
జైలు జీవితం అంటే శిక్ష... తప్పు చేసినవారిని శిక్షించేందుకు జైల్లో పెడతారు. అందుకే జైలు పేరు వింటేచాలు చాలామంది బయపడుతుంటారు. అయితే జైలు అనేది జీవితంలో చాలా పాఠాలను నేర్పిస్తుందని... మరిచిపోలేని అనుభవాలను ఇస్తుందని చాలామంది చెబుతుంటారు. కఠిన నిబంధనలు, కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉండటం, సమాజంలో పరువు పోవడం వంటివి పక్కనబెడితే జైలు క్రమశిక్షణగా ఎలా జీవించాలో నేర్పిస్తుందని వెళ్లివచ్చినవాళ్లు చెబుతారు. ముఖ్యంగా మనం బైట ఉన్నప్పుడు సమయపాలన అస్సలు పాటించం... కానీ జైల్లో మాత్రం కచ్చితంగా ప్రతిదానికి ఓ టైమ్ ఉంటుంది, దాన్ని తప్పకుండా పాటించాల్సిందే.
ఇక ఫుడ్ విషయంలో జైలులో ఉన్నంత డైట్ ప్లాన్ ఎక్కడా ఉండదని చాలామంది చెబుతుంటారు. టైమ్ టు టైమ్ ఓ మనిషికి సరిపోయే పోషకాలతో అహారం లభించేది జైల్లో మాత్రమే. మరి ఉదయం నుండి రాత్రి వరకు జైల్లోని ఖైదీల ఫుడ్ టైమింగ్స్ ఏంటి? ఎలాంటి ఫుడ్ అందిస్తారు? అనేది ఇక్కడి తెలుసుకుందాం.
ఇండియాలో జైళ్ళ నిర్వహణ అనేది ఆయా రాష్ట్రాల పరిధిలోని అంశం. కాబట్టి ఒక్కో రాష్ట్రంలో జైలు నిబంధనలు ఒక్కోలా ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాలు (ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ) లోని జైళ్ల నిబంధనలు ఎలా ఉంటాయో చూద్దాం.
ఉదయం సూర్యోదయానికి ముందే ఖైదీలందరు నిద్ర లేస్తారు. కాలకృత్యాలు తీర్చుకుని బ్రష్ చేయగానే టీ రెడీగా ఉంటుంది. ఇలా ఉదయం 6 గంటలకే ఖైదీలకు టీ ఇస్తారు... డాక్టర్ల సూచన లేదా కోర్డు అనుమతితో కొందరు ఖైదీలకు పాలు కూడా అందిస్తారు. టీతో పాటు బ్రెడ్ కూడా అందిస్తారు.
ఇక 7 నుండి 7.30 గంటలోపే ఖైదీలకు బ్రేక్ ఫాస్ట్ అందిస్తారు. తర్వాత 11 నుండి 11.45 గంటలకు భోజనం ఉంటుంది. మధ్యలో 12. నుండి 1 గంట మధ్య మళ్లీ టీ బ్రేక్ ఉంటుంది. సాయంత్రం 5 నుండి 5.45 లోపు అందరు ఖైదీల డిన్నర్ పూర్తవుతుంది. అంటే ఖైదీలు పడుకునేలోపే తిన్నది అరిగిపోతుంది. ఇలా పర్పెక్ట్ టైమింగ్ తో ఖైదీలకు భోజనం అందుతుంది.
జైల్లో ఖైదీలకు ఉదయం టీ అందిస్తారు.. తర్వాత అల్పాహారం ఉంటుంది… ఇందులో చపాతి, ఇడ్లి, ఉప్మా వంటి టిఫిన్స్ అందిస్తారు. కొన్ని జైళ్లలో పులిహోర కూడా పెడతారు. ఇలా ఉదయమే టైమ్ కి టీ, టిఫిన్ తినేస్తారు ఖైదీలు.
మధ్యాహ్నం భోజనంలో అన్నం, పప్పు, సాంబార్ లేదా చారు ఉంటుంది. వీటితోపాటు రోజుకో రకమైన కూర పెడతారు. పప్పు కూడా ఒక్కోరోజు ఒక్కోలా ఉంటుంది... కంది, శనగ, మినపపప్పు మార్చిమార్చి పెడతారు. కొన్ని జైళ్ళలో చపాతి కూడా పెడతారు. ఇక ఆదివారం చికెన్, మటన్... బుధవారం కోడిగుడ్డు పెడతారు. కోర్డు అనుమతితో ఇంటి నుండి కూడా భోజనం తెచ్చుకోవచ్చు.
లంచ్, డిన్నర్ మధ్యలో మరో టీ బ్రేక్ ఉంటుంది. ఇక రాత్రి భోజనంలో అన్నం, రసం లేదా సాంబార్ ఉంటుంది. సాయంత్రం 5 నుండి 5.45 లోపు అందరు ఖైదీలు డిన్నర్ పూర్తిచేస్తారు. అనారోగ్యంతో ఉన్నవారికి ప్రత్యేక డైట్ ఉంటుంది... స్పెషల్ ఫుడ్ అందిస్తారు.
జైల్లోని ఖైదీలకు కొన్ని పండగలకు ప్రత్యేకంగా స్వీట్స్ అందిస్తారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సమయంలోనూ స్వీట్స్ ఇస్తారు. ఇక బ్రెడ్, పండ్లు వంటివాటిని అనుమతిస్తారు. కొన్ని సెంట్రల్ జైళ్ళలో సూపర్ మార్కెట్స్ ఉంటాయి... ఇక్కడ అహార పదార్థాలు కొనుక్కుని తినే వెసులుబాటు ఉంటుంది.
భారత రాజ్యాంగం ప్రకారం ఆహారం అనేది ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కు. జైళ్లలో ఉన్న ఖైదీల విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. 2016 మోడల్ ప్రిజన్ మాన్యువల్ ప్రకారం ఖైదీలకు పోషక విలువలతో కూడిన, పరిశుభ్రమైన ఆహారం అందించాలి. రోజుకు కనీసం 2400 క్యాలరీల ఆహారం లభించేలా చూడాలని నిబంధనలు ఉన్నాయి. అయితే ఈ నిబంధనలు చాలా జైళ్లలో పాటించడం లేదు… అనేక సందర్భాల్లో, ఆహార పదార్థాల కొనుగోలులో అవకతవకలు జరుగుతున్నాయని, దీనివల్ల నాణ్యత దెబ్బతింటుందని మానవ హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
నిబంధనలు ఉన్నప్పటికీ అనేక జైళ్లలో ఖైదీలకు లభించే ఆహారం నాణ్యత, పరిశుభ్రత చాలా దారుణంగా ఉంటుంది. బడ్జెట్ కేటాయింపులు తక్కువగా ఉండటం, ఆహార పదార్థాల కొనుగోలులో పారదర్శకత లేకపోవడం ప్రధాన సమస్యలు. జైళ్లలో ఆహారాన్ని వండే సిబ్బందికి సరైన శిక్షణ ఉండదు. అంతేకాకుండా వంటగది పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, పారిశుద్ధ్య లోపాలు సాధారణం. ఇటువంటి వాతావరణంలో తయారైన ఆహారం ఖైదీల ఆరోగ్యానికి హానికరం. మానవ హక్కుల కమిషన్ రిపోర్ట్స్ ఈ సమస్యలను తరచుగా ప్రస్తావిస్తాయి.