
డిసెంబర్ 16న అబుదాబిలో ఐపీఎల్ 2026 మినీ వేలం జరగనుంది. సన్రైజర్స్ హైదరాబాద్ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. గత సీజన్లో జట్టుకు పెద్దగా ఉపయోగం లేకపోయిన ఎనిమిది మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది.
స్టార్ బౌలర్ మహమ్మద్ షమీని లక్నో జట్టుకు ట్రేడ్ చేయడం వంటి కీలక నిర్ణయాలతో SRH తమ పర్స్ను పెంచుకుంది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ ఫ్రాంచైజీ వద్ద మొత్తం రూ.25.50 కోట్ల పర్సు ఉంది. వేలంలో స్టార్ ప్లేయర్ల కోసం గట్టి పోటీని ఇవ్వడానికి సిద్ధమైంది.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు స్క్వాడ్లో ఉన్న స్లాట్స్ ప్రకారం గరిష్టంగా 10 మంది ఆటగాళ్లను వేలంలో ప్లాన్ చేసుకోవచ్చు. అయితే, జట్టు ఇప్పటికే బలమైన కోర్ టీమ్ ను రిటైన్ చేసుకోవడంతో చాలా మంది బిగ్ ప్లేయర్లను తీసుకునే అవసరం పెద్దగా లేదు. అవసరమైన చోట్ల మాత్రమే బ్యాకప్లు తీసుకోవడమే సన్ రైజర్స్ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.
సన్రైజర్స్ హైదరాబాద్ గత సీజన్లో బలహీనంగా కనిపించిన రెండు విభాగాలలో స్పిన్ బౌలింగ్, ఇండియన్ పేస్ బెంచ్ స్ట్రెంగ్త్. కావ్య మారన్ ఈ రెండు అంశాలపైనే ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా స్పిన్నర్ విభాగంలో సన్రైజర్స్ హైదరాబాద్ తగినంత బలం లేదు. దీంతో ఈసారి వేలంలో ప్రధానంగా నాణ్యమైన భారత స్పిన్నర్ను తీసుకోవడమే ప్రాధాన్యతగా ఉంది. ప్రస్తుతం జట్టులో జీషన్ అన్సారీ ఉన్నప్పటికీ, మిడిల్ ఓవర్లలో వికెట్లు సాధించే స్పిన్నర్ లేకపోవడం సన్రైజర్స్ కు పెద్ద లోటు. ఈ నేపథ్యంలోనే రవి బిష్ణోయ్ సన్రైజర్స్ హైదరాబాద్ ప్రధాన టార్గెట్ లిస్ట్లో మొదటి స్థానంలో ఉన్న పేరుగా వినిపిస్తోంది.
లక్నో సూపర్ జెయింట్స్ విడుదల చేసిన రవి బిష్ణోయ్, ఈ వేలంలో హాట్ కేక్ గా మారుతున్న ప్లేయర్. లెగ్ స్పిన్లో తనదైన విభిన్న శైలితో టీమిండియా తరఫున అద్భుత ప్రదర్శనలు ఇచ్చాడు. ఈ యువ బౌలర్ను తీసుకుంటే సన్రైజర్స్ హైదరాబాద్ స్పిన్ విభాగంలోని లోటు చాలా వరకు తగ్గుతుంది.
బిష్ణోయ్ను సొంతం చేసుకోవడంలో ఎస్ఆర్హెచ్ ఏ మాత్రం వెనక్కి తగ్గదనే సూచనలు పంపుతోంది. అతని కోసం కోట్ల రూపాయల బిడ్డింగ్కు సిద్ధంగా ఉన్నట్లు జట్టు వర్గాలు చెబుతున్నాయి. బిష్ణోయ్ చిక్కకపోతే మరో భారత స్పిన్నర్ను తీసుకునే అవకాశాలను కూడా చూస్తోంది.
బ్యాటింగ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే బలమైన టాప్ ఆర్డర్ ను కలిగి ఉంది. అయినప్పటికీ, లోయర్ మిడిల్ ఆర్డర్లో ఫినిషర్ పాత్ర గత సీజన్లో పెద్ద సమస్యగా మారింది. దీనిని దృష్టిలో పెట్టుకుని కావ్య మారన్ ఈసారి ఒక బిగ్ పవర్ హిట్టర్ను జట్టులోకి తీసుకోవాలని చూస్తోంది.
ఈ క్రమంలో ఆండ్రీ రస్సెల్ సన్రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ ప్లేయర్లలో ఉన్నాడు. రస్సెల్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో అద్భుతమైన ప్రదర్శనలు ఇవ్వగల అరుదైన స్టార్ ఆల్రౌండర్. ఒంటి చేతితో మ్యాచ్ ను మార్చే సామర్థ్యం అతనికి ఉంది.
కేకేఆర్ విడుదల చేసిన తర్వాత వేలంలో అతను చాలా జట్లకు టార్గెట్ గా ఉన్నాడు. అతను దక్కకపోతే కావ్య మారన్ బ్యాకప్ ఆప్షన్గా కామెరూన్ గ్రీన్, మ్యాక్స్వెల్, లివింగ్స్టోన్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ట్రేడ్ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో భారత పేసర్ లోటు ఏర్పడింది. అతని స్థానాన్ని భర్తీ చేయడానికి ఇద్దరు భారత ప్లేయర్లను టార్గెట్ చేసింది. వారిలో ఒకరు ఆకాశ్ దీప్. టీమిండియా తరఫున ఆడి మంచి స్పీడ్, యార్కర్ నైపుణ్యంతో తనకంటూ మంచి గుర్తింపు సాధించాడు.
మరొకరు ఆకాశ్ మధ్వాల్.. ముంబై ఇండియన్స్కు వైట్ బాల్ స్పెషలిస్ట్గా నిలిచిన యంగ్ బౌలర్. వీరిలో ఆకాశ్ దీప్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నాడు. అతను లభించకపోతే మధ్వాల్ వైపుకు వెళ్లనున్నారు. ఇలా మొత్తంగా కావ్య మారన్ నేతృత్వంలోని సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఈసారి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.