IMD Rain Alert : అల్లకల్లోలమే.. వచ్చే మూడు రోజులు అతి భారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు

Published : Oct 21, 2025, 10:27 PM IST

Heavy Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముందని భారత వాతారణ శాఖ హెచ్చరించింది. దీంతో దక్షిణ భారతంపై తీవ్ర ప్రభావం ఉండనుంది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.

PREV
15
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఐఎండీ అలర్ట్

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో దక్షిణ భారతంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతారణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. 

తమిళనాడులోని పలు ప్రాంతాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో పాటు భారీ వర్షాల హెచ్చరికల మధ్య ఎంకే స్టాలిన్ సర్కారు అప్రమత్తమైంది. బుధవారం స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది.

ఈ అల్పపీడనం ఆంధ్రప్రదేశ్ పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, ఈ అల్పపీడనం రాబోయే 36 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఈ వాతావరణ వ్యవస్థ, బుధవారం నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ, “వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు శనివారం వరకు సముద్రంలోకి వెళ్లరాదు” అని హెచ్చరించారు.

25
ఏపీలో ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్‌లు జారీ

వాతావరణ శాఖ మంగళవారం నుండి శనివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్‌లు జారీ చేసింది. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, కడప, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

బుధవారం (అక్టోబర్ 22) నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలను తాకే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక మానిటరింగ్ ఏర్పాటు చేశారు. రాబోయే రెండు రోజుల్లో తీరం వెంబడి గంటకు 35 నుండి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

35
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో బుధవారం అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయి. గురువారం బాపట్ల, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడపలో కూడా మోస్తరు వర్షాలు పడతాయి.

ఇప్పటికే తిరుపతి జిల్లాలోని చిలమనూరు (79 మిమీ), నెల్లూరు జిల్లా ఆత్మకూరు (77.2 మిమీ), గొల్లగుంట (68.5 మిమీ) ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది.

45
ప్రజలకు అధికారుల హెచ్చరికలు

భారీ వర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరింది. చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ దగ్గర నిలబడకూడదని, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

లోతట్టు ప్రాంతాల ప్రజలు పొంగిపోర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 1800-425-0101 ద్వారా కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చు.

“రాబోయే ఐదు రోజులు వర్షాలు కొనసాగవచ్చు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు అన్ని జిల్లాల్లో సిద్ధంగా ఉన్నారు” అని ప్రఖర్ జైన్ అన్నారు.

55
తిరుమలలో భారీ వర్షం, భక్తులకు ఇబ్బందులు

తిరుపతి, తిరుమలలో ఇప్పటికే వర్షం పడుతోంది. మంగళవారం ఉదయం నుండి కురుస్తున్న వానలతో శ్రీవారి ఆలయ ప్రాంగణం తడిసిపోయింది. దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థలు ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీచేశాయి. వర్షాల తీవ్రతను బట్టి సంబంధిత జిల్లాల యంత్రాంగం హై అలెర్ట్‌లో ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలను పాటించాలని ప్రభుత్వం సూచించింది.

Read more Photos on
click me!

Recommended Stories