Balochistan : పాకిస్థాన్ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా తయారయ్యింది. భారత్ దెబ్బకు విలవిల్లాడిపోయి కాళ్లబేరానికి వచ్చింది. కేవలం రెండుమూడు రోజులే ఇండియా పాకిస్థాన్ పై దృష్టిపెట్టి చిన్నచిన్న దాడులకు దిగింది... అదే పూర్తిస్థాయిలో యుద్దానికి దిగినే పరిస్థితి ఏమిటో ఆ దేశానికి తెలుసు. అందుకే అమెరికాతో రాయబారం పంపి ఇండియాను శాంతింపచేసింది.. లేదంటే ప్రపంచ పటంలో పాకిస్థాన్ నామరూపాలు లేకుండా పోయేదే.
అయితే ఇండియా విడిచిపెట్టిన పాకిస్థాన్ లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. పాక్ కు పక్కలో బళ్లెంలా తయారయ్యింది బలూచిస్తాన్ వివాదం. ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో ఇదే మంచి అదునుగా బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ కూడా రెచ్చిపోయింది. తమ ప్రాంతాన్ని పాకిస్థాన్ నుండి వేరుచేయాలని పోరాడుతున్న ఈ బిఎల్ఏ పాక్ ఆర్మీని తమ ప్రాంతంనుండి తరిమికొట్టింది. అంతేకాదు స్వాతంత్య్రాన్ని కూడా ప్రకటించుకుని ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితితో పాటు భారత్ ను కూడా కోరారు.
ఇలా భారత్ నుండి తప్పించుకున్నామని ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా పాకిస్థాన్ కు ఇవ్వడంలేదు బలూచిస్థాన్. పొరుగుదేశం జాలి చూపినా సొంత దేశంలోనే పాక్ కు తీవ్ర వ్యతిరేకత వస్తోంది. బలూచిస్తాన్ వివాదం పాక్ కొంపలో కుంపటిలా మారింది. ఈ క్రమంలో పాకిస్థాన్ తో అలుపెరగని పోరాటం చేస్తున్న బలూచిస్థాన్ గురించి తెలుసుకుందాం.
ఏమిటీ బలూచిస్థాన్ ఉద్యమం :
పాకిస్థాన్ అనేది నాలుగు ప్రావిన్స్ కలిగిన దేశం. పంజాబ్, సింధ్, ఖైబర్ పఖ్తుంఖ్వా మరియు బలూచిస్థాన్. ఇందులో అతిపెద్దది ఈ బలూచిస్థాన్. విస్తీర్ణంలో అతిపెద్దది మాత్రమే కాదు ప్రకృతివనరుల పరంగా అతి సంపన్నమైనది కూడా. ఇలా పాక్ లోనే సుసంపన్నమైన ఈ ప్రాంతం అభివృద్ధిలో మాత్రం అత్యంత వెనుకబడిపోయింది. ఇక్కడి వనరులను వాడుకుంటున్న పాక్ పాలకులు ఈ ప్రాంత ప్రజలను పట్టించుకోవడంలేదు. దీంతో ఇక్కడి ప్రజల్లో తిరుగుబాటు మొదలయ్యింది.... గత కొన్ని దశాబ్దాలుగా ఇది స్వాతంత్య్ర పోరాటానికి, విప్లవాలకు కేంద్రంగా మారింది.
బలూచ్ జాతీయవాద గ్రూపులు పాకిస్థాన్కు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమాలు చేపడుతూ వస్తున్నారు. వీరు స్వయం పాలన (Autonomy) నుండి పూర్తిస్థాయి స్వాతంత్య్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. కానీ వీరి ఉద్యమాన్ని పాక్ సైనికచర్యతో అణచివేయడంతో ఇది ప్రత్యక్ష పోరాటానికి దారితీసింది. ఈ క్రమంలోనే 2000 లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏర్పాటయ్యింది...గత 25 ఏళ్లుగా ఇది బలూచ్ విముక్తి కోసం పోరాడుతోంది.
బలూచిస్థాన్ చరిత్ర :
1947లో భారత విభజన తర్వాత పాకిస్థాన్ ఏర్పడింది. ఈ సమయంలో ఆధునిక బలూచిస్తాన్ కేంద్రంగా ఉన్న 'ఖలాత్ రాజ్యం' ఒక స్వతంత్ర సంస్థగా ఉండేది. ఆ రాజ్యంలో ఖాన్ అనే రాజు పాలన సాగించేవారు. దేశ విభజన సమయంలో ఖాన్ ఆ రాజ్యాన్ని పాకిస్థాన్లో విలీనం చేయడాన్ని తిరస్కరించాడు. కానీ 1948లో పాకిస్థాన్ సైనిక ఒత్తిడితో ఖలాత్ రాజ్యం బలవంతంగా పాకిస్థాన్లో విలీనమైంది. బలూచ్ జాతీయవాదుల దృష్టిలో ఇది బలవంతపు ఆక్రమణగా, వారి స్వేచ్ఛను హరించిన ఘట్టంగా నిలిచింది.
ఆ తరువాత 1948, 1958, 1962, 1973లలో బలూచిస్తాన్లో ఉన్నత స్థాయి తిరుగుబాట్లు జరిగాయి. ప్రస్తుతం 2004 నుండి కొనసాగుతున్న బలూచ్ తిరుగుబాటు మరింత తీవ్రరూపం దాల్చింది.
ఈ తిరుగుబాట్లకు ప్రధాన కారణాలు... బలూచిస్తాన్లో ఉత్పత్తి అవుతున్న వనరులపై స్థానికులకు అధికారం లేకపోవడం, అభివృద్ధికి దూరంగా ఉంచడం, పాకిస్థాన్ సైనిక దళాల కఠినమైన చర్యలు, స్థానిక బలూచ్ జాతి సంస్కృతి, భాషను అణచివేయడం.
ఈ పరిణామాల వల్ల బలూచిస్తాన్లో జాతీయవాద భావాలు పెరిగాయి. అనేక గ్రూపులు ఇప్పటికీ స్వాతంత్య్ర డిమాండ్ చేస్తూ పోరాటం కొనసాగిస్తున్నాయి. దీంతో పాకిస్థాన్కు ఇది శాంతి భద్రతల పరంగా అతిపెద్ద సవాలుగా మారింది.
బలూచిస్తాన్ ప్రకృతి వనరులు :
బలూచిస్తాన్ పాకిస్థాన్లో అతిపెద్ద ప్రావిన్స్ మాత్రమే కాదు ప్రకృతి వనరులతో నిండిన ప్రాంతం. సహజ వాయువు, బొగ్గు, బంగారం వంటి ఖనిజాలతో ఈ ప్రాంతం ఎంతో సమృద్ధిగా ఉన్నాయి. ఇలా సమృద్ధిగా ఉన్నా దేశంలోనే అత్యంత పేద రాష్ట్రంగా బలూచిస్తాన్ నిలవడం విస్మయానికి గురి చేస్తోంది.
స్థానికుల అభిప్రాయం ప్రకారం... తమ వనరులు పాక్లోని ఇతర రాష్ట్రాలకు ముఖ్యంగా పంజాబ్కు తరలిస్తున్నారు. ఇక్కడి సంపదను దోచుకుంటున్నారు...అందుకే బలూచ్ లో అభివృద్ధి కనిపించదు. వారు ఇంకా విద్య, ఆరోగ్యం, ఇంధనం వంటి ప్రాథమిక అవసరాలకే నిత్యం పోరాడాల్సి వస్తోంది.
ఉదాహరణకు 1952లో కనుగొనబడిన సూపై గ్యాస్ ఫీల్డ్ పాకిస్థాన్కు పెద్దఎత్తున శక్తి అందించిందని చరిత్ర చెబుతోంది. కానీ ఇప్పటికీ బలూచిస్తాన్లోని అనేక ప్రాంతాలు గ్యాస్, విద్యుత్ వంటి అవసరాలకే నోచుకోవడం లేదు.
చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (CPEC) వంటి ప్రాజెక్టులు, గ్వాడార్ పోర్ట్ అభివృద్ధి వలన బహుళ బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఈ ప్రాంతానికి వచ్చాయి. కానీ స్థానికులకు అందిన మేలు మాత్రం చాలా తక్కువగా ఉంది. అనేక సందర్భాల్లో ప్రజలు భూములను కోల్పోవాల్సి వచ్చింది... కానీ వీరికి సరైన నష్ట పరిహారం అందలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ అసంతుల అభివృద్ధి విధానం పట్ల బలూచ్ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. వనరుల నుండి వచ్చే లాభాలను స్థానికులకు అందజేయకుండా, ఇతర రాష్ట్రాల అభివృద్ధికి వాడుకోవడం వల్లే బలూచిస్తాన్ వృద్ధి చెందక పేదరికంలో చిక్కుకుపోయిందని వారు చెబుతున్నారు.ఈ విధంగా వనరుల సమృద్ధి ఉన్నా, అభివృద్ధిలో వెనుకబడిన బలూచిస్తాన్ సమస్య పాకిస్థాన్కు రాజకీయంగానూ, ఆర్థికంగానూ పెను సవాలుగా మారుతోంది.
బలూచిస్థాన్ రాజకీయ వివక్ష :
పాకిస్థాన్లోని బలూచిస్తాన్ రాష్ట్రానికి సంబంధించి రాజకీయ, మానవహక్కుల పరంగా తీవ్ర మోసం జరుగుతున్నట్లు బలూచ్ నాయకులు ఆరోపిస్తున్నారు. సమర్థవంతమైన ప్రతినిధులకు కూడా అవకాశాలు లేకుండా ఉండటం, నిరంతర సైనిక జోక్యాలు ప్రజల్లో కేంద్ర ప్రభుత్వంపై నమ్మకాన్ని తగ్గించాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్థానిక నాయకుల అభిప్రాయం ప్రకారం... ఇస్లామాబాద్ ప్రభుత్వం ఎన్నికలలో జోక్యం చేసుకుని ప్రజల మద్దతు లేని నాయకులను అధికారం లోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఈ విధంగా బలూచ్ ప్రజల వాస్తవ ప్రతినిధిత్వం క్రమంగా తగ్గిపోతోంది. గతంలో రాష్ట్ర అసెంబ్లీలను రద్దు చేయడం, సైనిక జోక్యంతో ప్రభుత్వాలను కూల్చడం ప్రజాస్వామ్య వ్యవస్థపై భరోసా తగ్గించే చర్యలుగా భావిస్తున్నారు.
ఇంతకే మించి బలూచిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘనలు తీవ్ర స్థాయికి చేరుకున్నట్లు అనేక అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ప్రత్యేకించి పాకిస్థాన్ భద్రతా బలగాల చేత వేలాది మంది విద్యార్థులు, కార్యకర్తలు, పాత్రికేయులు బలవంతపు అదుపులోకి తీసుకోవడం, అదృశ్యమవడం లేదా మృతదేహాలుగా కనిపించడం గణనీయంగా పెరిగిందని స్థానిక నివేదికలు వెల్లడిస్తున్నాయి.
హ్యూమన్ రైట్స్ వాచ్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు “కిల్ అండ్ డంప్” విధానంపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ విధానంలో ప్రజలను కిడ్నాప్ చేసి, కొంతకాలానికి చనిపోయిన స్థితిలో కనిపించేవారు. “మిస్సింగ్ పర్సన్స్” అనే పదం బలూచిస్తాన్ ప్రజల జీవితం లో ఒక కలకలం కలిగించే సర్వసాధారణమైన అంశంగా మారింది.
ఈ విధంగా బలూచిస్తాన్లో రాజకీయ హక్కుల క్షీణత, మానవహక్కుల ఉల్లంఘనలు పాకిస్థాన్ అంతర్గత వ్యవస్థపై అంతర్జాతీయంగా తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించకుండా, అభ్యుదయ మార్గాలను నిరోధించడం వలన విభజన డిమాండ్ మరింత పెరిగింది.
సంస్కృతి, సాంప్రదాయాల అణచివేత :
పాకిస్థాన్లో బలూచ్ ప్రజల భాష, సంస్కృతి, చరిత్ర ప్రత్యేకత కలిగినవే అయినప్పటికీ పాక్ ప్రభుత్వ విధానాల వల్ల ఇవి ప్రమాదంలో ఉన్నాయి. ఈ ప్రజలపై పంజాబీ, ఉర్దూ భాషల ఆధిపత్యం కొనసాగుతోంది. పాకిస్థానీ జాతీయతను తమపై రుద్దే ప్రయత్నాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
బలూచ్ భాషను దూరం చేయడం... వారి చరిత్రను తిరగరాయడం... సంస్కృతిని విచ్చిన్నం చేయడం వంటి చర్యలు యువతలో మరింత అసహనాన్ని పెంచుతున్నాయని స్థానికుల భావన. ఇటువంటి అనుభవాల కారణంగా పాకిస్థాన్ ప్రభుత్వంపై విశ్వాసం దెబ్బతిన్నదని అంటున్నారు.
ఈ నేపథ్యంతో బలూచ్ స్వాతంత్ర్య ఉద్యమం ఇప్పటికీ కొనసాగుతోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA), బలూచ్ రిపబ్లికన్ ఆర్మీ (BRA) వంటి గ్రూపులు అప్పుడప్పుడు పాకిస్థాన్ మిలిటరీ మరియు వసతులపై దాడులు నిర్వహిస్తున్నాయి. ఈ ఉద్యమం శక్తివంతంగా లేకపోయినా, స్థానిక స్థాయిలో నిరసనలు, తిరుగుబాట్లు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇక రహస్య జీవితం గడుపుతున్న నేతలు మెహ్రాన్ మర్రీ, బ్రహ్మదాఘ్ బుగ్టి లాంటి వారు అంతర్జాతీయ వేదికలపై బలూచ్ స్వాతంత్ర్య అభిలాషకు మద్దతు కోరుతున్నారు. అయితే ఈ ఉద్యమానికి ఐక్య నాయకత్వం లేకపోవడం ఇంతకాలం నత్తనడకన సాగింది. అయితే ఇటీవల కాలంలో స్పీడ్ పెంచిన బలూచ్ ఉద్యమకారులు పాక్ తో గట్టిగానే పోరాడుతున్నారు. చివరకు పాకిస్థాన్ నుండి స్వాతంత్య్రం పొందినట్లు ప్రకటించారు. ఇలా బలూచిస్తాన్ వివాదం పాక్ అంతర్గత సవాల్గా మారింది.