Bharat Vistar: ప్రస్తుతం అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వ్యవసాయంలోనూ ఉపయోగించనున్నారు. భారత్ విస్తార్ పేరుతో కొత్త ఏఐ టూల్ తీసుకురానున్నట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
యూనియన్ బడ్జెట్ 2026-27లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘భారత్ విస్తార్’ పేరుతో కొత్త AI ఆధారిత ప్లాట్ఫామ్ను ప్రకటించారు. ఇది బహుభాషల్లో పనిచేసే ఆధునిక టెక్నాలజీ సాధనం. రైతులకు అవసరమైన సమాచారం ఒకేచోట లభించేలా ఈ వ్యవస్థ రూపొందించారు. AgriStack పోర్టల్స్, ICAR వ్యవసాయ పద్ధతులను AI సాయంతో కలిపి రైతుల నిర్ణయాలకు స్పష్టత తీసుకొచ్చే లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించారు.
25
రైతులకు ఎలా ఉపయోగపడుతుంది?
భారత్ విస్తార్ ద్వారా రైతులకు పంటలపై సలహాలు, వాతావరణ అంచనాలు, మార్కెట్ ధరల సమాచారం వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా అందుతుంది. దీని వల్ల పంట నష్టాల ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది. సాగు ఉత్పాదకత పెరగడం, ఖర్చులు తగ్గడం కూడా ఈ ప్లాట్ఫామ్ లక్ష్యం. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ఇది చాలా ఉపయోగకరంగా మారనుంది.
35
పశుపోషణ రంగానికి బడ్జెట్ మద్ధతు
వ్యవసాయంతో పాటు పశుపోషణ రంగానికి కూడా కేంద్ర ప్రభుత్వం బలమైన మద్ధతు ప్రకటించింది. క్రెడిట్ లింక్ సబ్సిడీ పథకం ద్వారా పశుసంవర్ధకులకు రుణ సౌకర్యాలు కల్పించనున్నారు. పశు పెంపకం యూనిట్ల ఆధునీకరణ, విస్తరణకు ప్రోత్సాహం అందించనున్నారు. డెయిరీ, పౌల్ట్రీ రంగాల్లో సమగ్ర విలువ గొలుసులు అభివృద్ధి చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ బడ్జెట్లో అధిక ఆదాయం ఇచ్చే పంటలకు ప్రత్యేక ప్రోత్సాహం ఇచ్చారు. కొబ్బరి, జీడి, కోకో, గంధపు చెక్క, బాదం, వాల్నట్, పైన్ నట్ వంటి పంటల సాగును ప్రోత్సహించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద కొబ్బరి ఉత్పత్తిదారుడిగా ఉన్న భారత్లో ఉత్పత్తి పెంచేందుకు ప్రత్యేక పథకం అమలు చేయనున్నారు. పనికిరాని చెట్ల స్థానంలో అధిక దిగుబడి ఇచ్చే మొక్కలు నాటే కార్యక్రమాలు కీలక రాష్ట్రాల్లో చేపట్టనున్నారు.
55
మత్స్యకార రంగం, యువత ఉపాధిపై దృష్టి
మత్స్యకార రంగంలో 500 జలాశయాలు, నీటి వనరుల సమగ్ర అభివృద్ధికి కొత్త కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. స్టార్టప్లు, మహిళా సంఘాలు, ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల ద్వారా మార్కెట్ అనుసంధానం పెంచాలని లక్ష్యం. ఈ చర్యలతో గ్రామీణ ఆదాయం పెరగడం, యువతకు ఉపాధి అవకాశాలు రావడం ఆశిస్తున్నారు. వ్యవసాయ రంగంపై ఆధారపడుతున్న 46.1 శాతం వర్క్ ఫోర్స్కు ఈ సంస్కరణలు దిశానిర్దేశం చేయనున్నాయి.