వైఎస్ షర్మిల ఖమ్మం సభకు విజయమ్మ ముఖ్య అతిథి?
ఈ నెల 9వ తేదీన ఖమ్మంలో జరిగే వైఎస్ షర్మిల సంకల్ప సభకు ఆమె తల్లి వైఎస్ విజయమ్మ హాజరవుతారని అంటున్నారు. సభలో వైఎస్ విజయమ్మ షర్మిలకు ఆశీస్సులు అందిస్తారని చెబుతున్నారు.
హైదరాబాద్: తెలంగాణలో పార్టీని స్థాపించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న వైఎస్ షర్మిల ఖమ్మం బహిరంగ సభకు ఆమె తల్లి వైఎస్ విజయమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నెల 9వ తేదీన వైఎస్ షర్మిల కోవిడ్ నిబంధనల మేరకు ఖమ్మంలో సంకల్ప సభను నిర్వహించనున్నారు. ఈ సభలో ఆమె తన పార్టీ పేరును కూడా ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది.
షర్మిల ఖమ్మం సభకు అనుచరులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. షర్మిలకు ఆశీస్సులు అందించడానికి వైఎస్ విజయమ్మ ఆ సభకు హాజరవుతారని చెబుతున్నారు. షర్మిల ఈ నెల 9వ తేదీన హైదరాబాదు నుంచి ఖమ్మం బయలుదేరుతారు. దారిలో ఆరు చోట్ల షర్మిలకు స్వాగతం చెప్పడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఖమ్మం పెవిలియన్ మైదానంలో షర్మిల లక్ష మందితో సభ నిర్వహించాలని భావిస్తున్నారు. కొత్త పార్టీ పేరును, పార్టీ గుర్తును, పార్టీ జెండాను, పార్టీ నియమావళిని, సిద్ధాంతాలను సభలో షర్మిల ప్రకటిస్తారని చెబుతున్నారు.
సభ నిర్వహణకు అనుమతి కోరుతూ షర్మిల అనుచరులు ఖమ్మం నగర పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ కు దరఖాస్తు పెట్టుకున్నారు. దాంతో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సభ నిర్వహించుకునే విధంగా పోలీసు శాఖ అనుమతి ఇచ్చింది.