సినిమా అంటే ఫైట్లు, పాటలు, కాస్త రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ సన్నివేశాలు ఇలా అన్ని కలిపి ఉండాలనే టార్గెట్ ఉంటుంది. కానీ అవన్నీ అక్కర్లేదంటున్నారు స్టార్స్. పాటలు, రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ అంశాలనే ఎలిమెంట్లు అన్నీ ఉండాల్సిన అవసరం లేదంటున్నారు. అంతేకాదు హీరోయిన్తోనూ పనిలేదంటున్నారు. ఇదే ఇప్పుడు నయా ట్రెండ్.
ఇటీవల మెగాస్టార్ నటించిన `గాడ్ ఫాదర్` చిత్రం ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్ల పరంగానూ ఫర్వాలేదనిపించింది. మలయాళ మూవీ `లూసీఫిర్`కి రీమేక్గా రూపొందిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్ లేదు. ఆ లోటు అభిమానులు ఫీలయినా, సినిమాపై పెద్ద ఇంపాక్ట్ చూపలేదు. అంతకు ముందు నటించిన `ఆచార్య`లో చిరంజీవి సరసన కాజల్ని తీసుకున్నా, చివర్లో ఆమెని తొలగించారు. ఆ సినిమాలో చిరుకి జోడీనే లేదు. అయితే ఆ సినిమా పరాజయం చెందిందనే విషయం తెలిసిందే. అందుకు హీరోయిన్ కారణం కాదు.
గతేడాది కోలీవుడ్ రికార్డులు తిరగరాశాడు లోకనాయకుడు కమల్ హాసన్. ఆయన నటించిన `విక్రమ్` సినిమా రూ.350కోట్లు వసూలు చేసింది. ఊహించని విధంగా అది కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇందులో కమల్ కి జోడీగా హీరోయిన్ లేదు. పూర్తి యాక్షన్గా, థ్రిల్లింగ్ ఎలిమెంట్లతోనే సినిమా సాగుతుంది. కానీ అంతే ఇంటెన్స్ గా, అంతే ఎంగేజింగ్గా సాగుతూ సంచలనం సృష్టించింది. సినిమాలో కంటెంట్ ఉంటే హీరోయిన్, గ్లామర్, పాటల అవసరం లేదని నిరూపించిందీ చిత్రం. దీనికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించడం విశేషం.
లోకేష్ కనగరాజ్ రూపొందించిన `ఖైదీ` చిత్రంలోనూ హీరో కార్తికి హీరోయిన్ లేదు. పైగా ఈ సినిమా కేవలం ఓ రోజు రాత్రి మాత్రమే జరుగుతుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ ఆడియెన్స్ ని కట్టిపడేసింది. భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా తెలుగులోనూ రికార్డు కలెక్షన్లని సాధించడం విశేషం. కమల్ `విక్రమ్` కూడా తెలుగులో భారీ వసూళ్లని రాబట్టింది. నిర్మాత నితిన్కి లాభాల పంట పండించింది. ఈ రెండు చిత్రాల్లో హీరోయిన్ లేదనే లోటే ఆడియెన్స్ కి అనిపించకపోవడం గమనార్హం. దర్శకత్వ ప్రతిభకది నిదర్శనంగా నిలుస్తుంది. వీళ్లిద్దరు హీరోయిన్తో పనిలేదన్నారు.
తమిళ స్టార్ సూర్య కూడా హీరోయిన్తో పనిలేదని నిరూపించాడు. ఆయన `జై భీమ్` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఓటీటీలో విడుదల అయిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అత్యధిక రేటింగ్, వ్యూస్ సాధించిన సినిమాగా నిలిచింది. ఇందులో సూర్యకి జోడీ లేదు. గ్లామర్, పాటలు అసలే లేవు. కానీ సంచలన విజయం సాధించింది.
మరోవైపు తెలుగులో యంగ్ హీరో నిఖిల్ కూడా అలాంటి సాహసమే చేశాడు. సంచలనం సృష్టించాడు. ఆయన నటించిన `కార్తికేయ2`లో హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. కానీ ఆమె పాత్ర కీలకంగానే ఉంటుంది, ఎక్కడ రొమాన్స్, ఆమెతో పాటలకుగానూ స్కోప్ లేదు. ఓ రకంగా నిఖిల్కి హీరోయిన్ లేదు. ఈసినిమా వంద కోట్లకుపైగా కలెక్షన్లని సాధించడం విశేషం. అలాగే ఇప్పుడు `స్పై` చిత్రంలో నటిస్తున్నారు నిఖిల్. ఇందులోనూ ఆయనకు జోడీ లేదని, గ్లామర్కి స్కోప్ లేదని తెలుస్తుంది.
ప్రస్తుతం యంగ్ హీరో సుధీర్బాబు `హంట్` చిత్రంలో నటిస్తున్నాడు. మహేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, `ప్రేమిస్తే` భరత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో సుధీర్బాబుకి హీరోయిన్ లేదు. గ్లామర్ ఎలిమెంట్లు లేవు. కానీ లేవనే ఆలోచనే రాదని చెప్పాడు దర్శకుడు. ఇది ఈ నెల 26న రిలీజ్ కానుంది. భవ్య క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిందీ చిత్రం.మరి ఇదిలా ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తుందో చూడాలి.
మరోవైపు వరుణ్ తేజ్ కూడా అలాంటి సాహసమే చేస్తున్నాడు. ఆయన నటిస్తున్న `గాండీవధారి అర్జున` చిత్రాన్ని రెండు రోజుల క్రితమే ప్రకటించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా, సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రవీణ్ సత్తారు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదే కాదు, మున్ముందు మరిన్ని సినిమాలు హీరోయిన్లు లేకుండానే రాబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు, ఇదొక ట్రెండ్గానూ మారబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సినిమాలో కంటెంట్ ఉంటే ఎక్స్ ట్రా అలంకారాలతో పనిలేదంటున్నారు ఆడియెన్స్. మేకర్స్ కూడా అలాంటి సాహసాలు చేస్తుండటం విశేషం.