దేశం కోసం పోరాటం చేయడానికి రంగంలోకి దిగిన ఆమెకు తండ్రి కన్నుమూశారన్న విషాదవార్త చెవిన పడింది. దేశం కోసం ఆట మీద దృష్టిపెడితే.. తండ్రి చివరి చూపు కూడా దక్కదని ఆమెకు తెలుసు.
దేశం కోసం పోరాటం చేయడానికి రంగంలోకి దిగిన ఆమెకు తండ్రి కన్నుమూశారన్న విషాదవార్త చెవిన పడింది. దేశం కోసం ఆట మీద దృష్టిపెడితే.. తండ్రి చివరి చూపు కూడా దక్కదని ఆమెకు తెలుసు. అయినా ఆ బాధను దిగమింగి దేశం కోసం పోరాడింది. చివరకు విజయం సాధించింది. ఆమె భారత హాకీ క్రీడాకారిణి లాల్ రెమ్సియామీ.
మిజోరాం రాష్ట్రానికి చెందిన లాల్ రెమ్సియామీ.. భారత హాకీ మహిళల జట్టు క్రీడాకారిణి. గత ఆదివారం ఈ జట్టు జపాన్లోని హిరోషిమాలో జరిగిన హాకీ ఎఫ్ఐహెచ్ సిరిస్లో ఆతిథ్య జపాన్పై గెలిచి సిరీస్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అంతేగాక.. ఈ టోర్నీలో ఫైనల్కు చేరి 2020 ఒలింపిక్స్కు అర్హత కూడా సాధించింది. అయితే ఫైనల్ మ్యాచ్ జరగడానికి రెండు రోజుల ముందు గత శుక్రవారం లాల్రెమ్సియామీ తండ్రి లాల్తన్సంగా జోత్ గుండెపోటుతో మృతిచెందారు.
ఈ విషయం ఆమెకు తెలిసినా... బాధను దింగమింగి దేశానికి ప్రాధాన్యత ఇచ్చింది. మ్యాచ్ పై దృష్టి పెట్టి జట్టు గెలవడానికి చెమటోడ్చింది. తండ్రి ఆఖరి చూపుకు వెళ్లిరమ్మని కోచ్ చెప్పినా ఆమె వినకపోవడం గమనార్హం.నన్ను చూసి నా తండ్రి గర్వపడాలంటే నేను ఇక్కడే ఉండి టోర్నీలో ఆడాలి’ అని ఆమె కోచ్కు చెప్పారట.
అందుకే ఆమె త్యాగాన్ని గుర్తించి ఈ గెలుపుని లాల్ రెమ్సియామి తండ్రికి అంకితం చేశారు. ఈ ఘటనతో లాల్ రెమ్సియామి పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది.
