ఆర్థిక ఉద్దీపనలు కల్పించడం అసాధ్యం: నీతి ఆయోగ్

By Sandra Ashok KumarFirst Published Jan 31, 2020, 12:57 PM IST
Highlights

ఆర్థిక వ్యవస్థ ప్రగతిపథంలో ప్రయాణించడానికి ఉద్దీపనలు కల్పించాల్సిన అవసరమేమీ లేదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఇతర మార్గాల్లో పారిశ్రామిక సంస్థలకు సర్దుబాటు చేయాలని సూచించారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో జీడీపీ వ్రుద్ధిరేటు 4.7 శాతానికి పరిమితం కావడమే ఇబ్బందికరం.
 

న్యూఢిల్లీ: మందగించిన దేశ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచడానికి ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ సూచించారు. ఆర్థిక ఉద్దీపనలు  కల్పించడం అసాధ్యమన్నారు. అయితే, ఆయన 7-8 శాతం వార్షిక వృద్ధిరేటు లక్ష్యంగా వృద్ధిదాయక చర్యలు అవసరమని పేర్కొన్నారు. 

వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాజీవ్ కుమార్‌ సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ద్రవ్యలోటు సమస్యతో సంబంధం లేకుండా దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనాన్ని ఆర్థిక ఉద్దీపనలతో పోగొట్టాలని పలువురు ఆర్థిక నిపుణులు సలహాలు ఇస్తున్నారు. 

also read Budget 2020:ఇప్పటి వరకు ఎంత మంది బడ్జెట్ ప్రవేశపెట్టారో తెలుసా...?

ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక ఉద్దీపనలు ఇవ్వడం కుదరదని, ఇతర మార్గాల్లో ఆర్థిక సాయం మంచిదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్‌ చెప్పారు. ఆర్థిక ఉద్దీపన అంటే ఆర్థిక మందగమనాన్ని నిరోధించడానికి, ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడానికి వివిధ రకాల ప్రోత్సాహకాలు, పన్ను రిబేట్లతో వ్యాపార, పారిశ్రామిక రంగాలకు ప్యాకేజీని ఇవ్వడమే. 

క్షీణించిన పన్ను వసూళ్లు, పడిపోయిన ఎగుమతులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, దిగజారుతున్న ఉత్పత్తి, నిరాశపరుస్తున్న కొనుగోళ్లు, పెచ్చుమీరుతున్న నిరుద్యోగం మధ్య ఆర్థిక ఉద్దీపన అసాధ్యమని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్‌ అన్నారు. మరోలా వ్యాపార, పారిశ్రామిక రంగాలకు చేయూతనివ్వాలని కోరారు.

also read ఆ కారణాల వల్లె రాజీనామా చేశాను :విప్రో సి‌ఈ‌ఓ

ఇంతకుముందే సెప్టెంబర్ నెలలో కార్పొరేట్ పన్ను తగ్గించి వేస్తూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయం తీసున్నారు. ప్రస్తుతం వివిధ రంగాల్లో ప్రగతి సూచీలు సానుకూలంగా ఉన్నాయని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ తెలిపారు. మాన్యుఫాక్చరింగ్ అండ్ సర్వీసింగ్ సూచీలు 52 పాయింట్లపై నమోదయ్యాయని, ఇది విస్తరణకు సంకేతం అని పేర్కొన్నారు. 

ఇటీవలి కాలం వరకు శరవేగంగా ప్రగతిదాయకంగా అభివ్రుద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కీర్తించబడింది. కానీ గత ఐదు త్రైమాసికాల్లో వ్రుద్ధిరేట్ క్రమంగా క్షీణిస్తోంది. చివరకు 2019 జూలై-సెప్టెంబర్ 2019 త్రైమాసికంలో జీడీపీ వ్రుద్ధిరేటు 4.5 స్థాయికి ఆరేళ్ల కనిష్ట స్థాయికి పతనమైంది. 

click me!