మానవత్వాన్ని చాటుకున్న కల్వకుంట్ల కవిత... గిరిజన బాలికకు వైద్యసాయం

By Arun Kumar PFirst Published Mar 19, 2020, 4:49 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ గిరిజన బాలికకు వైద్యసాయం అందించి నూతన జీవితాన్ని ప్రసాదించారు. 

నిజామాబాద్: ఆర్మూర్ నియోజకవర్గం ‌మాక్లూరుకు చెందిన గిరిజన బాలిక నందిని సాయం చేయాలంటూ కల్వకుంట్ల కవితను‌ కలిసారు. నందిని ఆరోగ్యం బాగోగుల గురించి తెలుసుకున్న కవిత అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నందినికి ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చినా తనకు‌ సమాచారం అందించాలని ఉపాధ్యాయులు మరియు బంధువులకు సూచించారు ‌కల్వకుంట్ల కవిత. 

అంతేకాదు పదో తరగతి పరీక్షలు రాస్తున్న నందినికి‌ ఆల్ ది బెస్ట్ చెప్పి ఉత్సాహాన్ని నింపారు. చదువులో ఎప్పుడూ టాపర్ గా ఉండే నందినిని అభినందించిన‌ కవిత.. నందిని బొమ్మలు గీసే నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. 

ఈ సందర్భంగా బాలిక నందిని మాట్లాడుతూ... కవిత సహాయం వెలకట్టలేనిదని అన్నారు. ఆమె ప్రోత్సాహంతో ఉన్నత చదవులు పూర్తి చేస్తానంటూ విశ్వాసం వ్యక్తం చేసింది.

ఆర్మూరు నియోజకవర్గం మాక్లూరుకు చెందిన నందిని చదువులో టాపర్. మాక్లూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న నందిని అక్షరాలు రాసినా.. బొమ్మలు గీసినా అద్భుతంగా ఉండేవి. అయితే షుగర్, థైరాయిడ్ తో బాధపడుతున్న ఆమె ఇటీవలే కంటిచూపు మందగించింది. నిత్యం ఇన్సులిన్ ఇంజక్షన్ వేసుకుంటూ కాలం వెల్లదీసింది. వ్యాధి తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ కలవరపెట్టింది. 

తండ్రి చిన్నప్పుడే మరణించడం... తల్లి మానసిక వ్యాధితో మంచం పట్టడంతో నందిని పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అయితే విషయం తెలుసుకున్న కల్వకుంట్ల కవిత నందినికి మెరుగైన చికిత్స అందించేందుకు సిద్ధమైంది. బాలికను హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 

కంటికి చికిత్స నిర్వహించడంతో నందిని ఆరోగ్యం కుదుటపడింది. తిరిగి ఆమె కోలుకునే వరకూ బాగోగుల గురించి నిరంతరం పర్యవేక్షించారు కల్వకుంట్ల కవిత. తాజాగా నందినితో పాటు స్కూల్ ప్రిన్సిపాల్, ఎంఈఓ మరియు ఇతర ఉపాధ్యాయులు కవితను కలిశారు. 

click me!