గృహ, వాహన రుణాల ఈఎంఐ మరింత తగ్గడం ఖాయమేనా?!

By Nagaraju penumalaFirst Published Sep 30, 2019, 11:26 AM IST
Highlights

ఆర్బీఐ రెపోరేట్లు తగ్గిస్తే తదనుగుణంగా ఇంటి, వాహనాల రుణాలు తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వ రంగ బ్యాంకులదే. కనుక శుక్రవారం ఆర్బీఐ ప్రకటించే ద్రవ్య పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే బ్యాంకులు కూడా వడ్డీరేట్లు తగ్గించాల్సి ఉంటుంది. తదనుగుణంగా ఇల్లు, వాహనాల రుణాలపై వడ్డీరేట్లు తగ్గుతాయని భావిస్తున్నారు

న్యూఢిల్లీ/ ముంబై: మరోసారి ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు తగ్గించడం ఖాయంగా కనిపిస్తోంది. మంగళవారం నుంచి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్​ నేతృత్వంలో ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం కానున్నది. మూడు రోజుల పాటు జరిగే ఈ చర్చల తరువాత 2019-20 ఆర్థిక సంవత్సరం నాల్గవ ద్వైమాసిక ద్రవ్యవిధానాన్ని శుక్రవారం ప్రకటించనున్నది.

ఈ సారి కూడా ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉన్నదని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్​ పన్నులు తగ్గించడం సహా పలు ఉద్దీపన చర్యలు చేపడుతున్న నేపథ్యమే ఇందుకు కారణం.

మూడు రోజుల పాటు జరిగే ఈ చర్చల తరువాత 2019-20 ఆర్థిక సంవత్సరం నాల్గవ ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ఈనెల నాలుగో తేదీన ప్రకటించనుంది. వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఆర్బీఐ జనవరి నుంచి ఇప్పటి వరకు రెపో రేటును నాలుగు దఫాలుగా 1.10 శాతం మేర తగ్గించింది.

ఆగస్టులో ఎంపీసీ బెంచ్​మార్క్​ రుణ రేటును అసాధారణ రీతిలో 35 బేసిస్​ పాయింట్లు తగ్గించింది. ఫలితంగా రెపోరేటు 5.40 శాతానికి దిగొచ్చింది. బ్యాంకులు తాము పొందుతున్న రెపో రేటు తగ్గింపు ఫలాలను రుణ గ్రహీతలకు బదిలీ చేయాలని ఆర్​బీఐ ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది

ఆర్బీఐపై ఆశలు మందగమనాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం.. కార్పొరేట్ పన్ను రేట్లు, వివిధ ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించింది. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది.

అదే సమయంలో ఆదాయ సేకరణ కూడా బడ్జెట్​ అంచనాల కంటే తక్కువగా ఉంది.ఈ కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి ఆర్బీఐ మరింతగా ద్రవ్య ఉద్దీపనలు అందిస్తుందని ప్రభుత్వం ఆశలు పెట్టుకున్నట్లు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ పేర్కొన్నారు.

ప్రభుత్వం వద్ద తగినన్ని నిధులు లేక ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు చేపట్టడానికి ఆర్బీఐ చొరవ తీసుకోవల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. సప్లై, డిమాండ్​లను పెంచేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈసారి ఆర్​బీఐ కనీసం 25 బేసిస్​ పాయింట్లు తగ్గిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆర్థిక మందగమనం ఉన్నా రిటైల్​ ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండడం కొంత ఊరటనిచ్చే అంశమని నిపుణులు చెబుతున్నారు.

అందువల్ల నవరాత్రులు, దీపావళి పండుగ సీజన్‌లో​ ఆర్బీఐ రేట్లు తగ్గిస్తుందని పారిశ్రామికవేత్తలు ఆశిస్తున్నారు. నిర్మాణ రంగానికి చేయూత ఇచ్చేలా చర్యలు తీసుకుంటుందని అభిప్రాయపడుతున్నారు.

 

click me!