జగనన్నా... ఓసారి నీ ముఖం ఈ అద్దంలో చూసుకో..: షర్మిల పరువు తీస్తోందిగా..!

By Arun Kumar PFirst Published May 5, 2024, 10:13 AM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంటిపోరు తప్పడంలేదు.  అసెంబ్లీ ఎన్నికల వేళ సొంత చెల్లి వైఎస్ షర్మిల చేస్తున్న విమర్శలు వైఎస్ జగన్ పార్టీని డ్యామేజ్ చేసేలా వున్నాయి. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో పార్లమెంట్ తో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. రాబోయే ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించేది ఎవరు? అధికారం చెలాయించేది ఎవరు? అనేది నిర్ణయించే ఎన్నికలివి. దీంతో ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ చాలా సీరియస్ గా తీసుకున్నాయి... దీంతో రాష్ట్ర పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. అయితే అధికార వైసిపిని ఓవైపు ప్రతిపక్ష కూటమి, మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు  వైఎస్ షర్మిల టార్గెట్ చేసారు. వైఎస్ జగన్ ను ప్రతిపక్షాలు పొలిటికల్ గానే విమర్శిస్తుంటే... వైఎస్ షర్మిల మాత్రం రాజకీయంగా, వ్యక్తిగతంగా విమర్శలకు దిగుతున్నారు. ఇటీవల వైఎస్ జగన్ భార్య భారతి చేతిలో రిమోట్ కంట్రోల్ గా మారాడన్న షర్మిల తాజాగా తన అన్న మానసిక పరిస్థితి బాగాలేదన్నారు. ఇలా సొంత చెల్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న ఘాటు విమర్శలు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతున్నాయి. 

వైఎస్ జగన్ కు షర్మిల అద్దం గిఫ్ట్ : 

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన వైఎస్ జగన్ సొంత బాబాయ్, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. గత ఎన్నికల్లో వివేకా హత్యతో జగన్ కు సానుభూతి లభించిందని ... అతడి గెలుపుకు అదికూడా  ఓ కారణం అన్నది ప్రతిపక్షాల వాదన. అప్పుడు సానుభూతి వచ్చిందో లేదో తెలీదుగానీ ఈ ఎన్నికల్లో వైఎస్ వివేకా హత్యలో వైఎస్ జగన్ హస్తం వుందన్న ప్రతిపక్షాల ఆరోపణలు... హంతకులను తమ అన్నే కాపాడుతున్నాడన్న వైఎస్ షర్మిల, వైఎస్ సునీత ఆరోపణలు వైసిపి విజయావకాశాలను దెబ్బతీసేలా కనిపిస్తోంది. అయితే ఇంతకాలం కేవలం వైసిపిని టార్గెట్ చేసిన షర్మిల తాజాగా వైఎస్ జగన్ పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. 

ఇటీవల ఓ ఎన్నికల ప్రచార సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిల వ్యవహారతీరుపైనే కాదు వస్త్రధారణపైనా కామెంట్ చేసారు. పసుపు చీర కట్టుకొని చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్న షర్మిల వైఎస్సార్ వారసురాలు ఎలా అవుతుందంటూ వైఎస్ జగన్ అన్నారు. ఇలా సొంత అన్న తన వస్త్రధారణ గురించి మాట్లాడటంపై సీరియస్ అయిన షర్మిల ఆయనపై వ్యక్తిగత విమర్శలు ప్రారంభించారు.  

వైఎస్ జగన్ మానసిక స్థితిపై తనకు ఆందోళన కలుగుతోందని... ఆయనకు చంద్రబాబు పిచ్చి పట్టిందని షర్మిల అన్నారు. జగన్ వైఖరి  మాలోకాన్ని తలపిస్తోందంటూ ఘాటు విమర్శలు చేసారు. అంతేకాదు ఓ అద్దంను తన అన్నకు పంపుతున్నానని... అందులో ఓసారి ముఖం చూసుకోవాలంటూ షర్మిల ఎద్దేవా చేసారు. తమను చంద్రబాబు మనుషులు అనడం కాదు... ముందు మీ పరిస్థితి ఏమిటో అద్దంలో చూసుకోవాలని అన్నారు. అద్దంలో మీరు కనిపిస్తారో లేక చంద్రబాబు ముఖం కనిపిస్తుందో చూసుకోవాలని వైఎస్ జగన్ కు షర్మిల సూచించారు.

నిజానికి చంద్రబాబు పిచ్చిలో టిడిపిని చాలా బలమైన పార్టీ అనే అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పిస్తున్నదే వైఎస్ జగన్ అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు. వైఎస్ షర్మిల, సునీతలే కాదు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి కూడా చంద్రబాబు మాట వింటారని వైఎస్ జగన్ అంటున్నారు... ఇలా చంద్రబాబు ఎంతో ఫవర్ ఫుల్ అని జగనే చెబుతున్నాడని అన్నారు. మానసిక పరిస్థితి బాగాలేకే జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని  షర్మిల సీరియస్ కామెంట్స్ చేసారు. 

'వైఎస్ జగన్ రిమోట్ భారతి చేతిలో' : 

ఇక గతంలో వైఎస్ జగన్ రిమోట్ ఆయన భార్య వైఎస్ భారతి చేతిలో వుందంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు. గత ఐదు సంవత్సరాలు జగన్ కేంద్రంలోని బిజెపి, ఇంట్లోని వాళ్ల చేతిలో కీలుబొమ్మగా మారారని షర్మిల ఆరోపించారు. అయితే బిజెపి మాదిరిగానే 'B' అక్షరంతో పేరు మొదలయ్యే ఇంటిమనిషి చేతిలో వైఎస్ జగన్ రిమోట్ వుందన్నారు షర్మిల. ఇలా పరోక్షంగా తన వదిన భారతి చేతిలో అన్న వైఎస్ జగన్ రిమోట్ వుందంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు. 

ఇలా  వైఎస్ జగన్ పై షర్మిల చేస్తున్న వ్యక్తిగత వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. షర్మిల తన అన్నగురించి మాట్లాడుతున్న వీడియోలు తెలుగుదేశంతో పాటు ఇతర పార్టీల సోషల్ మీడియా మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. ముందుకు నీ చెల్లి ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వైఎస్ జగన్ ను నిలదీస్తున్నారు. ఇంట్లోని వాళ్లను న్యాయం చేయలేనివాడు ప్రజలకే న్యాయం చేస్తాడంటూ ప్రతిపక్షాలు జగన్ వ్యతిరేకి క్యాంపెయిన్ చేస్తున్నాయి. 

 
 

click me!