Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !

Published : Dec 09, 2025, 06:04 PM IST

India First Digital Census 2027 : భారతదేశపు తొలి డిజిటల్ జనాభా లెక్కలు 2027లో జరగనున్నాయి. మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ ద్వారా ప్రజలే స్వయంగా వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

PREV
16
2027 జనగణనలో భారీ మార్పులు: మొట్టమొదటిసారిగా డిజిటల్ రూపంలో

దేశంలో జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. 2027లో జరగబోయే జనగణనను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్‌సభలో వెల్లడించారు. 

కాగితరహితంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలు, షెడ్యూల్, మార్పుల గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

26
Census 2027 : ఇకపై ఇంటి నుండే మీ జనాభా వివరాల నమోదు.. ఎలాగంటే?

భారతదేశ చరిత్రలోనే ఇది మొట్టమొదటి 'డిజిటల్ సెన్సస్' కావడం ప్రత్యేకతగా చెప్పవచ్చు. గతంలో మాదిరిగా కాగితపు పత్రాలపై వివరాలు రాసుకునే పద్ధతికి స్వస్తి పలికి, మొబైల్ అప్లికేషన్ల ద్వారా డేటాను సేకరించనున్నారు. ఈ బృహత్తర కార్యక్రమం కోసం దాదాపు 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లు తమ సొంత స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించనున్నారు.

ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ (iOS) ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేసేలా ఈ యాప్ లో బహుళ భారతీయ భాషలకు సపోర్టు  ఉంటుంది. డేటా సేకరణలో పారదర్శకత, వేగం పెంచడమే ఈ డిజిటల్ విధానం ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

36
Census 2027 : మీ కులం, వలస వివరాలు చెప్పాల్సిందే.. కేంద్రం కొత్త నిబంధనలు ఇవే !

ఈసారి జనాభా లెక్కల్లో వలసల సమాచారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతి వ్యక్తి ప్రస్తుతం నివసిస్తున్న ప్రదేశంలోనే వారి వివరాలను సేకరిస్తారు. దీనితో పాటు, వలసలకు సంబంధించిన పూర్తి డేటాను రికార్డు చేయనున్నారు. ముఖ్యంగా వ్యక్తి పుట్టిన ప్రదేశం, చివరగా నివసించిన ప్రదేశం, ప్రస్తుత నివాసంలో ఎంతకాలంగా ఉంటున్నారు, వలస రావడానికి గల కారణాలను క్షుణ్ణంగా నమోదు చేస్తారని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

అలాగే, 2025 ఏప్రిల్ 30న జరిగిన క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ నిర్ణయం మేరకు, 2027 సెన్సస్‌లో మొదటిసారిగా 'కులగణన' (Caste Enumeration) కూడా చేర్చనున్నారు. సెన్సస్ చట్టం, 1948 ప్రకారం పౌరులు తమకు తెలిసినంత వరకు సరైన సమాచారాన్ని ఇవ్వడం చట్టపరంగా తప్పనిసరి.

46
Census 2027 : డిజిటల్ జనాభా లెక్కలతో వచ్చే మార్పులు ఏమిటి?

సాంకేతికతను ఉపయోగించడంతో పాత పద్ధతుల్లో అనేక కీలక మార్పులు రానున్నాయి.

  • స్వయంగా నమోదు : పౌరులు తమ కుటుంబ, వ్యక్తిగత వివరాలను తామే స్వయంగా నింపుకునే వెసులుబాటును కల్పించనున్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీనికోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ అందుబాటులోకి రానుంది.
  • లాగిన్ విధానం: మొబైల్ నంబర్ లేదా ఆధార్ లింక్డ్ అథెంటికేషన్ ద్వారా పోర్టల్‌లోకి లాగిన్ అయ్యి వివరాలు నమోదు చేయవచ్చు.
  • వెరిఫికేషన్: ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసిన తర్వాత ప్రతి కుటుంబానికి ఒక యూనిక్ ఐడీ  వస్తుంది. ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు ఈ ఐడీని చూపిస్తే సరిపోతుంది, మళ్లీ వివరాలు చెప్పాల్సిన అవసరం ఉండదు.
  • మానిటరింగ్: మొత్తం ప్రక్రియను పర్యవేక్షించడానికి 'సెన్సస్ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్' పోర్టల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇది ఎప్పటికప్పుడు డేటా నాణ్యతను పరిశీలిస్తూ, ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
56
Census 2027 ఎప్పుడు షురూ చేస్తారు?

జనగణన ప్రక్రియలో జాప్యం జరిగినప్పటికీ, ప్రభుత్వం ఇప్పుడు స్పష్టమైన రోడ్‌మ్యాప్‌తో ముందుకు వెళ్తోంది. 2027 సెన్సస్ రెండు దశల్లో జరగనుంది.

1. మొదటి దశ: ఇళ్ల జాబితా, హౌసింగ్ సెన్సస్. ఇది 2026 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్య జరుగుతుంది.

2. రెండవ దశ: జనాభా గణన. ఇది 2027 ఫిబ్రవరిలో జరుగుతుంది. దీనికి రిఫరెన్స్ తేదీగా 2027 మార్చి 1ని నిర్ణయించారు.

డిజిటల్ వ్యవస్థలు, ప్రశ్నావళిని పరీక్షించడానికి, ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 16, 2025 నాటి గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఈ ట్రయల్స్ జరుగుతున్నాయి. యాప్ పనితీరు, శిక్షణ అవసరాలు, ప్రజల స్పందనను అంచనా వేయడానికి ఈ ట్రయల్స్ ఉపయోగపడతాయి.

66
Census 2027: ఇప్పుడు డిజిటల్ గా ఎందుకు?

వేగంగా మారుతున్న ప్రపంచంలో, డేటా విశ్లేషణ, నిర్ణయాలు తీసుకోవడంలో ఖచ్చితత్వం అవసరం. అందుకే ప్రభుత్వం పేపర్ ఆధారిత విధానం నుండి డిజిటల్ విధానానికి మారింది. ప్రస్తుతం రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ కార్యాలయం ప్రశ్నావళిని ఖరారు చేసే పనిలో ఉంది.

వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల నుండి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. డిజిటల్ ఫార్మాట్‌లో ప్రశ్నలు స్పష్టంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడానికి డ్రాఫ్ట్ ప్రశ్నావళిని క్షేత్రస్థాయిలో పరీక్షిస్తున్నారు. సెన్సస్ రూల్స్, 1990 ప్రకారం, ఫీల్డ్ వర్క్ ప్రారంభించే ముందు ఈ తుది ప్రశ్నావళిని కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్‌లో నోటిఫై చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించే అవకాశముంది.

Read more Photos on
click me!

Recommended Stories