
RO టెక్నాలజీ నీటిని ఒక ప్రత్యేకమైన మెంబ్రేన్ ద్వారా ఒత్తిడి చేసి పంపిస్తుంది. ఈ ప్రక్రియలో నీటిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్లు, ఉప్పులు, భారీ లోహాలు, ఇతర హానికర పదార్థాలు తొలగిపోతాయి. ఈ విధానం ముఖ్యంగా భూగర్భ జలాల్లో కలుషితాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ శుద్ధి ప్రక్రియ చాలా తీవ్రంగా ఉండటంతో కొన్నిసార్లు సహజంగా నీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా కొంత తగ్గే అవకాశం ఉంటుంది. దీనివల్లే RO నీరు ఆరోగ్యానికి మంచిది కాదనే వాదనకు బలం చేకూరుస్తోంది.
RO నీటిలో ఖనిజాలు తగ్గితే మనం తీసుకునే ఆహారం వాటిని భర్తీ చేస్తుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. క్లినికల్ న్యూట్రిషనిస్ట్ పలక్ నాగ్పాల్ తెలిపిన వివరాల ప్రకారం, మన శరీరానికి అవసరమైన ఖనిజాలలో చాలా కొద్ది శాతం మాత్రమే తాగునీటి ద్వారా లభిస్తుంది. ఎక్కువ భాగం మనం తినే ఆహారం నుంచే వస్తుంది. ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకుంటే RO నీటిలో ఖనిజాలు కొంచెం తగ్గినా శరీరానికి పెద్దగా సమస్య ఉండదు. అంటే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ప్రధానంగా ఆహార ద్వారానే లభిస్తాయి.
మన రోజువారీ ఆహారంలో కొన్ని పదార్థాలు తీసుకుంటే అవసరమైన ఖనిజాలు సులభంగా అందుతాయి.
* కాల్షియం: పాలు, పెరుగు, పన్నీర్, రాగి, నువ్వులు, బాదం, ఆకుకూరలు. ఇది ఎముకలు, పళ్ల బలానికి అవసరం.
* మెగ్నీషియం: గింజలు, కాజూ, బాదం, గుమ్మడి విత్తనాలు, ఓట్స్, బ్రౌన్ రైస్, పప్పులు. ఇది కండరాలు, నరాల పనితీరుకు ఉపయోగపడుతుంది.
* పొటాషియం: అరటి, కొబ్బరి నీరు, చిలగడదుంప, పప్పులు, బీన్స్, ఆకుకూరలు. ఇది గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణకు ముఖ్యమైనది.
ఈ ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి కావాల్సిన ఖనిజాలు సరిపడా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కిడ్నీ నిపుణుల అభిప్రాయం ప్రకారం RO నీరు సాధారణంగా కిడ్నీలకు హానికరం కాదు. నోయిడాలోని కైలాష్ ఆస్పత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అనీష్ నందా మాట్లాడుతూ.. RO వ్యవస్థ అనేది శుద్ధి నీటిలో ఉన్న హానికర పదార్థాలను తొలగించడానికి రూపొందించింది. కొన్ని ఖనిజాలు తగ్గినా అవి ఎక్కువగా ఆహారం ద్వారానే శరీరానికి అందుతాయి. కాబట్టి సరిపడా నీరు తాగడం, మంచి ఆహారం తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ద్వారా కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
కొంతమంది RO నీరు ఎక్కువకాలం తాగితే శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతింటుందని భయపడతారు. అయితే డాక్టర్లు చెబుతున్నదేమిటంటే, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల్లో అలాంటి ప్రమాదం చాలా తక్కువ. మన శరీరంలో కిడ్నీలు, హార్మోన్లు కలిసి ఎలక్ట్రోలైట్ స్థాయిని నియంత్రిస్తాయి. సోడియం, పొటాషియం, కాల్షియం వంటి ఎలక్ట్రోలైట్లు కూడా ఎక్కువగా ఆహారం ద్వారానే లభిస్తాయి. అందువల్ల శుద్ధి చేసిన RO నీరు తాగడం వల్ల సాధారణంగా ఎలాంటి పెద్ద సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు.
మొత్తం మీద RO నీరు ఖనిజాలను పూర్తిగా తొలగించి ఆరోగ్యానికి హానికరమవుతుందనే భావన పూర్తిగా సరైనది కాదు. నిజానికి మన శరీరానికి అవసరమైన ఎక్కువ ఖనిజాలు ఆహారం ద్వారానే వస్తాయి. పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పాలు, గింజలు, పప్పులు వంటి సమతుల్య ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అందుకే శుద్ధి చేసిన సురక్షితమైన నీరు తాగడం, మంచి ఆహారం తీసుకోవడం, శరీరానికి తగినంత నీరు అందించడం ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.