రూపీ@79.99: రూ.2.72 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి

By Arun Kumar PFirst Published Sep 19, 2018, 7:52 AM IST
Highlights

చైనా, అమెరికా మధ్య వాణిజ్య పోరు మరింత తీవ్రమైంది. చైనా దిగుమతులపై అమెరికా 200 బిలియన్ల డాలర్ల సుంకాలు విధిస్తే, ప్రతిగా అమెరికా నుంచి వస్తువుల దిగుమతిపై డ్రాగన్ 60 బిలియన్ల డాలర్ల మేరకు సుంకాలు విధించింది. 

చైనా, అమెరికా మధ్య వాణిజ్య పోరు మరింత తీవ్రమైంది. చైనా దిగుమతులపై అమెరికా 200 బిలియన్ల డాలర్ల సుంకాలు విధిస్తే, ప్రతిగా అమెరికా నుంచి వస్తువుల దిగుమతిపై డ్రాగన్ 60 బిలియన్ల డాలర్ల మేరకు సుంకాలు విధించింది. ఈ నేపథ్యంలో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి.

ఫలితంగా డాలర్ మరింత బలోపేతం కావడంతో స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ సెంటిమెంట్ బలహీనపడింది. వరుసగా రెండోరోజు కూడా ఇన్వెస్టర్లు లాభాలార్జనకే మొగ్గు చూపారు. ఫలితంగా రెండు రోజుల్లో 2.72 లక్షల కోట్ల మదుపర్ల పొదుపు ఆవిరైంది. 

మంగళవారం మధ్యాహ్నం వరకు పరిమిత శ్రేణిలో కదలాడిన స్టాక్‌ మార్కెట్, ఆ తర్వాత భారీగా నష్టపోయింది. బాండ్ల రాబడి 8 శాతానికి పైగా పెరగడం దీనికి ప్రధాన కారణాలు. గత రెండు రోజుల్లో సెన్సెక్స్‌ 800 పాయింట్ల మేర పతనమైంది. ఈ రెండు రోజుల నష్టాలతో ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.2,72,549 కోట్లు తగ్గి రూ.1,53,64,470 కోట్లకు దిగజారింది. 

నిఫ్టీ కీలక 11,300 పాయింట్ల దిగువన పతనమైంది. వరుసగా రెండు రోజులు స్టాక్‌ సూచీలు నష్టపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 295 పాయింట్లు నష్టపోయి 37,291 పాయింట్ల వద్ద, నిఫ్టీ 99 పాయింట్లు నష్టపోయి 11,279 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్‌ సూచీలు నెల కనిష్టానికి పడిపోయాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి.

సెన్సెక్స్‌ స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. ఆరంభ కొనుగోళ్ల జోరుతో 160 పాయింట్ల లాభంతో ఇంట్రాడేలో 37,745 పాయింట్ల వద్ద గరిష్ట స్థాయిని తాకింది. మధ్యాహ్నం దాకా పరిమిత శ్రేణిలోనే కదలాడింది. చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తాయి.

ఒకదశలో 343 పాయింట్ల నష్టంతో 37,243 పాయింట్ల వద్ద అంతర్గత ట్రేడింగ్‌లో కనిష్టాన్ని తాకింది. మొత్తం రోజంతా 503 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. సోమవారం సెన్సెక్స్‌ 505 పాయింట్లు నష్టపోయిన సంగతి తెలిసిందే.

ఇక నిఫ్టీ అంతర్గత ట్రేడింగ్‌లో 34 పాయింట్ల లాభంతో 11,411 పాయింట్ల వద్ద గరిష్ట స్థాయిని తాకినా, ఆ లాభాలు నిలుపు కోలేకపోయింది. 109 పాయింట్ల నష్టంతో 11,269 పాయింట్ల వద్ద అంతర్గతట్రేడింగ్‌లో కనిష్ట స్థాయిని తాకింది.

ముడిచమురు ధరల పెరుగుదలతో స్టాక్‌ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. అమెరికా, చైనా మధ్య సుంకాల పోరు మరింతగా ముదరడం, రూపాయి బలహీనత కొనసాగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని వివరించారు.

సమీప భవిష్యత్‌లో మార్కెట్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. అంతర్జాతీయ సంకేతాలు అనిశ్చితిగా ఉంటాయని, ముడి చమురు ధరలు ఎగబాకుతున్నాయని, రూపాయి పతనం కొనసాగుతుందని ఇన్ని ప్రతికూలతల మధ్య స్టాక్‌ మార్కెట్‌ తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతుందని వారంటున్నారు. నిఫ్టీ కీలకమైన 11,300 పాయింట్ల దిగువకు పడిపోయిందని, తదుపరి మద్దతు 11,100 పాయింట్లని నిపుణులంటున్నారు.

బ్యాంకింగ్ సూచీలో ఎస్బీఐ 4 శాతం నష్టపోయి రూ.274 వద్ద ముగిసింది. ఇది సెన్సెక్స్‌లో అత్యధికంగా నష్టపోయిన షేర్‌. ఇంగ్లాండ్‌లో జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ ఉత్పత్తిలో కోత విధిస్తున్నట్లు ప్రకటించడంతో టాటా మోటార్స్‌ షేర్‌ 3.3% నష్టంతో రూ.251కు పతనమైంది. 31 సెన్సెక్స్‌ షేర్ల సూచీలో ఏడు మాత్రమే హిందుస్తాన్‌ యూనీలివర్, యస్‌ బ్యాంక్, విప్రో, ఓఎన్‌జీసీ, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మహీంద్రా  మాత్రమే లాభపడ్డాయి.

మిగతా 24 షేర్లు నష్టపోయాయి. గత ఐదు రోజుల్లో 70% వరకూ పెరిగిన కొన్ని పంచదార షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. అంతర్గత ట్రేడింగ్‌లో శ్రీ రేణుక, బలరామ్‌ పూర్‌ చిని, థమ్‌పూర్‌ షుగర్, త్రివేణి ఇంజినీరింగ్, మవానా షుగర్స్, ఉగార్‌ షుగర్‌ వర్క్స్, పొన్ని షుగర్స్‌ షేర్లు 10 శాతం వరకూ పతనమయ్యాయి.

సోమవారం 74 పైసలు పతనమైన రూపాయి మంగళవారం మరో 46 పైసలు క్షీణించింది. డాలర్‌తో రూపాయి మారకం జీవిత కాల కనిష్ట స్థాయి 72.98 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 72.99 వరకు ఈ ఏడాది రూపాయి ఇప్పటివరకూ 14 శాతం నష్టపోయింది.

దీనికి తోడు మన దేశం చమురు అవసరాలకు 80% కి పైగా దిగుమతులపైనే అధారపడుతోంది. క్రూడ్‌ ధరలు పెరుగుతుండటం, రూపాయి పతనం కారణంగా కరెంట్‌ అకౌంట్‌ లోటు పెరుగుతుందనే ఆందోళన నెలకొన్నది. మంగళవారం బ్యారెల్‌ ముడి చమురు ధర 1 శాతం పెరిగి 79 డాలర్లకు చేరింది.

సెన్సెక్స్‌ సూచీలో అధిక వెయిటేజీ గల ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంక్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు 1–4 శాతం రేంజ్‌లో నష్టపోయాయి. సెన్సెక్స్‌ మొత్తం 295 పాయింట్ల నష్టంలో ఈ ఐదు షేర్ల వాటానే 189 పాయింట్ల వరకూ ఉంది.

విజయా, దేనా బ్యాంక్‌లను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనం చేస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన.. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్ల నష్టాలకు కారణమైంది. నిప్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీ 5.4% పతనమైంది. ఈ ప్రతిపాదనతో  ప్రయోజనం పొందగలదన్న అంచనాలు ఉన్న దేనా బ్యాంక్‌ 20% అప్పర్‌ సర్క్యూట్‌తో రూ.19.10ను చేరింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా చివరకు 16 శాతం నష్టంతో రూ.113 వద్ద ముగిసింది.

మూడేళ్లలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకి ఇది అత్యధిక పతనం. విజయ బ్యాంక్‌ 6% నష్టంతో రూ.56.40 వద్ద ముగిసింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మార్కెట్‌ క్యాప్‌ రూ.5,727 కోట్లు ఆవిరై రూ.30,013 కోట్లకు, విజయ బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.443 కోట్లు హరించుకుపోయి రూ.7,355 కోట్లకు తగ్గాయి. ఇండియన్‌ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సిండికేట్‌ బ్యాంక్, పీఎన్‌బీ, ఆంద్రా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, ఓబీసీలు 3–9% రేంజ్‌లో నష్టపోయాయి.

click me!