జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే సి. బాగన్న ఇకలేరు..
జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే సి. బాగన్న అనారోగ్యంతో 82వ యేట శుక్రవారం రాత్రి మృతి చెందారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీనుంచి పోటీచేసి గెలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పి. నర్సింహారెడ్డి మీద 35వేల భారీ మెజార్టీతో గెలిచారు.
జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే సి. బాగన్న అనారోగ్యంతో 82వ యేట శుక్రవారం రాత్రి మృతి చెందారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీనుంచి పోటీచేసి గెలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పి. నర్సింహారెడ్డి మీద 35వేల భారీ మెజార్టీతో గెలిచారు.
కొంతకాలంగా బాగన్న అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. బాగన్న జహీరాబాద్ ఎంపీపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
1984 - 1989 వరకు ఎంపీపీ అధ్యక్షుడిగా కొనసాగారు. జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అయితే 1994 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెసేతర పార్టీ తరఫున విజయం సాధించిన మొట్టమొదటి వ్యక్తి బాగన్న. 1999 ఎన్నికల్లో బాగన్న తిరిగి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ దక్కలేదు. ఆయన స్థానంలో టీడీపీ జి. గుండప్పకు టికెట్ కేటాయించింది. 2004 ఎన్నికల్లో టీడీపీ తిరిగి బాగన్నకు టికెట్ కేటాయించింది.
అయితే ఆ టైంలో బాగన్న ఓటమి పాలయ్యారు. 2008లో బీజేపీలో చేరి 2009 ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం అధికార టీఆర్ఎస్ లో చేరారు. బాగన్న మరణంలో జహీరాబాద్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం బాగన్న అంత్యక్రియలు జహీరాబాద్లో నిర్వహించనున్నట్లు బంధువులు పేర్కొన్నారు.
బాగన్నకు ఇద్దరు కొడుకులు గోపాల్, రాజశేఖర్, ఇద్దరు కూతుర్లు పద్మమ్మ, అనూశమ్మ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే సి. బాగన్న మృతిపై సీఎం కె.చంద్రశేఖరరావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాసేవకోసం జీవితం అంకితం చేసిన చెంగల్ బాగన్న నేటి తరం నాయకులకు ఆదర్శ ప్రాయుడని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.