భారత్‌ నుంచి తొలిసారి మిస్‌ వరల్డ్ కిరీటం దక్కించుకున్న రీటా ఫరియా ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? సినిమా అవకాశాలు కాదని ఆమె తన ప్యాషన్‌ని వెతుకుంటూ వెళ్లింది.

మిస్‌ వరల్డ్ 2025 పోటీలు ఫైనల్‌కి చేరుకున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్‌లో వేదికగా జరుగుతున్న ఈ పోటీలు దాదాపు ఇరవై రోజులుగా ఆద్యంతం సందడిగా సాగాయి. ఇక విజేత ఎవరో తేలే సమయం వచ్చింది. మరికొన్ని గంటల్లోనే విన్నర్‌ ఎవరో తేలబోతుంది. ప్రపంచ దేశాల నుంచి 108 మంది అందగత్తెలు ఇందులో పాల్గొనగా అంతిమంగా ఒక్కరికే ఈ అందాల కిరీటం దక్కనుంది. ఈ సారి ఎవరికి కిరీటం దక్కుతుందనేది అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. మన ఇండియా నుంచి పోటీలో ఉన్న నందిని గుప్తా విన్నర్‌గా నిలుస్తుందా? చరిత్ర సృష్టిస్తుందా అనేది చూడాలి.

ఇండియా తొలి మిస్ వరల్డ్ విన్నర్‌ ఇప్పుడు ఏం చేస్తుందంటే

ఇదిలా ఉంటే 1966లోనే మన ఇండియాకి మిస్‌ వరల్డ్ కిరీటం దక్కింది. ముంబయ్‌కి చెందిన రీటా ఫరియా తొలిసారి మిస్‌ వరల్డ్ కిరీటం సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. 

మరి రీటా ఫరియా ఇప్పుడు ఏం చేస్తుంది? వరుసగా సినిమా అవకాశాలు క్యూ కట్టినా, వాటినిఎందుకు రిజెక్ట్ చేసింది అనేది తెలుసుకుందాం.

ముంబయిలో మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీలో జన్మించిన రీటా ఫరియా

రీటా ఫరియా పావెల్‌ 1943 ఆగస్ట్ 23న ముంబయిలోని మాతుంగా ప్రాంతంలో జన్మించారు. వారి పేరెంట్స్ కి రీటా రెండో కుమార్తె. వారిది మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ. అప్పట్లోనే తల్లి బ్యూటీ సెలూన్‌ నడిపించేవారు. తండ్రి మినరల్‌ వాటర్‌ ఫ్యాక్టరీలో పనిచేసేవారు.

 ఫరియా హైట్‌లో అబ్బాయిలను మించి ఉండేది. ఆమె ఏకంగా ఐదు అడుగుల 8 అంగుళాలు ఉండేది. లెగ్స్ చాలా హైట్‌ ఉండేవి. దీంతో స్కూల్‌, కాలేజీలో తోటి విద్యార్థులు `మమ్మీ లాంగ్ లెగ్స్` అని ఆటపట్టించేవారట.

తన బలహీనతనే బలంగా మార్చుకున్న రీటా ఫరియా

అవమానాలకు కుంగిపోలేదు రీటా. తన బాడీనే తనకు ప్లస్‌గా మార్చుకునే ప్రయత్నం చేసింది. క్రీడలపై ఫోకస్‌ పెట్టింది. త్రోబాల్‌, నెట్‌ బాల్‌, బ్యాడ్మింటన్‌ వంటి క్రీడల్లో రాణించింది. హాకీలో హ్యాట్రిక్‌ సాధించి సంచలనం సృష్టించింది.

 అట్నుంచి మోడలింగ్‌ వైపు టర్న్ తీసుకుని, మిస్‌ బాంబే పోటీల్లో పాల్గొంది. టైటిల్‌ విన్నర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఈవ్స్ వీక్లీ మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొని విన్నర్‌గా నిలిచింది. 

ఈ గెలుపు ఆమె లైఫ్‌ని మార్చేసింది. మిస్‌ వరల్డ్ 1966 పోటీలకు దారులు వేసింది. అందులోనూ అర్హత సాధించింది. మిస్‌ వరల్డ్ 1966 పోటీల్లో భాగంగా బెస్ట్ ఇన్‌ స్విమ్‌ సూట్‌, బెస్ట్ ఇన్‌ ఈవినింగ్‌వేర్‌ వంటి విభాగాల్లో విన్నర్‌గా నిలిచింది.

1966లో మిస్‌ వరల్డ్ విన్నర్‌గా రీటా ఫరియా

ఇక ఫైనల్‌లో సుమారు 51 మంది ప్రపంచ అందగత్తెలతో పోటీ పడి విన్నర్‌ గా నిలిచింది. మిస్‌ వరల్డ్ 1966 కిరీటాన్ని సొంతం చేసుకుంది. మిస్‌ వరల్డ్ చరిత్రలో ఇండియా నుంచి విన్నర్‌గా నిలిచిన తొలి అందగత్తెగా రికార్డు సృష్టించింది రీటా ఫరియా.

 దీంతో అందరి చూపు రీటాపై పడింది. ముఖ్యంగా సినిమా వాళ్లు ఆమె క్రేజ్‌ని క్యాష్‌ చేసుకోవాలని భావించారు. వరుసగా నిర్మాతలు క్యూ కట్టారు.

సినిమా అవకాశాలను రిజెక్ట్ చేసిన రీటా ఫరియా

రీటా ఫరియా అందాల పోటీలు సినిమా అవకాశాల కోసమే కాదు అని నిరూపించింది. ఎన్ని సినిమా ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేసింది. తనకు ఇష్టమైన రంగంలోకి వెళ్లిపోయింది.

 ప్రపంచ అందగత్తెగా తానేంటో నిరూపించుకుంది. కానీ తన గ్లామర్‌ని వాడుకుని డబ్బులు పోగు చేసుకోవాలని చూడలేదు. కమర్షియల్‌ బ్రాండ్స్ కి లొంగలేదు. తన ప్యాషన్‌ని వెతుక్కుంటూ వెళ్లింది. తనకిష్టమైన డాక్టర్‌ వృత్తిలోకి వెళ్లి సెటిల్‌ అయ్యింది.

డాక్టర్ గా సెటిల్‌ అయిన రీటా ఫరియా

మిస్‌ వరల్డ్ విన్నర్‌గా నిలిచిన తర్వాత మెడికల్‌లో చేరి ఎంబీబీఎంస్‌ పూర్తి చేసింది. ఆ తర్వాత లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌ ఆసుపత్రిలో హైయ్యర్‌ స్టడీస్‌ చేసింది. 

అనంతరం 1971లో డాక్టర్‌ డేవిడ్ పానెల్‌ని పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ అయ్యింది. లండన్‌ నుంచి ఐర్లాండ్‌కి షిఫ్ట్ అయ్యింది. అక్కడే డాక్టర్‌గా పనిచేస్తుంది రీటా. ఆమెకి ఇద్దరు కుమార్తెలు.