తుపాను విధ్వంసం.. ఆంధ్రప్రదేశ్‌లో రూ.6,384 కోట్ల నష్టం

Published : Nov 10, 2025, 02:54 PM IST

Montha Cyclone : మొంథా తుపాన్‌ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రూ.6,384 కోట్ల నష్టం జరిగిందని ప్రభుత్వం తెలిపింది. బాధితుల సహాయానికి రూ.901 కోట్ల తక్షణ సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

PREV
15
ఏపీ పై మొంథా తుపాను దెబ్బ.. కేంద్ర సహాయం కోసం చంద్రబాబు సర్కారు విజ్ఞప్తి

మొంథా తుపాను ఆంధ్రప్రదేశ్‌పై విపరీతమైన ప్రభావం చూపింది. అంచనాలకు మించి రూ.6,384 కోట్ల ఆస్తినష్టం సంభవించిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. బాధితులను ఆదుకోవడానికి తక్షణం రూ.901.4 కోట్ల సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం అభ్యర్థించింది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావం, పునరుద్ధరణ చర్యలపై కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి సమీక్ష చేపట్టింది.

కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పాసుమీ బసు, వ్యవసాయ శాఖ సంచాలకుడు డాక్టర్ కె. పొన్నుస్వామి నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల బృందం అమరావతిలోని సచివాలయాన్ని సందర్శించింది. ఆర్టీజీఎస్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. జయలక్ష్మీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలు అందించారు.

25
వ్యవసాయం, మత్స్యకార రంగానికి భారీ దెబ్బ

మొంథా తుపాన్‌ వలన రాష్ట్రంలోని 24 జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని జయలక్ష్మీ తెలిపారు. మొత్తం 1.61 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మినుములు, మొక్కజొన్న పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. అలాగే 6,250 హెక్టార్ల ఉద్యానవన పంటలు, 17.72 హెక్టార్ల మల్బరీ తోటలు కూడా ధ్వంసమయ్యాయని వెల్లడించారు.

మత్స్యకారుల జీవనాధారం కూడా తీవ్రంగా దెబ్బతిన్నదని అధికారులు తెలిపారు. 3,063 హెక్టార్ల చేపల చెరువులు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. తుపాను కారణంగా 4,566 ఇళ్లు కూలిపోయాయి, 1,853 పాఠశాలలు దెబ్బతిన్నాయి.

35
మౌలిక సదుపాయాల పై తుపాను దెబ్బ

తుపాను ప్రభావంతో రోడ్లు, వంతెనలు, నీటి ప్రాజెక్టులు భారీగా నష్టపోయాయి. ఆర్ అండ్ బీ శాఖకు చెందిన 4,794 కిలోమీటర్ల రహదారులు, 311 వంతెనలు, 3437 మైనర్ ఇరిగేషన్ పనులు, 2417 మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని అధికారులు వివరించారు. అలాగే 58 అర్బన్ లోకల్ బాడీలు కూడా వర్షాల దెబ్బకు తీవ్రంగా దెబ్బతిన్నాయని వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ విపత్తు నుండి ప్రజలను త్వరగా బయటపడేందుకు కేంద్రం ఉదారంగా సహాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. బాధితులు తమ జీవనాధారాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, కేంద్ర సాయం ఎంతో కీలకమని అధికారులు పేర్కొన్నారు.

45
డ్రోన్లతో తుపాను మానిటరింగ్

రాష్ట్ర ప్రభుత్వం ఈ తుపాను ప్రభావాన్ని తగ్గించేందుకు ముందస్తు చర్యలు చేపట్టిందని అధికారులు వివరించారు. బుడమేరుపై వచ్చిన గత అనుభవం ఆధారంగా ఈసారి 680 డ్రోన్లను ఉపయోగించి వర్షపాతం, వరదల పరిస్థితులను పర్యవేక్షించారు.

అక్టోబర్ 27 నుంచి 29 వరకు 82.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందనీ, ఇది సాధారణ వర్షాల కంటే తొమ్మిది రెట్లు ఎక్కువని వెల్లడించారు. 443 మండలాలు ఈ తుపాన్ ప్రభావానికి లోనయ్యాయి. ఈ విపత్తులో 3 మంది మరణించగా, 9,960 ఇళ్లు నీటమునిగాయి, 1,11,402 మంది నిరాశ్రయులయ్యారు.

సహాయక చర్యలలో 12 ఎన్డీఆర్‌ఎఫ్‌, 13 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 1,702 వాహనాలు, 110 ఈతగాళ్లు పాల్గొన్నారు. 22 జిల్లాల్లో 2,471 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 1.92 లక్షల మందికి ఆశ్రయం కల్పించారని అధికారులు తెలిపారు.

55
కేంద్రం సాయం కీలకం

మొంథా తుపాను ఆంధ్రప్రదేశ్‌ను తీవ్రంగా దెబ్బతీసిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనపై కేంద్రం స్పందించాల్సిన అవసరం ఉందని అధికారులు స్పష్టం చేశారు. బాధితులు మళ్లీ జీవితాలను పునఃప్రారంభించడానికి కేంద్రం అందించే సహాయం ఎంతో కీలకమని, రాష్ట్రం మొత్తం దీని కోసం ఎదురు చూస్తోందని తెలిపారు. రైతులు, మత్స్యకారులు, ఇళ్లు, పాఠశాలలు, రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయనీ, అందుకే రూ.901 కోట్ల తక్షణ సాయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

Read more Photos on
click me!

Recommended Stories