Metro: ఆంధ్రప్రదేశ్లో మెట్రో రైలు నిర్మాణం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టు పనులు త్వరగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.
విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ రవాణా రంగంలో కొత్త విప్లవం సృష్టించనున్నాయి. ఫేజ్-1లో మొత్తం 84.23 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం జరగనుంది. విశాఖపట్నం 46.23 కి.మీ, విజయవాడ 38 కి.మీ. ఇప్పటికే సివిల్ పనుల 40 శాతం కోసం టెండర్లు పిలిచారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత నగరాల్లో రవాణా వ్యవస్థలో సౌకర్యం, వేగం, భద్రత పెరుగుతుంది.
25
ప్రీ-బిడ్ సమావేశాలు, కంపెనీల సూచనలు
టెండర్ ప్రకటన అనంతరం ప్రీ-బిడ్ సమావేశాలు నిర్వహించి, పలు కాంట్రాక్టర్ సంస్థలు హాజరయ్యాయి. వారు జాయింట్ వెంచర్స్ (JV) కి అవకాశం ఇవ్వాలని, పనులను చిన్న ప్యాకేజీలుగా విభజించమని సూచనలు ఇచ్చారు. ఈ సూచనలపై ఉన్నతాధికారులతో చర్చించిన తరువాత, ఎండీ ఎన్.పీ. రామకృష్ణారెడ్డి తుది నిర్ణయం ప్రకటించారు.
35
జాయింట్ వెంచర్స్ కోసం విధానాలు
ఈ విషయమై రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. టెండర్లలో జాయింట్ వెంచర్స్ పాల్గొనగలవు, కానీ గరిష్టంగా 3 కంపెనీల వరకు మాత్రమే. దీని వల్ల కంపెనీలు పోటీలో పాల్గొని పనుల నాణ్యత మెరుగవుతుంది. జాయింట్ వెంచర్స్ విధానం పెద్ద ప్రాజెక్టులలో సమర్థవంతమైన నిర్మాణం, ఖర్చు నియంత్రణకు దోహదపడుతుందని చెప్పుకొచ్చారు.
పనులను చిన్న ప్యాకేజీలుగా విడదీయకుండా పెద్ద స్థాయిలోనే కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నారు. త్వరగా ప్రాజెక్ట్ పూర్తి చేయడం, నిర్మాణ వ్యయం పెరగకుండా చూడటం వంటివి కారణాలుగా చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల మెట్రో ప్రాజెక్టుల అనుభవాల అధ్యయనం తర్వాత, పెద్ద ప్యాకేజీలలోనే పనులు వేగంగా, సమర్థవంతంగా సాగుతాయని అధికారులు పేర్కొన్నారు.
55
2028 నాటికి
విశాఖపట్నం మెట్రో టెండర్లు అక్టోబర్ 10 లోగా, విజయవాడ టెండర్లు అక్టోబర్ 14 లోగా దాఖలు చేయాల్సి ఉంది. సమయానికి టెండర్ల ప్రక్రియ పూర్తయితే, నిర్మాణం వేగంగా ప్రారంభమై, 2028 నాటికి మెట్రో రైళ్లు పౌరులకు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు.