ఏపీ రాజధాని అమరావతిలో నెల రోజుల్లో మౌలిక వసతులు కల్పించాలన్న హైకోర్టు తీర్పుపై సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో పలు కీలక అంశాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించింది. అమరావతిలో పనులు మొదలుపెట్టేందుకు 8 నెలల సమయం పడుతుందని తెలిపింది.
ఏపీ రాజధాని (ap capital) అమరావతి నిర్మాణానికి (amaravathi) సంబంధించి సీఎస్ సమీర్ శర్మ (sameer sharma) అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో పలు కీలక అంశాలు వున్నాయి. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు 6 నెలలు కాదు.. 60 నెలలు కావాలని సీఎస్ పేర్కొన్నారు. వర్కర్లు, యంత్రాలను రప్పించేందుకే 2 నెలల సమయం అవసరమని అఫిడవిట్లో సీఎస్ సమీర్ శర్మ వెల్లడించారు. అమరావతిలో పనులు మొదలుపెట్టేందుకు 8 నెలల సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు.
రోడ్ల నిర్మాణం కోసం 16 నెలలు అవసరం అవుతుందని సీఎస్ చెప్పారు. రోడ్ల పనులు పూర్తి చేశాక, డ్రైనేజీ, నీటి సరఫరా మౌలిక సదుపాయాల కల్పనకు 36 నెలల సమయం పడుతుందని సీఎస్ పేర్కొన్నారు. గతంలో రూ.42,231 కోట్లతో పనులు ప్రారంభించారని ఆయన గుర్తుచేశారు. రాజధాని నిర్మాణం కోసం రుణాలపై బ్యాంకులు ఇంకా స్పందించలేదని సీఎస్ తెలిపారు. హైకోర్టు సూచించిన విధంగా రాజధాని నిర్మాణం సీఆర్డీఏకి, ప్రభుత్వానికి సాధ్యం కాదని సీఎస్ పేర్కొన్నారు. ప్రధాన మౌలిక సదుపాయాల కల్పనకే కనీసం ఐదేళ్లు అవసరమని ఆయన అఫిడవిట్లో తెలిపారు. రాజధాని నిర్మాణంపై నిర్దేశించిన గడువును ఎత్తేయాలి లేదా సవరించాలని సీఎస్ హైకోర్టును కోరారు.
కాగా.. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఏపీ హైకోర్టు గత నెల 3వ తేదీన తీర్పునిచ్చింది. నెల రోజుల్లోగా సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. ఈనెల 3 లోగా రైతుల ప్లాట్లలో పనులు పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించింది. గడువు ముగుస్తున్నందున ఏపీ ప్రభుత్వం తరఫున సీఎస్ సమీర్ శర్మ అఫిడవిట్ దాఖలు చేశారు. 190 పేజీలతో కూడిన అఫిడవిట్ను హైకోర్టుకు సమర్పించారు. సీఆర్డీఏ చట్టంలో పనుల పూర్తికి మరో నాలుగేళ్లు పొడిగించామని ప్రభుత్వం నివేదించింది. ప్రభుత్వ నిర్ణయంతో.. 2024 జనవరి వరకు సమయం ఉందని.. హైకోర్టుకు తెలిపింది.
ఇక తీర్పు విషయానికి వస్తే.. శాసన, కార్యనిర్వహక, న్యాయ వ్యవస్థలను వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తూ శాసనం చేసే అధికారం శాసనసభకు లేదని చెప్పింది. రాజధాని ప్రాంతలో రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక సదుపాలయాను నెల రోజుల్లో కల్పించాలని ఆదేశించింది. రాజధాని కోసం సమీకరించిన భూములను రాజధాని నగర నిర్మాణ, రాజధాని ప్రాంత అభివృద్దికి తప్ప.. తాకట్టు పెట్టడానికి, మూడో వ్యక్తికి హక్కు కల్పించొద్దని స్పష్టం చేసింది