
ఇంగ్లాండ్ - భారత్ జట్ల మధ్య ఓవల్ లో జరుగుతున్న ఐదవ టెస్టు మ్యాచ్ ఇప్పటికే రసవత్తరంగా మారింది. భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ లో సూపర్ షో తో ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్ ను ఉంచింది. తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ లో ఇబ్బంది పడిన భారత్.. బౌలింగ్ లో అదరగొట్టింది. ఇంగ్లాండ్ బ్యాటర్లకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది.
ఈ సిరీస్ ప్రారంభం నుంచి గ్రౌండ్ లో ఇరు జట్ల ప్లేయర్ల మధ్య కొనసాగుతున్న వాగ్వాదం హీటును పెంచింది. మైదానంలో వివాదాస్పద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజా టెస్టులో కూడా అలాంటి హీటెక్కించే ఘటన జరిగింది. ఇప్పుడు ఇరు జట్ల ప్లేయర్లు కాకుండా ఫీల్డ్ అంపైర్ కుమార ధర్మసేన వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్నారు.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో జో రూట్ ను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ప్రసిద్ధ్ కృష్ణ అద్భుత బౌలింగ్తో ఇబ్బంది పెట్టాడు. ప్రసిద్ధ్ ఏదో అనడంతో ఈ సమయంలో ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది.
వెంటనే జో రూట్ ఓ బౌండరీ కొట్టి ప్రతీకారం తీర్చుకున్నట్టుగా ఏదో అన్నాడు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతగా మారింది. అంపైర్లు కుమార ధర్మసేన, అసాన్ రజా మధ్యలోకి వచ్చి ప్రసిద్ధ్, జోరూట్ వాగ్వాదాన్ని దూరం చేశారు.
అయితే అప్పుడే కేఎల్ రాహుల్ తన జట్టును, ప్రసిద్ధ్ కృష్ణను సమర్థించేందుకు రంగంలోకి దిగాడు. ఈ క్రమంలోనే ధర్మసేనతో రాహుల్ ముక్కుసూటిగా మాట్లాడటంతో మరో హీట్ మొదలైంది. "మమ్మల్ని నిశ్శబ్దంగా ఉండమంటారా?" అంటూ కేఎల్ రాహుల్ అంపైర్ ను ప్రశ్నించాడు. వీరి సంభాషణకు సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి.
వెంటనే ధర్మసేన.. బౌలర్ మీ వైపు అలా వస్తే మీకు నచ్చుతుందా? మీరు అలా ప్రవర్తించడం తగదని పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్ వెనక్కి తగ్గకుండా అంటే మేము బ్యాట్, బాల్ చేసి ఇంటికెళ్లిపోవాలా? అంటూ కామెంట్ చేశాడు. ఈ విషయాన్ని ఆట ముగిశాక మాట్లాడుకుందాం. ఇప్పుడు మాత్రం అలా వద్దంటూ ధర్మసేన అన్నాడు. ఈ మాటలు మైక్లో రికార్డ్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ మ్యాచ్లో ధర్మసేన తీరుపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వచ్చాయి. మొదటి ఇన్నింగ్స్లో జోష్ టంగ్ వేసిన బంతికి సాయిసుదర్శన్ బ్యాట్తో టచ్ చేసినా… ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేసిన ఇంగ్లాండ్కు, అంపైర్ ధర్మసేన ముందుగానే ‘ఇన్సైడ్ ఎడ్జ్’ జరిగిందని సంకేతం ఇచ్చాడు.
దీనివల్ల ఇంగ్లాండ్ డీఆర్ఎస్ పై వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలోనే ధర్మసేన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అభిమానులు ధర్మసేనపై "ఇంగ్లాండ్ తరఫున ఆడుతున్నాడా ఏంటి" అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ధర్మసేన తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
నిజానికి ఈ మ్యాచ్ ను హీటెక్కించింది ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ డకెట్. అకాశ్ దీప్ను స్లెడ్జ్ చేశాడు. అప్పుడు కూడా ఇరువురు ప్లేయర్ల మధ్య వాగ్వాదం జరిగింది.
ఇక దూకుడుగా ఆడిన బెన్ డకెట్ను అకాశ్ దీప్ ఔట్ చేసి తగిన విధంగా తన స్లెడ్జ్ కు జవాబు ఇచ్చాడు. ఇది మరింతగా హీట్ మూడ్ను తీసుకువచ్చింది.
ఒక జట్టుపై తప్పుగా ప్రవర్తించబడితే, ఆటగాళ్లు తగిన విధంగా స్పందించాల్సిందే. కేఎల్ రాహుల్ అదే చేశాడు . మైదానంలో నైపుణ్యంతోపాటు గౌరవం కూడా కావాలని గుర్తు చేస్తూ ధర్మసేనను ప్రశ్నించాడు. ఈ సంఘటన తర్వాత ఇండియన్ క్రికెట్ అభిమానులు రాహుల్కి మద్దతుగా నిలిచారు.
‘‘మా జట్టును అపహాస్యం చేస్తే ఊరుకునేది లేదు’’ అంటూ సోషల్ మీడియాలో రాహుల్ కు మద్దతు తెలుపుతున్నారు. ధర్మసేన తీరుపై మండిపడుతున్నారు.
ఈ టెస్టు సిరీస్ మొత్తంగా తీవ్ర భావోద్వేగాలతో మ్యాచ్ లను ఉత్కంఠగా మారుస్తున్నాయి. ఐదవ టెస్టులో భారత జట్టు విజయం కోసం పోరాడుతోంది. ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్ ను ఉంచింది. ఓవల్ టెస్టులో ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 324 పరుగులు కావాలి. భారత్ గెలవాలంటే మరో 9 వికెట్లు పడగొట్టాలి.