
జాబ్ క్యాలెండర్ ప్రకారం మొత్తం ఉద్యోగాలను నాలుగు విడతల్లో భర్తీ చేయనున్నారు. తొలి విడతలో 1,523 పోస్టులకు ఇప్పటికే నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ఉన్నత విద్యాశాఖ ఈ పోస్టులకు మే 15, 2026న నోటిఫికేషన్ జారీ చేసింది. మిగిలిన మూడు దశలకు సంబంధించిన నోటిఫికేషన్లను సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో విడుదల చేయనున్నారు.
మొదటి విడతలో భాగంగా ఇప్పటికే 1,523 పోస్టులకు గాను నోటిఫికేషన్ జారీ చేశారు. రెండో విడతలో 3,231 పోస్టులకుగాను 2026 సెప్టెంబర్ 15న, మూడో విడతలో భాగంగా 2,311 పోస్టులకు 2026 అక్టోబర్ 15వ తేదీన, నాలుగో విడతలో 2,995 పోస్టులకు గాను 2026 అక్టోబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ నాలుగు దశల్లో గ్రూప్స్, పోలీస్ ఉద్యోగాలతో పాటు ఉపాధ్యాయులు, ఇంజినీరింగ్, విద్యుత్, ఎక్సైజ్ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
రెండో విడతలో 3,231 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది. సెప్టెంబర్ 15న వెలువడే ఈ ప్రకటనలో గ్రూప్-1 సర్వీసులతో పాటు పోలీస్, పశుసంవర్ధక, అగ్నిమాపక, జైళ్ల శాఖలకు చెందిన పోస్టులు కూడా ఉన్నాయి. గ్రూప్-1 కేటగిరీలో మొత్తం 149 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, అసిస్టెంట్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-II, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్ వంటి కీలక హోదాలు ఉన్నాయి. పోలీస్ శాఖలో సివిల్ ఎస్సై, ఏఆర్ ఎస్సై, సివిల్ కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్, ఏపీఎస్పీ ఎస్సై, ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు కలిపి పెద్ద సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇతర విభాగాల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఫైర్మెన్, జైలు వార్డర్, హార్టికల్చర్ ఆఫీసర్, దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-III వంటి పోస్టులు కూడా ఉన్నాయి.
మూడో విడతలో 2,311 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటికి అక్టోబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దశలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూసే గ్రూప్-2 పోస్టులకు ప్రాధాన్యం ఇచ్చారు. గ్రూప్-2 కేటగిరీలో మొత్తం 673 పోస్టులు ఉన్నాయి. వీటిలో డిప్యూటీ తహశీల్దార్, డిప్యూటీ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్-ఇన్స్పెక్టర్, సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్-II వంటి ఉద్యోగాలు ఉన్నాయి. సచివాలయం, హెచ్ఓడీల పరిధిలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, అకౌంటెంట్ల పోస్టులు కూడా ఈ విడతలో ఉన్నాయి. ఇంజినీరింగ్ విభాగంలోనూ గణనీయమైన ఖాళీలు ఉన్నాయి. ఇరిగేషన్, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, ఆర్అండ్బీ శాఖల్లో ఏఈఈ పోస్టులు ఉన్నాయి. విద్యుత్ సంస్థల్లో ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో, డిస్కంల పరిధిలో ఏఈఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అదనంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వంటి పోస్టులకు కూడా ఈ దశలో అవకాశం కల్పించారు.
ఉద్యోగ క్యాలెండర్లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న మరో దశ నాలుగో విడత. ఇందులో 2,995 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ దశను ప్రధానంగా పాఠశాల విద్యాశాఖలోని ఉపాధ్యాయ నియామకాలకు కేటాయించారు. అక్టోబర్ 15న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, ఇన్స్ట్రక్టర్లు తదితర పోస్టులను ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు. సబ్జెక్టులు, కేటగిరీల వారీగా ఖాళీల పూర్తి వివరాలు డీఎస్సీ నోటిఫికేషన్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలో 2,991 పోస్టులు ఉండగా, వయోజన విద్య విభాగంలో మరో నాలుగు అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ కీలకంగా మారనుంది.
నియామక ప్రక్రియను వేగంగా పూర్తి చేయడంతో పాటు నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని ప్రభుత్వం సంబంధిత శాఖలను ఆదేశించింది. ఖాళీల సంఖ్య, రోస్టర్ పాయింట్లు, విద్యార్హతలు, ఇతర అవసరమైన సమాచారాన్ని నియామక సంస్థలకు వెంటనే అందించాలని స్పష్టం చేసింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్, రిజర్వేషన్ నిబంధనలు, ఆయా శాఖల సర్వీస్ రూల్స్ను తప్పనిసరిగా పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, డీఎస్సీ వంటి సంస్థలు తమ పరిధిలోని పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసి ఎంపిక ప్రక్రియను నిర్వహించనున్నాయి.