సీనియర్ నటి జయసుధ చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో కలకలం రేపిన విషయం తెలిసిందే. తెలుగు హీరోయిన్స్ కి, నటులకు కనీస మర్యాద దక్కడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చాలా కాలంగా కోటా శ్రీనివాసరావు సైతం ఇదే తరహా ఆరోపణలు చేస్తున్నారు. సీనియర్స్ కి టాలీవుడ్ పై ఎందుకు మండుతుంది అనేది ప్రాధాన్యత సంతరించుకుంది.
సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు పలు సందర్భాల్లో పరిశ్రమపై ఆరోపణలు చేశారు. టాలీవుడ్ లో ప్రతిభ కలిగిన నటులు ఎందరో ఉన్నా... దర్శకులు మాత్రం పర భాషా నటుల వెంటపడుతున్నాడు. వాళ్లకు అత్యధిక రెమ్యూనరేషన్, సౌకర్యాలు ఇచ్చి సినిమాల్లో పెట్టుకుంటున్నారు. అదే సమయంలో ఇతర పరిశ్రమల్లో మన నటులకు కనీస మర్యాద ఇవ్వరు. అలాంటప్పుడు మన దర్శక నిర్మాతలు అంత ప్రాధాన్యత ఇతర పరిశ్రమల నటులకు ఎందుకు ఇస్తున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు.
ఇదే తరహా కామెంట్స్ తాజాగా జయసుధ చేశారు. తెలుగు హీరోయిన్స్ కి కనీస సౌకర్యాలు ఇవ్వని మన నిర్మాతలు ముంబై హీరోయిన్ అంటే మాత్రం ఆమె కుక్కకు కూడా సపరేట్ గది ఏర్పాటు చేస్తారు అన్నారు. కోట, జయసుధ ఆరోపణల్లో నిజం ఉంది. అయితే దశబ్దాల పాటు తీరిక లేకుండా నటించిన ఈ ఇద్దరు నటులు టాలీవుడ్ పై ఆరోపణలు చేయడం హాస్యాస్పదం. స్టార్ హీరోలకు కూడా వార్ధఖ్యం వస్తుంది.
అనేక కారణాలతో సదరు నటులకు అవకాశం ఇవ్వకపోవచ్చు. అంత మాత్రాన పరిశ్రమను తప్పుబట్టడం కరెక్ట్ కాదేమో. ఇన్నేళ్ల తర్వాత కూడా తాము బిజీ నటులుగా ఉండాలని అనుకోవడం పొరపాటు. ఏడాదికి పదుల సంఖ్యలో కోట, జయసుధ చిత్రాలు చేశారు. అప్పుడు వాళ్లకు అన్నం తినే తీరిక కూడా ఉండేది కాదు. అప్పుడు కూడా వీళ్లకు అవకాశాలు ఇచ్చింది టాలీవుడ్ దర్శకులే. అవన్నీ మర్చిపోయి ఏక పక్షంగా మాట్లాడడం సబబు కాదేమో.
ట్రెండ్ మారింది. సినిమాల్లో అమ్మ, నాన్న పాత్రలకు ప్రాధాన్యం ఉండే రోజులు కాదు. అదే సమయంలో నటుల రెమ్యూనరేషన్ మధ్య వ్యత్యాసం కూడా నిర్మాతలు చూసుకుంటారు. ఎవరు తక్కువ తీసుకుంటే వాళ్ళను తీసుకుంటారు. కాబట్టి అవకాశ విషయంలో జయసుధ, కోట లాంటి వాళ్ళు ఆరోపణలు చేయకపోతే గౌరవంగా ఉంటుంది. తెలుగు పరిశ్రమ వాళ్లకు ఇచ్చినంతగా ఎవరికీ ఇవ్వలేదు.