
దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుతం నిరసనలు, ఆందోళనలతో వేడెక్కింది. ఈ ఏడాది మే నెలలో జరిగిన NEET-UG పరీక్ష పేపర్ లీక్ కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన తర్వాత కనీసం 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం గమనార్హం. గత నెల చివర్లో రీ-టెస్ట్ నిర్వహించినప్పటికీ ఆందోళనలు తగ్గలేదు.
సోషల్ మీడియాలో వ్యంగ్య ప్లాట్ఫామ్గా మొదలైన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) నేతృత్వంలో వేలాది మంది యువకులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 'సంసద్ మార్చ్' చేపట్టారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. దీనిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.
మరోవైపు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు మంగళవారం 'కిసాన్ ఘాట్' వద్ద మహాపంచాయత్ నిర్వహించారు. ప్రతిపాదిత భారత్-అమెరికా వర్తక ఒప్పందం దేశంలోని వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులను అడ్డుకోవడానికి పోలీసులు ఢిల్లీ సరిహద్దులను మూసివేసి, వాణిజ్య భద్రతా చర్యలను అమలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్లో నిరసన తెలపడం చట్టపరమైన హక్కా? దానికి ఉన్న పరిమితులు, పోలీసుల అధికారాలు ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
భారత రాజ్యాంగంలో నేరుగా నిరసన తెలిపే హక్కు గురించి విడిగా రాయలేదు. అయితే ఇది ఆర్టికల్ 19 ద్వారా లభించే ఒక అంతర్గత ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసింది. ఆర్టికల్ 19(1)(a) పౌరులకు భావప్రకటనా స్వేచ్ఛను ఇస్తుంది. దీని ద్వారా ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించే, ప్రజాభిప్రాయాన్ని సమీకరించే అవకాశం లభిస్తుంది.
ఆర్టికల్ 19(1)(b) ప్రకారం పౌరులు ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే హక్కును కలిగి ఉంటారు. అలాగే ఆర్టికల్ 19(1)(c) సంఘాలు, యూనియన్లు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను ఇస్తుంది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC) 47వ సమావేశంలో భారత ప్రతినిధి పవన్ కుమార్ బధే కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో అహింసాత్మక మార్చ్లే ప్రధాన ఆయుధాలని, అందుకే శాంతియుతంగా సమావేశమయ్యే హక్కును రాజ్యాంగం ప్రాథమిక హక్కుగా గుర్తించిందని ఆయన తెలిపారు.
భారత్లో నిరసన తెలిపే హక్కు పరిమితులు లేనిది కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2), 19(3) ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వం కొన్ని సమంజసమైన ఆంక్షలు విధించవచ్చు. దేశ సార్వభౌమత్వం, సమగ్రత, రాజ్య భద్రత, శాంతిభద్రతలు, నైతికత కాపాడటం లేదా నేరాలకు ప్రోత్సహించకుండా చూడటం వంటి కారణాలతో ఈ ఆంక్షలు అమలు చేస్తారు.
ముఖ్యంగా నిరసనకారులు ప్రజా రహదారులను, రోడ్లను కాలపరిమితి లేకుండా దిగ్బంధించడం లేదా ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించడం చట్టవిరుద్ధం. నిరసనలకు, శాసనోల్లంఘనకు మధ్య స్పష్టమైన తేడా ఉంది. శాంతియుత నిరసనలు అనుమతులతో చట్టపరిధిలో జరుగుతాయి. కానీ శాసనోల్లంఘన అంటే కావాలని కర్ఫ్యూలు, చట్టాలను ఉల్లంఘించడం. అలాంటప్పుడు నిరసనకారులు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే, ఆర్టికల్ 51A నిరసనల సమయంలో ప్రభుత్వ ఆస్తులను రక్షించడం, హింసకు దూరంగా ఉండటం పౌరుల ప్రాథమిక విధి అని చెబుతోంది.
రోడ్లపై లేదా బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలు నిర్వహించడానికి పోలీసు అనుమతి తప్పనిసరి అని 1973 నాటి చరిత్రాత్మక 'హిమత్ లాల్ కే షా వర్సెస్ పోలీస్ కమిషనర్' కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది హక్కులను అణచివేయడం కాదని, ట్రాఫిక్ నిరోధించడం, గుంపును నియంత్రించడం, అంబులెన్స్ వంటి అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా చూడటానికేనని వెల్లడించింది. అందువల్ల ఆందోళనకారులు సంబంధిత డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ లేదా డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వం కొన్ని ప్రత్యేక అధికారాలను ఉపయోగిస్తుంది. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 163 (పాత CrPC సెక్షన్ 144) కింద మేజిస్ట్రేట్ ఆంక్షలు విధించవచ్చు. ఈ ఆదేశాల ప్రకారం సున్నితమైన ప్రాంతాల్లో 5 లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం, ర్యాలీలు తీయడం నిషేధం. ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తే భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 223 కింద శిక్షార్హమైన నేరం.
శాంతిభద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉందని భావిస్తే నిరసనకారులను పోలీసులు 'ముందస్తు నిర్బంధం' చేయవచ్చు. ఒకవేళ అనుమతి లేని నిరసనలో పాల్గొన్నా వారిని అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది. అయితే ఆర్టికల్ 22 ప్రకారం అరెస్ట్ అయిన వ్యక్తికి కారణాలు తెలుసుకునే హక్కు, 24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టబడే ప్రాథమిక రక్షణలు లభిస్తాయి.
నిరసనకారులు హింసాత్మకంగా మారినా లేదా నిషేధిత ప్రాంతాల వైపు (ఉదాహరణకు పార్లమెంట్ మార్గ్) దూసుకెళ్లినా, పోలీసులు చట్టపరమైన ప్రక్రియను అనుసరించి బలప్రయోగం చేయవచ్చు. మొదట ఆ గుంపును 'చట్టవిరుద్ధమైన సమావేశం' గా ప్రకటిస్తారు. ఆ తర్వాత డ్యూటీ మేజిస్ట్రేట్ లేదా సబ్-ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి లౌడ్స్పీకర్ ద్వారా గుంపును శాంతియుతంగా వెళ్లిపోవాలని హెచ్చరిస్తారు.
ఆ హెచ్చరికను పాటించకపోతే శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం పోలీసులు 'కనీస బలప్రయోగం' చేయవచ్చు. దీని కోసం వరుసగా ఈ క్రింది చర్యలు తీసుకుంటారు:
• మొదటి దశ: వాటర్ కేనన్లు ప్రయోగించడం.
• రెండో దశ: టియర్ గ్యాస్ ప్రయోగించడం.
• చివరి మార్గం: ఇవన్నీ విఫలమైనప్పుడు మాత్రమే లాఠీచార్జ్ చేస్తారు.
లాఠీచార్జ్ సమయంలో శరీరంలోని సున్నితమైన భాగాలు అంటే తల, కాలర్ బోన్ వంటి వాటిపై కొట్టకూడదనే కఠినమైన నిబంధనలు ఉన్నాయి.
ప్రజాస్వామ్యంలో నిరసనలకు, అసమ్మతికి ఉన్న ప్రాధాన్యం ను సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు సమర్థిస్తూనే ఉంది.
• రామ్లీలా మైదాన్ కేసు (2012): శాంతియుతంగా నిరసన తెలపడం పౌరుల ప్రాథమిక హక్కు అని, తగిన కారణం లేకుండా ప్రభుత్వం దానిని అడ్డుకోలేదని కోర్టు స్పష్టం చేసింది.
• ఎన్జీటీ ఆదేశాలు (2017): ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తీవ్ర శబ్ద కాలుష్యం, స్థానికులకు ఇబ్బంది కలగడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (NGT) అక్కడ నిరసనలపై పూర్తి నిషేధం విధించింది.
• మజ్దూర్ కిసాన్ శక్తి సంగథన్ (2018): నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని, అయితే జంతర్ మంతర్, రామ్లీలా మైదాన్ వంటి నిర్దేశిత ప్రాంతాలలో మాత్రమే ఆందోళనలు నిర్వహించేలా నియమాలు రూపొందించాలని కోర్టు ఆదేశించింది.
• షాహీన్ బాగ్ / అమిత్ సాహ్ని కేసు (2020): నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ, ఆ పేరుతో ప్రజా రహదారులను లేదా రోడ్లను నిరవధికంగా అడ్డుకోవడం సరికాదని, ఆందోళనలు కేవలం నిర్దేశిత ప్రాంతాలకే పరిమితం కావాలని అత్యున్నత నాయస్థానం స్పష్టం చేసింది.
దీని పై ఇప్పటివరకు జరిగిన ఘటనలు చూస్తే భారతదేశంలో నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ప్రాథమిక హక్కు. అయితే అది శాంతియుతంగా, చట్టబద్ధంగా, ఇతరుల హక్కులకు భంగం కలగకుండా వినియోగించినప్పుడే రాజ్యాంగ రక్షణ పొందుతుంది. ప్రజల హక్కులు, ప్రజా శాంతి రెండింటినీ సమానంగా కాపాడే విధంగా రాజ్యాంగం ఈ హక్కును గుర్తించింది.