గదిలో బంధించి వివాహితపై ఇద్దరు పలుమార్లు రేప్: నిందితుల్లో కానిస్టేబుల్

By telugu teamFirst Published Jul 7, 2020, 7:00 AM IST
Highlights

గదిలో బంధించి ఓ వివాహితపై ఇద్దరు వ్యక్తులు పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో జరిగింది. నిందితుల్లో ఏఆర్ కానిస్టేబుల్ ఉన్నాడు.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. వివాహితపై ఓ ఆర్మ్ డ్ రిజర్వ్ కానిస్టేబుల్ తో పాటు మరో వ్యక్తి అత్యాచారం చేశారు. జిల్లాలోని బుక్కరాయ సముద్రం మండలంలో సోమవారం ఈ ఘటన జరిగింది. 

అనంతపురం రూరల్ మండలం పరిధిలని ఓ గ్రామానికి చెందిన మహిళకు పామిడి మండలం రామరాజుపల్లికి చెందిన నరేష్ తో కొంత కాలంగా పరిచయం ఉంది. సోమవారం ఇద్దరు బక్కరాయసముద్రం మండలం బోయకొట్టాల వద్దకు బైకుపై వెళ్లారు. 

ఆ సమయంలో వారి వద్దకు చెన్నేకొత్తపల్లి మండలం పులేటిపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి వచ్చాడు. తాను పోలీసునంటూ బెదిరించాడు. ఆ తర్వాత మహిళను అనంతపురంలో వదిలి పెడుతానని నమ్మించి బైకుపై ఎక్కించుకుని అనంతపురంలోని కొవ్వూరు నగర్ లో ఉన్న తన గదికి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. 

ఆ తర్వాత తన మిత్రుడు ఏఆర్ కానిస్టేబుల్ సురేంద్రనాథ్ రెడ్డిని పిలిచాడు. అతను కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. సాయంత్రం వరకు మహిళను గదిలో బంధించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించి అనంతపురం ఆర్టీసీ బస్ స్టాండు వద్ద వదిలిపెట్టారు.

ఈ సంఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటికే నరేష్ 100కు డయల్ చేసి సమాచరాం ఇ్చాచడు. ఏఆర్ కానిస్టేబుల్ తో సురేంద్రనాథ్ రెడ్డితో పాటు రాజశేఖర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

click me!