
ఇటీవల ఫేస్బుక్లో అవినాష్ ఓ వీడియోను షేర్ చేశాడు. ఇందులో అతని ట్రావెల్ జర్నీ గురించి వివరించారు. అవినాష్ జీవితంలో అసలు మలుపు కరోనా కాలంలో వచ్చిందని తెలిపారు. ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాకపోయిన సమయంలో తన దగ్గర ఉన్న రూ.30 వేలతో ప్రయాణం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ముగ్గురు స్నేహితులతో కలిసి దేశవ్యాప్తంగా 100 రోజుల పాటు పర్యటించారు. ఈ ప్రయాణంలో భారతదేశంలోని అనేక ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. అదే సమయంలో ఒక చిన్న మొబైల్ ఫోన్తో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తన అనుభవాలను వీడియోల రూపంలో పంచుకోవడం మొదలుపెట్టారు. పెద్ద కెమెరాలు, భారీ పెట్టుబడులు లేకుండానే వరుసగా వీడియోలు అప్లోడ్ చేస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో సుమారు 550 వీడియోలను రూపొందించారు.
ప్రారంభంలో పెద్దగా ఆదాయం లేకపోయినా, వీడియోల విషయంలో క్రమశిక్షణ పాటించడం తన విజయానికి ప్రధాన కారణమని అవినాష్ చెబుతున్నారు. నిరంతరం కంటెంట్ అప్లోడ్ చేయడం వల్ల ప్రేక్షకుల నమ్మకం పెరిగింది. యూట్యూబ్ నుంచి వచ్చిన తొలి ఆదాయం సుమారు రూ.40 వేలు. భారత్ మొత్తం తిరిగేలోపే ఆదాయం రూ.1.5 లక్షలకు చేరుకుంది. ముఖ్యంగా ఎలాంటి చెల్లింపు ప్రమోషన్లు చేయకుండా, నిజాయితీతో కూడిన కంటెంట్ అందించడం ద్వారా ప్రేక్షకుల విశ్వాసాన్ని సంపాదించగలిగారు. దీంతో ఆ రోజుల్లోనే దాదాపు 30 వేల మంది సబ్స్క్రైబర్లను పొందారు.
30 వేల మంది సబ్స్క్రైబర్లు, సుమారు రూ.60 వేల పొదుపుతో అవినాష్ ప్రపంచ యాత్రను ప్రారంభించారు. ఖరీదైన దేశాల కంటే బడ్జెట్ ఫ్రెండ్లీ దేశాలను ఎంచుకోవడం ద్వారా ఖర్చులను నియంత్రించారు. థాయ్లాండ్, ఇండోనేషియా వంటి దేశాల్లో తక్కువ ఖర్చుతో జీవించడం సాధ్యమని ఆయన వివరించారు. హోటళ్లకు బదులుగా హాస్టళ్లలో ఉండటం, స్థానిక రవాణాను ఉపయోగించడం, అవసరమైన ఖర్చులకే పరిమితం కావడం ద్వారా తక్కువ బడ్జెట్లోనే అనేక దేశాలు సందర్శించవచ్చని చెప్పారు. ప్రయాణిస్తూ తీసిన వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దీంతో ఛానల్ వృద్ధి చెందడంతో పాటు ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది.
ప్రపంచాన్ని తిరగాలనుకునే వారికి ఫ్రీలాన్సింగ్ ఒక మంచి అవకాశం అని అవినాష్ సూచించారు. ప్రస్తుతం అనేక ఉద్యోగాలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో అందుబాటులో ఉన్నాయి. అలాంటి పనులు చేసే వారు వారంలో ఐదు రోజులు పని చేసి, మిగతా రెండు రోజులు కొత్త ప్రదేశాలను సందర్శించవచ్చని తెలిపారు. అంతేకాదు, విదేశాల్లో ఉండి కూడా ఉదయం ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ, సాయంత్రం వీడియోలు రూపొందించడం లేదా ట్రావెల్ కంటెంట్ సృష్టించడం సాధ్యమని చెప్పారు. ముఖ్యంగా థాయ్లాండ్, ఇండోనేషియా వంటి దేశాల్లో నెలకు సుమారు రూ.25 వేల ఖర్చుతో జీవించవచ్చని వివరించారు. ఇలా ఉద్యోగం కొనసాగిస్తూ ప్రపంచాన్ని అన్వేషించే అవకాశం ఉందన్నారు.
విదేశాల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం గడపాలనుకునే వారికి వాలంటీర్ ప్రోగ్రామ్లు ఉపయోగపడతాయని అవినాష్ వివరించారు. సాధారణంగా టూరిస్ట్ వీసాపై వెళ్లిన వ్యక్తులు అక్కడ ఉద్యోగం చేయడానికి అనుమతి ఉండదు. అయితే వాలంటీర్ సేవలు అందించేందుకు కొన్ని అవకాశాలు ఉంటాయి. పలు దేశాల్లో హాస్టళ్లు, వ్యవసాయ క్షేత్రాలు, సామాజిక సేవా సంస్థలు వాలంటీర్లను ఆహ్వానిస్తాయి. వీరికి బస, ఆహారం వంటి సౌకర్యాలు కల్పిస్తారు. ఈ విధంగా ఖర్చులను తగ్గించుకుంటూ కొత్త దేశాలను తిరిగే అవకాశం లభిస్తుంది. అలాగే ఖాళీ సమయంలో వీడియోలు రూపొందించి సోషల్ మీడియా లేదా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ద్వారా ఆదాయం కూడా పొందవచ్చని అవినాష్ తెలిపారు.
నా అన్వేషణ అవినాష్ కథ ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతోంది. ప్రపంచాన్ని తిరగడానికి కోట్ల రూపాయలు అవసరం లేదు. సరైన ప్రణాళిక, క్రమశిక్షణ, నిరంతర కృషి ఉంటే చిన్న మొత్తంతో ప్రారంభించి కూడా పెద్ద లక్ష్యాలను సాధించవచ్చు. యూట్యూబ్, ఫ్రీలాన్సింగ్, వాలంటీర్ అవకాశాలను ఉపయోగించుకుంటూ ప్రపంచాన్ని చూసే కలను నిజం చేసుకోవచ్చని ఆయన అనుభవం స్పష్టం చేస్తోంది.