Today Top 5 News : నేడు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి

Published : Sep 14, 2025, 06:14 PM IST

Today Top 5 News : మీరు ఇవాళ్టి టాప్ న్యూస్ ఒకేచోట తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మీకోసమే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, నేషనల్ , ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ లో టాప్ 5 వార్తలు ఇక్కడ అందిస్తున్నాం.

PREV
15
తెలంగాణకు 904 టీఎంసీల హక్కు సాధనలో రాజీ లేదు: సీఎం రేవంత్‌రెడ్డి

కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు రావాల్సిన 904 టీఎంసీల హక్కు కోసం ఏ మాత్రం రాజీ పడబోమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘‘నికర జలాలు కావొచ్చు, మిగులు కావొచ్చు, వరద జలాలు కావొచ్చు... రాష్ట్రానికి చెందాల్సిన చుక్క నీటిని కూడా వదులుకోం’’ అని ఆయన స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ట్రైబ్యునల్‌లో సమర్థ వాదనలు వినిపించేందుకు అవసరమైన చర్యలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు.

ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ విచారణలో రాష్ట్ర తుది వాదనలు వినిపించనుంది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విచారణలో పాల్గొని తెలంగాణ ప్రయోజనాలను రక్షించేలా న్యాయ నిపుణులతో బలమైన వాదనలు చేయాలని సీఎం సూచించారు.

25
మోడీ-చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి దిశగా ఏపీ

ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. పీవీఎన్‌ మాధవ్ చేపట్టిన ‘సారథ్యం’ యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ.. గత వైకాపా పాలన అవినీతి, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలతో నిండిపోయిందని విమర్శించారు.

అలాగే, ‘‘సబ్ కా సాథ్‌, సబ్ కా వికాస్‌, సబ్ కా విశ్వాస్‌’’ నినాదంతో దేశం ముందుకు వెళ్తుందని చెప్పారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు, జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఉపశమనం కలిగించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి, విశాఖ, కాకినాడ, తిరుపతిని స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దడం, సాగర్‌మాలలో 14 పోర్టులు, కొత్త విద్యా సంస్థలు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు, వందే భారత్ రైళ్లను తీసుకురావడం వంటి చర్యలు చేపట్టినట్టు వివరించారు. త్వరలో భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని నడ్డా తెలిపారు.

35
అసోంలో 5.8 తీవ్రతతో భూకంపం.. సరిహద్దు దేశాల్లోనూ ప్రకంపనలు

ఈశాన్య భారత రాష్ట్రమైన అసోంలో ఆదివారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.8గా నమోదైంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఉదల్‌గిరి జిల్లాలోని ధెకియజులి ప్రాంతానికి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో కేంద్రం ఏర్పడింది. ఇది భూమి 5 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు పేర్కొన్నారు.

భూకంపం కారణంగా కొన్ని ఇళ్లు స్వల్పంగా కంపించాయని స్థానికులు చెప్పారు. అయితే ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రకంపనలు అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ కనిపించింది. అలాగే బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్, చైనా దేశాల్లో కూడా ప్రకంపనలు నమోదైనట్లు సమాచారం.

45
భారత్ vs పాకిస్తాన్ : ఆసియా కప్ లో బిగ్ మ్యాచ్

ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ పోరుకు క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ బిగ్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య రైవల్రీ 1984లో షార్జాలో జరిగిన తొలి ఆసియా కప్ నుంచే ప్రారంభమైంది. అప్పుడు భారత్ 54 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. అప్పటి నుంచి ప్రతి సారి ఈ జట్ల పోరు క్రికెట్ లవర్స్‌కు అద్భుతమైన థ్రిల్‌ను అందిస్తోంది.

ఆసియా కప్ చరిత్రలో భారత్-పాకిస్తాన్ జట్లు 19 సార్లు తలపడ్డాయి. వీటిలో భారత్ 10 విజయాలు సాధించగా, పాకిస్తాన్ 6 విజయాలు సాధించింది. మిగతా 3 మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి.

వన్డేలు: 15 మ్యాచ్‌లు – భారత్ 8 విజయాలు, పాకిస్తాన్ 5 విజయాలు, 2 ఫలితం లేనివి

టీ20లు: 4 మ్యాచ్‌లు – భారత్ 3 విజయాలు, పాకిస్తాన్ 1 విజయం

ఈ గణాంకాల ప్రకారం ఆసియా కప్ చరిత్రలో భారత్‌కు పాకిస్తాన్‌పై స్వల్ప ఆధిక్యం ఉంది. ప్రస్తుతం యువ ఆటగాళ్లతో కూడిన బలమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌తో టీమ్ ఇండియా మరింత శక్తివంతంగా కనిపిస్తోంది. 

55
చైనాపై 100 శాతం సుంకాలు విధిస్తా.. : ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నాటో దేశాలకు కీలక సందేశం ఇచ్చారు. రష్యా నుంచి చమురు దిగుమతులు పూర్తిగా నిలిపివేయాలని పిలుపునిచ్చారు. అంతేకాదు, రష్యన్‌ పెట్రోలియం కొనుగోలు చేస్తున్న చైనాపై 50 నుంచి 100 శాతం సుంకాలు విధించే అవకాశం ఉందని తెలిపారు. భారీ సుంకాలే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని అడ్డుకునే మార్గమని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కొన్ని నాటో దేశాలు ఇప్పటికీ రష్యా చమురు దిగుమతులు కొనసాగించడం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories