Rahul Gandhi: లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026పై జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ విద్యా వ్యవస్థపై ఆర్ఎస్ఎస్కు పూర్తి నియంత్రణ ఉందని ఆరోపించారు.
దేశ విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ నియంత్రిస్తోంది..
పరీక్షల వ్యవస్థను ఆర్ఎస్ఎస్ పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కీలక విద్యా సంస్థల్లో ఆర్ఎస్ఎస్కు చెందిన వ్యక్తులే ఉన్నారని చెప్పారు. "ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినా ఉపయోగం లేదు. ఆయన కేవలం ఒక ప్రతీక మాత్రమే. దేశ విద్యా వ్యవస్థను నడిపేది ఆర్ఎస్ఎస్. ప్రతి విశ్వవిద్యాలయంలో ఆర్ఎస్ఎస్కు చెందిన వైస్ ఛాన్సలర్లు ఉన్నారు" అని రాహుల్ వ్యాఖ్యానించారు.
25
నీట్ నిరసనలకు రాహుల్ మద్ధతు
నీట్-యూజీ 2026 పరీక్షలో అక్రమాల ఆరోపణల తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థుల నిరసనలకు రాహుల్ గాంధీ మద్ధతు తెలిపారు. విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం ఆందోళన వ్యక్తం చేశారని, అందులో హింస లేదని అన్నారు. యువత తమ భావాలను ప్రజాస్వామ్యబద్ధంగా వ్యక్తం చేసిందని, అన్ని రాజకీయ పార్టీలు ఆ భావాలను గౌరవించాలని సూచించారు. బీజేపీ నేతలు కూడా తమ పిల్లలను ఈ అంశంపై అడిగితే ఇదే అభిప్రాయం చెబుతారని రాహుల్ అన్నారు. విద్యార్థుల నిరసనలో తప్పేమీ లేదని, ప్రతి భారతీయుడు వారిని చూసి గర్వపడాలని వ్యాఖ్యానించారు.
35
"విద్యార్థులు, మూర్ఖులు, అంధభక్తులు" వ్యాఖ్యలతో సభలో దుమారం
తన ప్రసంగంలో ఒక 18 ఏళ్ల విద్యార్థితో జరిగిన సంభాషణను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ఆ విద్యార్థి సమాజాన్ని మూడు వర్గాలుగా విభజించాడని చెబుతూ, "విద్యార్థులు, మూర్ఖులు, అంధభక్తులు" అని వ్యాఖ్యానించారు. అలాగే "అంధభక్తుడు అంటే మరో మూర్ఖుడినే దేవుడిగా నమ్మే వ్యక్తి" అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై అధికార పక్ష ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ఈ వ్యాఖ్యలు అనుచితమని, పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని బీజేపీ సభ్యులు నిరసన తెలిపారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. అనుచిత పదజాలాన్ని ఉపయోగించవద్దని ఆయన సూచించారు. దీనికి స్పందించిన రాహుల్ గాంధీ, తాను మాట్లాడటం ప్రారంభించిన వెంటనే అధికార పక్ష సభ్యులు అడ్డుకుంటున్నారని, సభలో క్రమశిక్షణను కాపాడటం స్పీకర్ బాధ్యత అని అన్నారు. స్పీకర్ ఓం బిర్లా కూడా బిల్లుకు సంబంధించిన అంశాలపైనే మాట్లాడాలని, నిరాధార ఆరోపణలు చేయవద్దని రాహుల్ను సూచించారు.
55
విద్యార్థులపై బలప్రయోగం జరిగిందని ఆరోపణ..
విద్యార్థుల నిరసనలను అణచివేయడానికి పోలీసులు పెల్లెట్ గన్స్ ఉపయోగించారని, ఇది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అంత ముఖ్యమైన అంశంపై హోంమంత్రి అమిత్ షా సభలో లేకపోవడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. దీనిపై కిరణ్ రిజిజు తీవ్రంగా స్పందిస్తూ, ఈ ఆరోపణలకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. "ఏ ఉత్తర్వు ఆధారంగా హోంమంత్రి కాల్పులకు ఆదేశించారో సభ ముందు పెట్టండి. ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయకండి" అని అన్నారు. స్పీకర్ కూడా రాహుల్ గాంధీని పలుమార్లు హెచ్చరిస్తూ, బిల్లుకు సంబంధించిన చర్చకే పరిమితం కావాలని సూచించారు.
సభలో వాగ్వాదాలతో వేడెక్కిన చర్చ
నీట్ పరీక్ష అక్రమాలు, విద్యా వ్యవస్థ, విద్యార్థుల నిరసనలు, కేంద్ర ప్రభుత్వ పాత్రపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు లోక్సభలో తీవ్ర దుమారానికి దారితీశాయి. ఆయన చేసిన ఆరోపణలను అధికార పక్షం తీవ్రంగా ఖండించగా, నిరాధార వ్యాఖ్యలు చేయొద్దని పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లుపై చర్చ రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలతో వేడెక్కింది.