Education In Jail: జైలు గోడల మధ్యే కాలేజీ చదువులు.. ఖైదీలకు ఇలాంటి ఛాన్స్ ఉందా? ఈ రూల్స్ తెలిస్తే షాకవుతారు

Published : Aug 30, 2026, 12:11 PM IST

Education In Jail: భారత్‌లో ఖైదీలు జైల్లో ఉంటూనే ఓపెన్ వర్సిటీల ద్వారా డిగ్రీలు, పీజీలు చదువుకోవచ్చు. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు పునరావాసం, నేర మనస్తత్వాన్ని మార్చే దిశగా ఉన్నత విద్యను అభ్యసించే హక్కును ప్రభుత్వం కల్పించింది.

PREV
15
జైలు గోడల మధ్య డిగ్రీలు: భారత్‌లో ఖైదీల ఉన్నత చదువుల రూల్స్ ఇవే

భారతదేశంలో జైలులో కూడా చదువుకోవచ్చని మీకు తెలుసా? మన దేశంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు జైలు గోడల మధ్య నుంచే తమ ఉన్నత చదువులను కొనసాగించడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న అనేక జైళ్లలో ఖైదీలు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా, ఇతర ఉన్నత విద్యా కోర్సులు పూర్తి చేయడానికి స్పష్టమైన విభాగాలు ఉన్నాయి.

ఖైదీల పునరావాసం, వారిలో సానుకూల మార్పు తీసుకురావడమే దీని ప్రధాన ఉద్దేశం. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూపొందించిన మోడల్ ప్రిజన్ మ్యాన్యువల్ ప్రకారం, విద్యా కార్యక్రమాలు ఖైదీలలో సామాజిక మార్పును, ఆత్మపరిశీలనను ప్రోత్సహించాలి. జైలులో వివిధ స్థాయిల విద్యను అందించడంతో పాటు, విడుదలైన తర్వాత కూడా వారు తమ చదువును బయట కొనసాగించేలా రాష్ట్ర విద్యా వ్యవస్థలతో అనుసంధానించాలని ఈ నిబంధనలు సూచిస్తున్నాయి.

25
దూరవిద్య ద్వారా పట్టాలు

జైలులో ఉండే ఖైదీలు రెగ్యులర్ కాలేజీ విద్యార్థుల్లా బయటకు వచ్చి చదువుకోవడం కుదరదు. కాబట్టి ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ పద్ధతిని వీరికి ప్రధాన మార్గంగా మార్చారు. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU), నేషనల్ ఇన్సిస్టట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) వంటి ప్రముఖ సంస్థలు ఖైదీలకు విద్యా అవకాశాలను కల్పిస్తున్నాయి. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU), యశ్వంతరావు చవాన్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ వంటి రాష్ట్ర స్థాయి వర్సిటీలు కూడా కోర్సులను అందిస్తున్నాయి.

ఢిల్లీలోని తీహార్ జైలులో ఖైదీల కోసం ప్రత్యేకంగా ఇగ్నూ స్టడీ సెంటర్లు ఉన్నాయి. ఖైదీలు పొందే సర్టిఫికేట్లు లేదా డిగ్రీలపై ఎక్కడా పరీక్ష రాసిన ప్రదేశంగా జైలు పేరును ముద్రించరు. ఇతర రాష్ట్రాలు కూడా ఇదే రకమైన సదుపాయాలను అందిస్తున్నాయి. రాజస్థాన్ జైళ్ల శాఖ కూడా డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా ఖైదీలు బ్యాచిలర్ డిగ్రీలు, పీజీ కోర్సులు చదివేందుకు తగిన ఏర్పాట్లు చేసింది. 2026లో తెలంగాణలో 78 మంది ఖైదీలు ఎన్ఐఓఎస్ ద్వారా పదో తరగతి ఉత్తీర్ణులయ్యారు. వీరు తదుపరి చదువులు కొనసాగించేలా చెర్లపల్లి సెంట్రల్ జైలులోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెంటర్ ద్వారా ఏర్పాట్లు చేశారు.

35
బయట కాలేజీలకు వెళ్లే అవకాశం ఉందా?

ఖైదీలు రోజూ జైలు నుంచి బయటకు వచ్చి సాధారణ కాలేజీ తరగతులకు హాజరుకావడం చాలా క్లిష్టమైన విషయం. ఖైదీల కదలికలు పూర్తిగా జైలు భద్రతా నియమాలు, చట్టాలకు లోబడి ఉంటాయి. సాధారణంగా రెగ్యులర్ క్లాసులకు బయటకు వెళ్లడానికి అనుమతి ఉండదు.

అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాలలో తాత్కాలిక విడుదల లేదా పేరోల్ ఇచ్చే నిబంధనలు కొన్ని రాష్ట్రాలలో ఉన్నాయి. 2026లో కేరళ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పులో, డిగ్రీ కోర్సు పూర్తి చేయడానికి చట్టపరమైన అర్హతలను బట్టి ఖైదీలకు తాత్కాలిక విడుదల కల్పించే అవకాశాలను ప్రస్తావించింది. కానీ, ప్రాక్టికల్ లేదా ల్యాబ్ వర్క్ ఉండే కోర్సులకు ఖైదీలకు సాధారణంగా అనుమతి లభించదు. అందుకే వారు ఎక్కువగా థియరీ కోర్సులైన బి.ఏ, బి.కామ్, ఎం.ఏ (సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, జర్నలిజం), ఎంబీఏ, హ్యూమన్ రైట్స్ డిప్లొమాలనే ఎంచుకుంటారు.

45
ఫీజుల చెల్లింపులు, జైలు లోపల పరీక్షలు

ఖైదీల విద్యకు సంబంధించిన ఫీజుల విషయం రాష్ట్రాలను బట్టి మారుతుంది. అనేక జైలు నిర్వహణ వ్యవస్థల్లో ప్రభుత్వాలే ఖైదీల విద్యా ఖర్చులను భరిస్తాయి. ఉదాహరణకు, తీహార్ జైలులో ఇగ్నూ, ఎన్ఐఓఎస్ కోర్సుల ఫీజులను ప్రభుత్వమే భరిస్తుంది. ఉచితంగా పుస్తకాలు, నోట్‌బుక్స్, పెన్నులు అందిస్తారు. చండీగఢ్ మోడల్ జైలులో కూడా ఉచిత విద్యతో పాటు పీజీ, డిగ్రీ కోర్సులను ఇగ్నూ ద్వారా అందిస్తున్నారు.

హోం మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో ఇగ్నూ ఖైదీలకు రిజిస్ట్రేషన్, అడ్మిషన్, ఎగ్జామ్ ఫీజులను పూర్తిగా మినహాయించింది. జైలు లోపలే ఇగ్నూ జ్ఞాన్ గంగ వంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తుంది. కోర్సు మెటీరియల్ నేరుగా జైలు లైబ్రరీలకు చేరుతుంది. జైలు ప్రాంగణాన్నే అధికారిక పరీక్షా కేంద్రంగా మార్చి, కఠిన భద్రతల నడుమ టర్మ్ ఎండ్ పరీక్షలు నిర్వహిస్తారు. బాగా చదువుకున్న తోటి ఖైదీలు లేదా బయట కాలేజీల నుంచి వచ్చే గెస్ట్ లెక్చరర్లు ఖైదీలకు పాఠాలు చెప్తారు.

55
పరిమితులు, పునరావాస ప్రయోజనాలు

ఖైదీలందరికీ అన్ని కోర్సుల్లో ప్రవేశం లభిస్తుందనే గ్యారెంటీ దేశవ్యాప్తంగా లేదు. జైళ్ల నిర్వహణ అనేది రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని అంశం కావడంతో కోర్సుల లభ్యత, అనుమతులు జైలును బట్టి మారతాయి. ఖైదీ ప్రవర్తన, భద్రతా వర్గీకరణ, జైలు మౌలిక వసతులు వారు చదువుకోవడానికి ప్రధాన ప్రాతిపదికగా ఉంటాయి. తీవ్ర నేరారోపణలు ఉన్న విచారణ ఖైదీలకు ఇవి పరిమితంగా ఉంటుంది.

శిక్ష అనుభవిస్తున్న కాలంలో డిగ్రీ పూర్తి చేయడం వల్ల ఖైదీలకు శిక్షా కాలం తగ్గడం లేదా పేరోల్ లభించడంలో సానుకూలత లభిస్తుంది. తీహార్ జైలు, అహ్మదాబాద్ సెంట్రల్ జైలు వంటి చోట్ల శిక్ష ముగింపునకు వచ్చిన విద్యావంతులైన ఖైదీలకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కూడా నిర్వహిస్తున్నారు. దీనివల్ల విడుదలయ్యాక వారు నేరాల బాట పట్టకుండా, గౌరవప్రదంగా జీవించడానికి తగిన నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories