
ఎండాకాలం తర్వాత వర్షాకాలం వస్తే చాలా హాయిగా ఉంటుంది. కానీ వర్షాలతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. ఎప్పుడూ తేమ, ముసురు ఉండటం వల్ల కూరగాయలు, కొన్ని ఆహార పదార్థాలు చెడిపోయే అవకాశం ఎక్కువ. ఈ సమయంలో కూరగాయలు కొని నిల్వ చేసుకునేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి.
కూరగాయలను ఉప్పు వేసి కడగడం
వర్షాకాలంలో కూరగాయలపై క్రిములు, బాక్టీరియా ఎక్కువగా ఉంటాయి. కూరగాయలు కొన్న తర్వాత ఉప్పు నీటితో బాగా కడగాలి. తర్వాత బాగా ఆరబెట్టాలి. ఆ తర్వాత ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు. చాలా రోజులు చెడిపోకుండా ఉంటాయి.
వేర్లు తీసేయడం
వర్షాకాలంలో ఆకుకూరలు జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే త్వరగా చెడిపోతాయి. ఆకుకూరల వేర్లు తీసేసి నీటితో బాగా కడగాలి. వాటికి మట్టి, మురికి అంటుకుని ఉండే అవకాశం ఉంది. కడిగిన తర్వాత బాగా ఆరబెట్టాలి. తర్వాత పేపర్ టవల్లో చుట్టి ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు.
గాలి ఆడేలా చూసుకోవడం
ప్లాస్టిక్ సంచుల్లో క్యారెట్, ముల్లంగి లాంటి కూరగాయలు పెట్టేటప్పుడు చిన్న రంధ్రాలు చేస్తే గాలి బాగా ఆడుతుంది. ఇది తేమ పట్టకుండా, కూరగాయలు చెడిపోకుండా ఉండటానికి సహాయపడుతుంది.
సహజ పద్ధతులు
వెల్లుల్లి, వేపాకు, కరివేపాకు లాంటివి కూరగాయలు చెడిపోకుండా ఉండటానికి సహాయపడతాయి. వీటిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి కూరగాయలపై బాక్టీరియా, ఫంగస్ పెరగకుండా ఆపుతాయి.
గాలి చొరబడని డబ్బాలు
కూరగాయలు ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉండాలంటే గాలి చొరబడని డబ్బాల్లో పెట్టి మూత పెట్టి ఉంచడం మంచిది. వర్షాకాలంలో గాలిలో ఉండే తేమ వల్ల అవి పాడైపోతూ ఉంటాయి. అందుకే.. ఎయిర్ కంటైనర్ లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.