బంగారం ధరలు పైపైకే.. సేల్స్ కోసం సెంట్రల్ బ్యాంకులపై ఒత్తిళ్లు!!

By Sandra Ashok KumarFirst Published May 16, 2020, 11:44 AM IST
Highlights

వివిధ దేశాల్ సెంట్రల్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్లో డిమాండ్, అంతర్జాతీయంగా డాలర్ మారకపు విలువ వంటివి గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరల పెరుగుదలకు కారణం అయ్యాయి. పది గ్రాముల పసిడి బంగారం ధర రెండు రోజుల్లో రూ.1700 పెరిగింది. 

న్యూఢిల్లీ: బంగారం ధరలు వరుసగా మూడో రోజు కూడా పెరిగాయి. అమెరికా-చైనా మధ్య దెబ్బతిన్న సంబంధాలు, వివిధ దేశాల్ సెంట్రల్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్లో డిమాండ్, అంతర్జాతీయంగా డాలర్ మారకపు విలువ వంటివి గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరల పెరుగుదలకు కారణం అయ్యాయి. పది గ్రాముల పసిడి బంగారం ధర రెండు రోజుల్లో రూ.1700 పెరిగింది. 

మరోవైపు కరోనా మహమ్మారి కారణంగా దారుణంగా దెబ్బతిన్న ఆర్థిక రంగం కోలుకునేందుకు వివిధ దేశాలు ప్రకటిస్తున్న ఉద్దీపన చర్యలు కూడా పసిడి ధరల పెరుగుదలకు మరో కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.   

మల్లీ కమోడిటీ ఎక్స్‌చేంజ్‌ (ఎంసీఎక్స్)లో శుక్రవారం ఉదయం జూన్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.9 శాతం పెరిగి  రూ.46,860 పలికింది. సిల్వర్ ఫ్యూచర్స్ 1.3 శాతం పెరిగి రూ.44,721 పలికింది. బంగారం ధర రూ. 46,700 కాస్త అటూఇటు ఎక్కువ కాలం కొనసాగితే రూ. 47 వేలకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.

దేశంలో ఈ ఏడాదిలో కేవలం నాలుగున్నర నెలల్లోనే బంగారం ధర 40 శాతం వరకు పెరిగింది. ఇక, హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 కేరెట్ల బంగారం ధరలు రూ. 350 పెరిగి  10 గ్రాములకు రూ.47,750కు చేరుకుంది. బంగారం ధర పెరగడం ఇది వరుసగా రెండు రోజు. ఢిల్లీలో గురువారం రూ.200 పెరగ్గా, నేడు రూ.250 పెరిగింది.  

also read 13 ఏళ్లలో ట్రిలియనీరుగా ముకేశ్ అంబానీ..కానీ ఆరేళ్లలోపే జెఫ్‌ బెజోస్‌ రికార్డు..

గత నెలలో పది గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో రూ.47,327లకు చేరుకున్నది. వివిధ దేశాల ప్రభుత్వాలు, కేంద్రీయ బ్యాంకులు ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరుగుతున్నాయి. ఉద్దీపన కోసం మరో దఫా చర్చలు ప్రారంభించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం కూడా ఇది ఒక కారణం. 

అంతర్జాతీయ మార్కెట్లో మూడు వారాల గరిష్ఠానికి పెరిగిన ఔన్స్ పసిడి ధర 0.1 శాతం పెరిగి 1730.56 డాలర్లు పెరిగింది. ఈ వారంలో గోల్డ్ ధర రెండు శాతం పెరగడం గమనార్హం. 

అయితే, ఆర్థిక వ్యవస్థల పునరుత్తేజానికి వివిధ దేశాలు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటిస్తుండగా.. కరెన్సీ అందుబాటులో లేక ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలపై అందరి ద్రుష్టి పడింది. 

బంగారం విక్రయిస్తే కరెన్సీ చలామణిలోకి వస్తుందని, ద్రవ్యోల్బణం పెరుగకుండా ఉంటుందని జెఫ్రీన్ అంతర్జాతీయ ఈక్విటీ వ్యూహాల విభాగం చీఫ్ కిస్టోఫర్ వుడ్ అంచనా వేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగరాం 1900 డాలర్లు దాటక పోవచ్చునని పేర్కొన్నారు. 
 

click me!