Highway: ఇక‌పై ఆ దేశాల‌కు కారులో వెళ్లిపోవ‌చ్చు.. 1360 కి.మీల భారీ ర‌హ‌దారి నిర్మాణం

Published : Aug 12, 2026, 02:40 PM IST

Highway: భారత్‌ ఈశాన్య ప్రాంతాన్ని ఆగ్నేయాసియాతో నేరుగా అనుసంధానించే కీలక ప్రాజెక్టుల్లో ఇండియా-మయన్మార్-థాయ్‌లాండ్ ట్రైలేటరల్ హైవే (IMT Highway) ఒకటి. మణిపూర్‌లోని మోరెహ్ నుంచి మయన్మార్ మీదుగా థాయ్‌లాండ్‌లోని మే సోట్ వరకు ఈ రహదారి సాగుతుంది.

PREV
15
1,360 కి.మీ. హైవే.. భారత్ నుంచి థాయ్‌లాండ్ వరకు

ఈ ట్రైలేటరల్ హైవే మణిపూర్‌లోని మోరెహ్ నుంచి ప్రారంభమై.. మయన్మార్ మీదుగా థాయ్‌లాండ్‌లోని మే సోట్ వరకు కొనసాగుతుంది. మార్గంలో టాము, కలేవా, మండలే, నేపిడా వంటి ప్రాంతాలు వస్తాయి. ఈ ప్రాజెక్టును 2002లో తొలిసారిగా ప్రతిపాదించారు. భారత్‌కు ఆగ్నేయాసియాతో భూభాగం ద్వారా మెరుగైన రహదారి కనెక్టివిటీ కల్పించడమే ప్రధాన లక్ష్యం. ప్రాజెక్టులో భాగంగా కలేవా-యాగీ రహదారి, టాము-క్యిగోన్-కలేవా మార్గంలోని వంతెనల నిర్మాణం, రహదారి అభివృద్ధి వంటి పనులను భారత్ చేపట్టింది.

25
భారత్‌కు ఈ రహదారి ఎందుకు కీలకం?

భారత్‌ ఈశాన్య రాష్ట్రాలకు ప్రస్తుతం భౌగోళికంగా ఉన్న కొన్ని పరిమితులను తగ్గించడంలో ఈ హైవే కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. రహదారి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఈశాన్య ప్రాంతం నుంచి మయన్మార్, థాయ్‌లాండ్‌తో పాటు ఇతర ASEAN దేశాల మార్కెట్లకు రవాణా సులభమవుతుంది. దీంతో వస్తువుల రవాణా సమయం, లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. వ్యాపారం, పర్యాటకం, పెట్టుబడులు, విద్య, ప్రజల మధ్య రాకపోకలు కూడా పెరగవచ్చు. భారత్‌ ఈ ప్రాజెక్టును ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’లో కీలక కనెక్టివిటీ ప్రాజెక్టుగా పరిగణిస్తోంది.

35
మయన్మార్‌లో సమస్యలతో ఆలస్యం..

ఈ ప్రాజెక్టుకు మయన్మార్‌లో కొనసాగుతున్న రాజకీయ, భద్రతా పరిస్థితులు ప్రధాన అడ్డంకిగా మారాయి. పలు ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగుతుండటంతో రహదారి నిర్మాణం, రవాణా కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ప్రాజెక్టును పూర్తి చేయాలనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 2026 జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, మయన్మార్ అధ్యక్షుడు యూ మిన్ ఆంగ్ హ్లైంగ్ సమావేశంలో కలాదాన్ ప్రాజెక్టుతో పాటు ఇండియా-మయన్మార్-థాయ్‌లాండ్ ట్రైలేటరల్ హైవేను పూర్తి చేయడానికి కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఇరు దేశాలు స్పష్టం చేశాయి. అలాగే 2026 జూలైలో భారత్-మయన్మార్ జాతీయ స్థాయి సమావేశంలో కూడా ఈ హైవేను పూర్తి చేయడంపై ఇరు పక్షాలు ప్రాధాన్యం ఇచ్చాయి.

45
వాణిజ్యానికి ఎలా ఉపయోగపడుతుంది?

ఈ హైవే అందుబాటులోకి వస్తే భారత్‌కు ASEAN దేశాలతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల నుంచి వస్తువులను భూభాగం ద్వారా మయన్మార్, థాయ్‌లాండ్‌కు తరలించడం సులభమవుతుంది. వ్యాపార సంస్థలకు కొత్త మార్కెట్లు అందుబాటులోకి రావడంతో పాటు సప్లై చైన్ మెరుగుపడే అవకాశం ఉంది. పర్యాటక రంగానికి కూడా ప్రయోజనం కలగవచ్చు. భవిష్యత్తులో ఈ రహదారి కారిడార్‌ను లావోస్, కంబోడియా, వియత్నాం వరకు విస్తరించే ప్రణాళికలు ఉన్నాయి. దీంతో భారత్‌-ఆగ్నేయాసియా మధ్య మరింత విస్తృతమైన భూసంబంధం ఏర్పడే అవకాశం ఉంటుంది.

55
భారత్‌ వ్యూహాత్మక ప్రణాళికలో దీనికి ప్రత్యేక స్థానం

ఈ హైవే కేవలం రహదారి నిర్మాణ ప్రాజెక్టు మాత్రమే కాదు.. భారత్‌కు వ్యూహాత్మకంగానూ ఎంతో ముఖ్యమైనది. ఈశాన్య ప్రాంతాన్ని ఆగ్నేయాసియాకు ‘గేట్‌వే’గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంలో ఇది కీలక భాగం. భారత్‌-మయన్మార్-థాయ్‌లాండ్ మధ్య రవాణా సంబంధాలు మెరుగుపడితే వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటకం పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థిక అనుసంధానం కూడా బలపడే అవకాశం ఉంది. అయితే రహదారి పూర్తిగా పనిచేయాలంటే మౌలిక వసతులతో పాటు సరిహద్దు అనుమతులు, కస్టమ్స్ విధానాలు, వాహనాల రాకపోకలకు సంబంధించిన నిబంధనలు కూడా సమన్వయం కావాలి. ఈ అంశాల్లో ప్ర‌భుత్వాల‌ చర్చలు అవసరం. మొత్తంగా చూస్తే, ఇండియా-మయన్మార్-థాయ్‌లాండ్ ట్రైలేటరల్ హైవే పూర్తయితే భారత్‌ ఈశాన్య ప్రాంతానికి కొత్త ఆర్థిక అవకాశాలు తెరుచుకునే అవకాశం ఉంది. ASEAN దేశాలతో భారత్‌ వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది.

Read more Photos on
click me!

Recommended Stories