Nepal Disaster: 30 ఏళ్లలో 1500 సార్లు వరదలు.. నేపాల్‌ను ప్రకృతి ఎందుకు టార్గెట్ చేస్తోంది?

Published : Aug 30, 2026, 09:56 AM IST

Nepal Disaster: నేపాల్ లో వరదల కారణంగా ఇప్పటికే వందల మంది చనిపోయారు. వేల మంది గల్లంతయ్యారు. అంచనా వేయలేనంతగా ఆస్తినష్టం జరిగింది. అయితే, నేపాల్‌లో ఇలా పదే పదే వరదలు, కొండచరియల విధ్వంసానికి అసలు కారణాలేంటి? గత 30 ఏళ్ల డేటా ఏం చెబుతోంది?

PREV
15
ప్రకృతి తప్పిదమా లేక మానవ తప్పిదమా? నేపాల్‌లో వరదలు ఎందుకు వస్తూనే ఉన్నాయి?

హిమాలయ పర్వత ప్రాంతమైన నేపాల్‌లో మరోసారి భారీ జలప్రళయం ముంచెత్తింది. చైనా-టిబెట్ సరిహద్దును ఆనుకుని ఉన్న ఉత్తర నేపాల్‌ ప్రాంతంలో సంభవించిన ఘోర ప్లాష్ ఫ్లడ్స్ తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. ఈ విధ్వంసంలో ఇప్పటివరకు సుమారు 675 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 3 వేల మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 288 మంది భారతీయులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

25
గత 30 ఏళ్లలో 1,500కు పైగా ప్రళయాలు

నేపాల్‌లో ఇలాంటి విపత్తులు రావడం ఇదే మొదటిసారి ఏమీ కాదు. గత 30 ఏళ్ల గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దాదాపు 1,500కు పైగా భారీ వరద సంఘటనలు ఇక్కడ నమోదయ్యాయి. ఈ వరదల కారణంగా ఇప్పటివరకు 4,200 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. నిమిషాల్లో ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయేంత స్థాయిలో ఇక్కడ ప్రళయం ఎందుకు వస్తోంది? పదే పదే కొండచరియలు విరిగిపడటానికి, వరదలు రాడానికి అసలు కారణాలు ఏంటి? ఈ అంశాలు గమనిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

35
కఠినమైన భౌగోళిక నిర్మాణం.. క్లౌడ్ బరస్ట్‌లు

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హిమాలయ పర్వత శ్రేణుల్లో నేపాల్ ఉంది. ఇవి భౌగోళికంగా చాలా లేత పర్వతాలు (యంగ్ మౌంటేన్స్). అందుకే ఇక్కడి నేల, రాళ్ల అమరిక చాలా లూజ్‌గా ఉంటుంది. వాలు ఎక్కువగా ఉండటం వల్ల చిన్నపాటి వర్షం పడినా నేల సులభంగా జారిపోయి కొండచరియలు విరిగిపడతాయి. దీనికి తోడు దక్షిణాసియా మాన్సూన్ ఈ కొండలను తాకినప్పుడు తక్కువ సమయంలో భారీ వర్షాలు పడతాయి. ఇటీవల క్లౌడ్ బరస్ట్‌లు పెరగడంతో నదులు ఒక్కసారిగా ఉప్పొంగి ప్రళయాన్ని సృష్టిస్తున్నాయి.

45
కరిగిపోతున్న మంచు కొండలు, గ్లేషియర్ ప్రళయం

గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమాలయాల్లోని మంచు నదులు వేగంగా కరిగిపోతున్నాయి. దీనివల్ల మంచు కొండల కింద పెద్ద పెద్ద సరస్సులు ఏర్పడుతున్నాయి. నీటి ఒత్తిడి ఎక్కువై ఈ సరస్సుల గట్లు తెగిపోయినప్పుడు 'గ్లేషియల్ లేక్ అవుట్‌బర్స్ట్ ఫ్లడ్' (GLOF) ఏర్పడుతుంది. ఈ నీరు ఒక్కసారిగా కింద ఉన్న గ్రామాలపై విరుచుకుపడుతుంది. నేపాల్‌లోని ప్రధాన నదులైన కోషి, గండక్, కర్నాలి ఒకేసారి ఉప్పొంగడం, ప్రవాహానికి కొండచరియల మట్టి అడ్డుపడటంతో ఈ ప్రమాద తీవ్రత రెట్టింపు అవుతోంది.

55
భూకంపాల ప్రభావం.. మానవ తప్పిదాలు

నేపాల్ అత్యంత ప్రమాదకరమైన సిస్మిక్ అంటే భూకంప జోన్‌లో ఉంది. 2015లో వచ్చిన భీకర భూకంపంతో పాటు ఇక్కడ పదే పదే వచ్చే ప్రకంపనలు పర్వతాల లోపలి నిర్మాణాన్ని బాగా బలహీనపరిచాయి. మరోవైపు నేపాల్‌లో 80 శాతానికి పైగా పర్వత ప్రాంతాలే ఉంటాయి. రోడ్లు, జలవిద్యుత్ ప్రాజెక్టులు, భవనాల నిర్మాణం కోసం విపరీతంగా అడవులను నరికివేస్తున్నారు. చెట్లు లేకపోవడంతో మట్టి పట్టు కోల్పోయి, వర్షపు నీరు నేరుగా నదుల్లోకి చేరి ఆకస్మిక వరదలకు దారితీస్తోంది. ప్రకృతి కోపానికి మానవ తప్పిదాలు తోడవడమే ఈ వరుస ప్రళయాలకు మరో కారణంగా ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories