార్లను తక్కువ ఎత్తులో నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ మార్గాలకు అవసరమైన అనుమతుల కోసం అధికారులు సంబంధిత శాఖలను సంప్రదిస్తున్నారు.

35
డబుల్‌ డెక్‌ మార్గం.. రైల్వే ట్రాక్‌లపై ప్రత్యేక ఏర్పాట్లు

మెట్రో రెండోదశలో మదీనాగూడ–చందానగర్‌ మధ్య సుమారు 1.2 కిలోమీటర్ల మేర డబుల్‌ డెక్‌ నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇందులో కింద ఫ్లైఓవర్‌, పై స్థాయిలో మెట్రో రైలు వెళ్లేలా డిజైన్‌ చేశారు. ఒకే నిర్మాణంపై రెండు రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా రహదారి రద్దీని తగ్గించడంతో పాటు స్థల వినియోగాన్ని సమర్థంగా చేపట్టనున్నారు.

ఇక మెట్రో మార్గం పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లను కూడా దాటాల్సి ఉంటుంది. ఫలక్‌నుమా, ఆరాంఘర్‌, శంషాబాద్‌, గుండ్లపోచంపల్లి, లోతుకుంట, అల్వాల్‌ ప్రాంతాల్లో రైల్వే మార్గాలపై మెట్రో నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ పనులకు దక్షిణ మధ్య రైల్వే నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించింది. సుచిత్ర ప్రాంతానికి సంబంధించిన అనుమతి మాత్రం ఇంకా అవసరముంది.

45
జాతీయ రహదారులపై స్తంభాల నిర్మాణానికి అనుమతులు

మెట్రో రెండోదశలో కొన్ని మార్గాలు జాతీయ రహదారుల వెంట సాగనున్నాయి. మదీనాగూడ–పటాన్‌చెరు, చింతలకుంట–హయత్‌నగర్‌ మార్గాలు ఎన్‌హెచ్‌-65 పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతాల్లో మెట్రో స్తంభాల నిర్మాణానికి కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి రైట్‌ ఆఫ్‌ వే అనుమతులు పొందాల్సి ఉంది.

అలాగే ఆరాంఘర్‌–శంషాబాద్‌, బోయిన్‌పల్లి–మేడ్చల్‌ మార్గాలు ఎన్‌హెచ్‌-44కు ఆనుకుని వెళ్లనున్నాయి. ఈ ప్రాంతాల్లోనూ మెట్రో నిర్మాణానికి సంబంధిత విభాగాల అనుమతులు కీలకం. హెచ్‌ఎండీఏ, కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలోని భూములు, రైట్‌ ఆఫ్‌ వే అంశాలను కూడా త్వరగా పరిష్కరించాలని మెట్రో అధికారులు కోరుతున్నారు.

55
రూ.38,595 కోట్ల ప్రాజెక్టు..

రెండోదశ మెట్రో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.38,595 కోట్లుగా ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.6,666 కోట్లు, అంటే 17 శాతం వాటా రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.11,933 కోట్లను సమకూర్చనుంది. ఇది మొత్తం వ్యయంలో 31 శాతం. మిగిలిన రూ.19,996 కోట్లను రుణాల ద్వారా సమీకరించనున్నారు. రుణాల వాటా 52 శాతంగా ఉంది. ఈ దశలోని ప్రతిపాదిత మార్గాలు మూడు ప్రధాన మున్సిపల్‌ పరిధుల్లో విస్తరించనున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 36.5 కిలోమీటర్లు, మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 24.9 కిలోమీటర్లు, సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 41.3 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం ఉండనుంది.

మొత్తం మీద మెట్రో రెండోద‌శ‌లో 7 కారిడార్ల‌లో మొత్తం 122.9 కిలోమీట‌ర్ల‌లో నిర్మాణం చేప‌ట్ట‌నున్నారు. ఇందులో మొత్తం 86 మెట్రో స్టేష‌న్లు ఉండ‌నున్నాయి. ఇందుకోసం సుమారు రూ. 38,595 కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మెట్రో పూర్తిగా అందుబాటులోకి వ‌స్తే రోజువారీ స‌గ‌టున 12.42 లక్షల మంది ప్ర‌యాణించే అవ‌కాశం ఉంద‌ని అధికారులు భావిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories