ఒకప్పుడు కూతురు పుట్టగానే వారి వివాహం గురించి ఆలోచించేవారు. వివాహం నాటికి ఎంత సంపాదించాలన్న ఆలోచనలో ఉండే వారు. కానీ ప్రస్తుతం ఆలోచనలు మారుతున్నాయి. ఇప్పుడు కూతురు చదువు గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఉన్నత చదువులు చదివిస్తున్నారు. మంచి ఉద్యోగాలు చేయిస్తున్నారు.
అయితే చివరికి కూతుర్లు ఉండే పేరెంట్స్కి పెళ్లి అనేది కీలక అంశంగా మారుతుంది. పెళ్లి ఖర్చులకు అవసరమయ్యే డబ్బును జమ చేయాలని భావిస్తుంటారు. ఇందుకోసం పలు రకాల పెట్టుబడి మార్గాలను ఎంచుకుంటారు. అయితే 21 ఏళ్ల తర్వాత చేతికి రూ. 55 లక్షలు రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
21 ఏళ్లలో రూ. 55 లక్షలు..
21 ఏళ్లలో రూ. 55 లక్షలు పొందడానికి పోస్టాఫీస్ అందిస్తోన్న సుఖన్య సమృద్ధి యోజన బెస్ట్ పథకంగా చెప్పొచ్చు. ఇందులో పెట్టుబడి పెట్టడం సురక్షితమైన మార్గంగా చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో మీ డబ్బుకు ఎలాంటి ఢోకా ఉండదు అలాగే గ్యారెంటీ రిటర్న్స్ పొందొచ్చు. ఉదాహరణకు మీ కూతురు పుట్టిన వెంటనే ఆమె పేరుతో సుఖన్య పథకంలో నెలకు రూ. 10 వేల చొప్పున పెట్టుబడి పెడుతూ వెళ్లారనుకుందాం.
21 ఏళ్ల తర్వాత మీ మొత్తం పెట్టుబడి రూ. 18,00,000 అవుతుంది. దీనికి 21 ఏళ్ల తర్వాత రూ. 37,42,062 వడ్డీ జమ అవుతుంది. ఇలా మీరు మెచ్యూరిటీ సమయానికి రూ. 55,42,062ని సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం సుకన్య పథకంలో 8.2 శాతం వడ్డీ అందిస్తున్నారు.
సుఖన్య సమృద్ధి యోజన పథకం వివరాలు
ఆడ బిడ్డల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో ఖాతా తెరవాలంటే బాలిక వయసు 10 ఏళ్ల లోపు ఉండాలి. తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్ ఖాతా ఓపెన్ చేయొచ్చు. ఒక బాలికకు ఒక్క ఖాతా మాత్రమే అవకాశం ఉంటుంది. ఒక కుటుంబానికి గరిష్ఠంగా రెండు ఖాతాలు (ద్వితీయ బాలికలు కవలలుగా పుడితే మినహాయింపు ఉంటుంది).
ఇందులో కనీసం రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్ష వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఖాతా ప్రారంభించిన తేదీ నుంచి 15 సంవత్సరాల వరకు డిపాజిట్ చేయాలి. 21 ఏళ్ల నాటికి మెచ్యూరిటీ సమయంగా నిర్ణయించారు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 80సీ ప్రకారం రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.
ఇక మధ్యలో కూడా కొంతమేర డబ్బు విత్డ్రా చేసుకోవచ్చు. బాలిక 18 ఏళ్ల వయస్సులో విద్య కోసం 50% వరకు విత్డ్రా చేయొచ్చు వివాహ సమయంలో, అంటే 18 ఏళ్లకు పైబడిన తర్వాత ఖాతా మూసేయవచ్చు ఏదైనా పోస్టాఫీసు లేదా అనుమతి పొందిన బ్యాంకుల్లో ఈ ఖాతాను ఓపెన్ చేయొచ్చు.