టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఈడీ కార్యాలయంలో ప్రత్యక్షమైన బండ్ల గణేశ్.. పూరి కోసం వచ్చానంటూ స్టేట్‌మెంట్

By Siva KodatiFirst Published Aug 31, 2021, 7:19 PM IST
Highlights

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్ ఇంటరాగేషన్ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఏడు గంటలకు పూరిని ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. ఈ నేపథ్యంలో నిర్మాత బండ్ల గణేశ్ ఈడీ కార్యాలయంలో ప్రత్యక్షం కావడం సంచలనం సృష్టిస్తోంది. 
 

టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ ఈడీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. అయితే తాను పూరి జగన్నాథ్ కోసం వచ్చానని.. తనకు ఎవరూ నోటీసులు ఇవ్వలేదని ఆయన చెబుతున్నారు. అసలు తనకెందుకు నోటీసులు ఇస్తారని బండ్ల గణేశ్ ప్రశ్నించారు. మరోవైపు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్ ఇంటరాగేషన్ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఏడు గంటలకు పూరిని ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. 

పూరి జగన్నాథ్ బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తున్న అధికారులు.. 2015 నుంచి ట్రాన్సాక్షన్స్‌పై ఆరా తీస్తున్నారు. ఛార్టెట్ ఎకౌంటెంట్ సమక్షంలో బ్యాంకు ఖాతాల లావాదేవీలను అధికారులకు వివరిస్తున్నారు పూరి. ముఖ్యంగా విదేశీ లావాదేవీలపైనే ఈడీ అధికారులు దృష్టి సారించారు. మనీలాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై కూపీ లాగుతున్నారు. మీకు డ్రగ్స్ ఎవరు అందించారు..? డ్రగ్స్ ఇచ్చినందుకు మీరు ఎంత డబ్బు ఇచ్చారు.. ? అంటూ పూరి జగన్నాథ్‌పై ఈడీ ప్రశ్నలు వేస్తోంది. 

 

కాగా, ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. గతంలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ 62 మందిని విచారించింది. డ్రగ్స్‌ కేసులో లబ్ధిదారుల అక్రమాస్తుల జప్తు దిశగా ఈడీ కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. పూరి జగన్నాధ్, రవితేజ, నవదీప్, తరుణ్, ఛార్మి, రానా, రకుల్, నందు,మొమైత్ ఖాన్, తనీష్ లతో పాటు రవితేజ డ్రైవర్, ఎఫ్ క్లబ్ ఓవర్ మొత్తం 12మందిని, ఈనెల 31నుండి సెప్టెంబర్ 22వరకు వరుసగా విచారించనున్నారు.  విదేశాలకు నిధుల తరలింపుపై వీరిని ఈడీ విచారించనుంది. వీరి విచారణ పూర్తి అయిన అనంతరం మరికొంత మందికి నోటీసులు జారీ చేసే అవకాశం కలదు.  

click me!