Andhra pradesh: ఏపీ ప్ర‌భుత్వం మ‌రో కీలక నిర్ణ‌యం.. రాష్ట్ర‌వ్యాప్తంగా సంజీవ‌ని ప్రాజెక్టు

Published : Aug 26, 2026, 06:17 PM IST

Andhra pradesh: వైద్యారోగ్య సేవలను మరింత సమర్థంగా అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘సంజీవని ప్రాజెక్టు’ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జనవరి 1 నుంచి ఈ ప్రాజెక్టును అన్ని ప్రాంతాల్లో అమలు చేయాలని చంద్ర‌బాబు ఆదేశించారు.

PREV
15
జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు

అమరావతిలో బుధవారం నిర్వహించిన వైద్యారోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ‘సంజీవని ప్రాజెక్టు’ అమలుపై అధికారులతో చర్చించారు. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గం, చిత్తూరు జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుండగా అక్కడ వచ్చిన ఫలితాలను పరిశీలించారు. ఈ ఫలితాలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సాధించేలా ప్రాజెక్టును విస్తరించాలని అధికారులను ఆదేశించారు. వైద్య సేవల్లో ఏపీని ఇతర రాష్ట్రాలు అనుసరించే స్థాయిలో సంజీవని ప్రాజెక్టును విజయవంతం చేయాలని సూచించారు.

25
90 రోజుల ప్రణాళికతో విస్తరణ

సంజీవని కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఇందులో బేస్‌లైన్ అధ్యయనం, డిజిటల్ మౌలిక వసతుల ఏర్పాటు, వైద్య సిబ్బందికి శిక్షణ, సర్టిఫికేషన్, జాతీయ, రాష్ట్ర స్థాయి ఆరోగ్య పోర్టల్స్‌తో అనుసంధానం వంటి అంశాలను చేర్చారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో వైద్య సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించనున్నట్టు వివరించారు. ప్రతి కుటుంబం విద్య, వైద్యం కోసం అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోందని సీఎం పేర్కొన్నారు. ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గించేలా సంజీవని వంటి కార్యక్రమాలను మరింత సమర్థంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టులో అధికారిక భాగస్వామిగా ఉన్న టాటా ఎండీ సంస్థ వైద్యారోగ్య రంగంలో కొత్త ఆవిష్కరణలకు కృషి చేయాలని సూచించారు.

35
ఏఐ ఆధారిత వైద్య సేవలకు ప్రాధాన్యం

స్క్రీనింగ్ నుంచి చికిత్స, ఫాలోఅప్ వరకు మొత్తం ఆరోగ్య వ్యవస్థను ఏఐ ఆధారంగా తీర్చిదిద్దుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఏఐ డాక్టర్ సేవలను కూడా విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలని చంద్రబాబు సూచించారు. వ్యాధులను ముందుగానే గుర్తించడం, వాటిని నివారించడం, అవసరమైన చికిత్స అందించడం, తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. వైద్య సేవలతో పాటు ప్రజల ఆహారపు అలవాట్లు, జీవనశైలి, ఆలోచనా విధానంలోనూ ఆరోగ్యకరమైన మార్పులు తీసుకురావాలని సీఎం సూచించారు. హోమియోపతి, ఆయుర్వేదం, యోగా, ప్రాణాయామంతో పాటు ఆధునిక వైద్య విజ్ఞానాన్ని అవసరానికి అనుగుణంగా వినియోగించుకోవాలని తెలిపారు.

45
డేటా భద్రతకు ప్రాధాన్యం.. మొబైల్‌కు హెల్త్ అప్డేట్స్

సంజీవని ప్రాజెక్టులో డిజిటల్ హెల్త్ రికార్డులు కీలకంగా ఉండనున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్య సమాచారాన్ని భద్రంగా ఉంచడంతో పాటు గోప్యతను కాపాడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆరోగ్య సేవలపై సమగ్ర సమాచారం అందేలా ప్రత్యేక డ్యాష్‌బోర్డును రూపొందించాలని ఆదేశించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై నమ్మకం పెరిగేలా వ్యవస్థను రూపొందించాలని చెప్పారు. ప్రజల మొబైల్ ఫోన్లకు నేరుగా ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్ అందేలా సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు. ఆస్పత్రుల్లో శానిటేషన్ సహా వివిధ ఔట్‌సోర్సింగ్ సేవల నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, సమర్థంగా పనిచేయని సర్వీస్ ప్రొవైడర్లను తొలగించేలా విధానం రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

55
కుప్పం, చిత్తూరులో మెరుగైన ఫలితాలు

కుప్పం, చిత్తూరు ప్రాంతాల్లో సంజీవని ప్రాజెక్టు అమలుతో వచ్చిన ఫలితాలను సమీక్షలో అధికారులు సీఎంకు వివరించారు. చిత్తూరులో నమోదైన గణాంకాల ప్రకారం హైపర్‌టెన్షన్ కేసుల్లో 56 శాతం కేసులు నియంత్రణలోకి వచ్చినట్టు తెలిపారు. డయాబెటిస్ కేసుల్లో 16 శాతం మేర తీవ్రత తగ్గినట్టు వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య సేవలను ప్రజలు వినియోగించుకునే స్థాయిలోనూ గణనీయమైన పెరుగుదల నమోదైందని చెప్పారు.

సంజీవని సేవలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు నిర్వహించిన సర్వేలో 91 శాతం మంది తమ ఆరోగ్యంపై అవగాహన పెరిగిందని వెల్లడించినట్టు అధికారులు తెలిపారు. ఈ ఫలితాలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడం ద్వారా వ్యాధుల నియంత్రణతో పాటు ముందస్తు ఆరోగ్య సంరక్షణకు మరింత ప్రాధాన్యం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమీక్షలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్, సంయుక్త కార్యదర్శి రోణంకి గోపాలకృష్ణతో పాటు టాటా ఎండీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories