
Telangana Politics : తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి... వరుసగా రెండుసార్లు సీఎంగా చేశారు. ఇక ఆయన తనయుడు కల్వకుంట్ల తారక రామారావు (KTR) సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్... ఆ పార్టీ సీఎం అభ్యర్థి కూడా ఆయనే అనేది పొలిటికల్ టాక్.
అయితే కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా సీఎం రేసులో ఉన్నారా? అంటే అవుననే జవాబు వినిపిస్తోంది. బిఆర్ఎస్ పార్టీ ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసిన ఆమె తండ్రి, సోదరుడికి పొలిటికల్ గా దూరమయ్యారు... ఇటీవల కొత్త పార్టీ పెట్టారు. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పేరు కలిసివచ్చేలా తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ పెట్టారు... దీంతో ఆమె ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ క్రమంలో కవిత పలువురు ముఖ్యమంత్రులకు ఆధ్యాత్మిక సలహాదారుగా ఉన్న ఓ జ్యోతిషుడిని కలిశారు... ఇలా మరోసారి వార్తల్లో నిలిచారు కవిత.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రముఖ జ్యోతిషులు రాధన్ పండిట్ వేత్రివేల్తో సమావేశమయ్యారు. హైదరాబాద్లోని కవిత నివాసానికి రాధన్ పండిత్ విచ్చేశారు... ఆమెతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ మీటింగ్కు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో పొలిటికల్ గా ప్రాధాన్యం సంతరించుకుంది. కవిత, రాధన్ పండిత్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి... ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్గా మారింది.
రాధన్ పండిట్ ప్రముఖ రాజకీయ జ్యోతిషులు. ఆయన చూసే జాతకాలు, చెప్పే జోస్యాలు కరెక్ట్గా జరుగుతాయని చాలామంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు నమ్ముతారు. దేశవ్యాప్తంగా చాలా మంది రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలకు ఈయనే ఆధ్యాత్మిక, జ్యోతిష సలహాదారు. వేద జ్యోతిషం, న్యూమరాలజీలో ఆయనకు ఏకంగా నలభై ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఒకప్పుడు తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత, మాజీ ఉపప్రదాని అద్వానికి కూడా ఈయన నమ్మకమైన ఆధ్యాత్మిక సలహాదారుగా ఉండేవారు.
ఇక ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన జోసెఫ్ విజయ్ కి కూడా ఈయనే ఆధ్యాత్మిక సలహాదారు. దశాబ్దాల చరిత్ర కలిగిన రెండు ద్రావిడ పార్టీలను ఓడించి విజయ్ ముఖ్యమంత్రి అవుతారని ముందే ఊహించారు రాధన్ పండిట్. విజయ్ జాతకాన్ని, ఆయన పార్టీ పేరును క్షుణ్ణంగా విశ్లేషించి పండిట్ ఇచ్చిన సలహాల వల్లే తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధికారంలోకి వచ్చిందని చెబుతుంటారు.
టివికె పార్టీ అధికారంలోకి రాగానే రాధన్ పండిత్ కు కీలక బాధ్యతలు అప్పగించారు... సీఎం విజయ్ ఓఎస్డి (ఆఫీసర్ ఇన్ స్పెషల్ డ్యూటీ) గా నియమితులయ్యారు. అయితే ఈ నియామకం రాజకీయంగా వివాదాస్పదం అవ్వడంతో 24 గంటల్లోనే ఈ పదవిని కోల్పోయారు... నియామకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఇలా తన ఓఎస్డి గా నియమించుకున్నారంటేనే విజయ్ విజయంలో ఈ రాధన్ పండిత్ పాత్ర ఎంత కీలమైందో అర్థమవుతుంది.
తమిళనాడులో విజయ్ విజయం తర్వాత రాధన్ పండిత్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఇలాంటి జ్యోతిషుడిని ఇప్పుడు కల్వకుంట్ల కవిత కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మరో రెండేళ్లలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి... ఈ తరుణంలో వీరి భేటీ జరగడంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కవిత తన రాజకీయ భవిష్యత్తు కోసం, కొత్త వ్యూహాల కోసం ఆయన మార్గదర్శకత్వం తీసుకుంటున్నారనే ప్రచారం మొదలయ్యింది.
తమిళనాడు సీఎం విజయ్కు రాధన్ పండిట్ కేవలం జ్యోతిష సలహాదారు మాత్రమే కాదు, ఆయన వ్యక్తిగత సలహాదారుగా కూడా వ్యవహరిస్తున్నారు... ఆయన సలహాలు విజయ్కు చారిత్రక విజయాన్ని అందించాయని అంటారు. అందుకే ఇప్పుడు కవిత కూడా విజయ్ బాటలోనే పయనిస్తూ, రాధన్ పండిట్ సలహాలతో 2028 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారనేది పొలిటికల్ టాక్. కచ్చితమైన అంచనాలకు పేరుగాంచిన పండిట్ మార్గదర్శకత్వం, కవిత రాజకీయ ప్రయాణంలో సానుకూల మార్పును, కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని ఆమె సపోర్టర్స్ నమ్ముతున్నారు.
మొత్తం మీద రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపిన ఈ కవిత-రాధన్ పండిట్ భేటీ కేవలం మర్యాదపూర్వకమైనదేనా? లేక కవిత రాజకీయ జీవితంలో పెద్ద మార్పుకు నాంది పలకబోతోందా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.