మనిషి శాస్త్రసాంకేతికంగా ఎంగానో ఎదుగుతున్నాడు. ముఖ్యంగా ప్రయాణ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఈ వరుసలో ముందుండే చైనా తాజాగా మరో అద్భుతాన్ని సాకారం చేసింది.
డ్రాగన్ దేశం చైనా మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. హైస్పీడ్ రైలు వ్యవస్థలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న ఈ దేశం.. ఇప్పుడు గంటకు 600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే మాగ్లెవ్ రైలును ప్రతిష్టాత్మకంగా ప్రదర్శించింది. 17వ మోడ్రన్ రైల్వే ఎగ్జిబిషన్లో ఈ సాంకేతిక అద్భుతాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు.
25
7 సెకన్లలో 600 కిలోమీటర్ల వేగం
ఈ మాగ్లెవ్ రైలు కేవలం 7 సెకన్లలోనే అత్యధికంగా గంటకు 600 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది సాధ్యపడటానికి మెగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీ కీలకంగా పనిచేస్తుంది. రైలు ట్రాక్ను తాకకుండా, అయస్కాంత బలంతో లేవడం వల్ల ఘర్షణ లేకుండా అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది. అధికారుల ప్రకారం, బీజింగ్ నుంచి షాంఘై వరకు 1200 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 150 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇప్పటి వరకు అదే దూరం ప్రయాణించాలంటే కనీసం 5.30 గంటలు పడుతుంది.
35
టెక్నాలజీ వెనుక ఉన్న మేథోశక్తి
డోంఘు లాబొరేటరీలో పరిశోధకులు 2025 చివరి నాటికి మాగ్లెవ్ ట్రాక్ నిర్మాణాన్ని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైలు పూర్తి స్థాయిలో ఏఐ ఆధారిత సస్పెన్షన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. విద్యుదయస్కాంత నియంత్రణ వ్యవస్థలతో అసలు ప్రయాణం చేస్తున్నామన్న భావన కూడా కలగకుండా చేస్తుంది. రైలు కొంచం కూడా కుదుపులకు గురవ్వదు.
ఇప్పటికే ఈ మాగ్లెవ్ రైలు ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకెళ్లే రైలు గానూ గుర్తింపు పొందింది. దీని బరువు 1.1 టన్నులు కాగా, గత జూన్లో ఫస్ట్ ట్రయల్ విజయవంతమైంది. ఇప్పుడు ప్రజల ముందు ప్రదర్శనతో మరోసారి చైనా టెక్నాలజీ అగ్రస్థాయిలో ఉందని చాటిచెప్పింది.
55
హైదరాబాద్–తిరుపతి గంటలోనే
ఇలాంటి సూపర్ స్పీడ్ రైలు భారత్లో ప్రవేశిస్తే రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. ఉదాహరణకి, హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు దాదాపు 560 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రస్తుతమున్న సర్వీసుల ద్వారా తక్కువలో తక్కువ 10–12 గంటల సమయం పడుతుంది.
అయితే, మాగ్లెవ్ రైలు వస్తే.. ఈ దూరాన్ని కేవలం 60 నిమిషాల్లో అధిగమించవచ్చు. ప్రస్తుతం భారత్లో తొలి బుల్లెట్ ట్రైన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దీంతో ఈ మాగ్లెవ్ రైలు భారత్లో రావడానికి కనీసం మరో పాతికేళ్లు అయినా పడుతుందనడంలో సందేహం లేదు.